త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao vs Revanth Reddy | రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో తెలంగాణ జల హక్కులకే ముప్పు: సీఎంకు హరీశ్ రావు బహిరంగ లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ చారిత్రక కనిష్టానికి పడిపోయిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు.

J

Telangana | Published On Jun 5, 2026, 3.53 pm IST

Harish Rao vs Revanth Reddy | రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో తెలంగాణ జల హక్కులకే ముప్పు: సీఎంకు హరీశ్ రావు బహిరంగ లేఖ
Advertisement
  • కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల మోటార్లు దెబ్బతినడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శ
  • 2025-26లో కృష్ణా జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ 74.90% వాడుకుంటే, తెలంగాణ వాడకం చారిత్రక కనిష్టమైన 25.10 శాతానికి పడిపోయిందని ఆందోళన
  • లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పగటిపూట మాత్రమే విద్యుత్ ఇవ్వాలనే నిర్ణయంతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని హెచ్చరిక
  • ప్రభుత్వం వెంటనే రైతు డిస్కం (Rythu DISCOM) ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్

Harish Rao vs Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, జల హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం రాసిన బహిరంగ లేఖలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పదేపదే హెచ్చరించినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులలో మోటార్లు దెబ్బతిన్నాయని, తెలంగాణ జల హక్కులు తీవ్ర ప్రమాదంలో పడ్డాయని ఆయన ఆరోపించారు.

పంపులు, మోటార్ల డ్యామేజీకి బాధ్యులెవరు?

గత ఏప్రిల్ 7వ తేదీన (07-04-2026) ఇరిగేషన్ మంత్రికి రాసిన లేఖలోనే భారీ కెపాసిటీ ఉన్న మోటార్లను తరచూ ఆన్, ఆఫ్ చేయడం వల్ల ఎలక్ట్రో-మెకానికల్ ఎక్విప్‌మెంట్ (Electro-mechanical equipment) పై తీవ్ర ఒత్తిడి పడి షాఫ్ట్‌లు, బేరింగ్స్ దెబ్బతింటాయని తాను హెచ్చరించినట్లు హరీశ్ రావు గుర్తుచేశారు.

అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంపింగ్ స్టేషన్‌తో పాటు దేవాదుల ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పంపులు, మోటార్లు డ్యామేజ్ అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సోలార్ పవర్ (Solar Power) ఆధారంగా పగటిపూట మాత్రమే పంపులు నడపాలని ట్రాన్స్‌కో (Transco) సూచించడం, అందుకు తగ్గట్టుగా జీవో నెం.8 (G.O.Ms.No.8) తీసుకురావడం ప్రాజెక్టుల మనుగడకే ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

ఈ విధానాల వల్లే పంపులకు నష్టం జరిగి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు.

చారిత్రక కనిష్టానికి కృష్ణా జలాల వాడకం

కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ (KWDT-II) తాత్కాలిక ఏర్పాట్ల ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణకు 34 శాతం, ఏపీకి 66 శాతం వాటా ఉంది. కానీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ నీటి వినియోగం అత్యంత దారుణంగా పడిపోయిందని హరీశ్ రావు గణాంకాలతో సహా వివరించారు. 2024-25లో ఏపీ తన వాటాకు మించి 72.73 శాతం నీటిని వాడుకుంటే, తెలంగాణ కేవలం 27.27 శాతం మాత్రమే వినియోగించుకుందని ఆయన తెలిపారు. ఇక 2025-26 నాటికి ఏపీ వాడకం 74.90 శాతానికి పెరగగా, తెలంగాణ వినియోగం చారిత్రక కనిష్ట స్థాయికి అంటే 25.10 శాతానికి పడిపోవడం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు.

బీఆర్ఎస్ (BRS) ప్రధాన డిమాండ్లు ఇవే

24 గంటల కరెంట్: లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పంపింగ్ సీజన్‌లో 24 గంటల పాటు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి.

రైతు డిస్కం రద్దు: వ్యవసాయం, సాగునీటికి ముప్పు తెచ్చేలా ఉన్న 'రైతు డిస్కం' (Rythu DISCOM) కాన్సెప్ట్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలి.

నీటి హక్కుల సాధన: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను పూర్తిగా వినియోగించుకునేలా తక్షణ చర్యలు చేపట్టాలి.

నిధుల కేటాయింపు: కాళేశ్వరం, దేవాదుల సహా అన్ని ప్రధాన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, ఆధునీకరణ కోసం బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement