త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల ‘దగాపాలన’

Vemula Prashanth Reddy | ఎన్నికల సమయంలో ప్రజలకు 6 గ్యారెంటీలు, వివిధ డిక్లరేషన్ల పేరుతో 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 1,000 రోజుల్లో ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను నిలువునా వంచించిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

S

Telangana | Published On Sep 2, 2026, 8.01 pm IST

Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల ‘దగాపాలన’
Advertisement
  • 420 హామీలు ఎగ్గొట్టిన ‘చార్ సౌ బీస్’ కాంగ్రెస్ ప్రభుత్వం
  • ఇందిర‌మ్మ ఇళ్ల పేరుతో పేద‌ల‌పై 6 ల‌క్ష‌ల అప్పుల భారం
  • ఉద్యోగుల‌కు డీఏలు, పీఆర్సీ ఎగ‌వేత
  • హామీల అమలుపై మాట మార్చిన మ‌హేశ్ గౌడ్‌
  • హామీలు అమలయ్యే వరకు ప్రజాక్షేత్రంలో రాజీలేని పోరాటం
  • బాల్కొండలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

Vemula Prashanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఎన్నికల సమయంలో ప్రజలకు 6 గ్యారెంటీలు, వివిధ డిక్లరేషన్ల పేరుతో 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 1,000 రోజుల్లో ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను నిలువునా వంచించిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదని, ఇది ముమ్మాటికీ 1,000 అబద్ధాల "దగాపాలన" అని ఆయన అభివర్ణించారు.

బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ,420 హామీల వైఫల్యాలను సూచిస్తూ రూపొందించిన 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో మానవహారం, ధర్నా చేపట్టారు.

అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ వర్గాలకు పడ్డ బకాయిలను లెక్కలతో సహా ఆధారాలతో ప్రజల ముందుంచారు. ఎన్నికల సమయంలో డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారెంటీ కార్డులపై తొలి సంతకం చేసి, మొదటి నెలలో లేదా 100 రోజుల్లోనే అన్ని పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రసంగించారని గుర్తుచేశారు. అలాగే ప్రచార సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గ్యారెంటీ కార్డులను ప్రజల ఇళ్లకు స్వయంగా పంపిణీ చేస్తూ, ఈ కార్డులను భద్రంగా దాచుకుంటే అధికారం రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను వేదికపై ఎల్ఈడీ స్క్రీన్‌లలో ప్రదర్శించి కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్యే బట్టబయలు చేశారు.

1,000 రోజులు గడిచినా హామీలు అమలు కాకపోగా, నేడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియా ముఖంగా "మేము 100 రోజుల్లో అమలు చేస్తామని ఎక్కడా చెప్పలేదు, ఐదేళ్లలో చేస్తామన్నాం" అంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మాట మార్చడం సిగ్గుచేటని మండిపడ్డారు.

స్థలం లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఉచితంగా ఇస్తామని ప్రకటించి చేతులెత్తేశారు. కేసీఆర్ హయాంలో నయాపైసా ఖర్చు లేకుండా బాల్కొండలోనే 300 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి తాళాలు అందజేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామానికి అరకొరగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణ బిల్లుల్లో రూ. 3.60 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా రూ. 1.40 లక్షలు ఎగ్గొట్టడంతో ఒక్కో పేద కుటుంబంపై రూ. 5 లక్షల నుండి రూ. 6 లక్షల వరకు అప్పుల భారం పడింది అని మాజీ మంత్రి తెలిపారు.

విద్యార్థులకు ‘యువ వికాసం’ కింద రూ. 5 లక్షల బ్యాంక్ గ్యారెంటీ కార్డు, చదువుకునే యువతులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీల హామీలను గాలికొదిలేశారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4,000 చొప్పున 33 నెలలకు ప్రతి నిరుద్యోగికి రూ. 1,32,000 నిరుద్యోగ భృతి బకాయి పడ్డారు. తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మూడేళ్లలో కేవలం 12,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్లు ఇచ్చి, కేసీఆర్ హయాంలో పూర్తయిన 70 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ ఇవ్వకుండా, 6 డీఏలను పెండింగ్‌లో పెట్టి, హక్కుల కోసం ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు ప్రజల తరఫున బీఆర్‌ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించి ఇచ్చిన హామీలు అమలు చేసేలా నియోజకవర్గంలో తదుపరి కార్యాచరణను ప్రకటించారు

గురువారం వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద రైతుల సమస్యలపై భారీ 'రైతు సదస్సు' ఏర్పాటు చేశామన్నారు. శుక్ర‌వారం మోర్తాడ్‌లో మహిళా సమస్యలు, పింఛన్లు, మహాలక్ష్మి బకాయిలపై వంటా-వార్పుతో 'మహిళా సదస్సు ఏర్పాటు చేశామని, శ‌నివారం భీమ్‌గల్‌లో విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై 'విద్యార్థి-యువజన సదస్సు ఏర్పాటు చేశామన్నారు.

సెప్టెంబర్ 6, 7, 8 తేదీలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బూత్ కమిటీల ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం పడ్డ బకాయిల లెక్కలతో కూడిన కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసి ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది అని ఎండ, వాన, పోలీసుల నిర్బంధాలను లెక్కచేయకుండా కేసీఆర్ సైనికులుగా ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ మెడలు వంచుతామని, తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్, కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement