త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హ‌రీశ్ రావు

Harish Rao | భూభారతి (Bhu Bharathi) పోర్టల్ నుంచి 22A నిషేధిత జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశార‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) ప్ర‌శ్నించారు. తక్షణమే దానిని పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని, ప్రొహిబిటెడ్ జాబితా వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

G

Telangana | Published On Aug 24, 2026, 7.54 am IST

Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: భూభారతి (Bhu Bharathi) పోర్టల్ నుంచి 22A నిషేధిత జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశార‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) ప్ర‌శ్నించారు. తక్షణమే దానిని పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని, ప్రొహిబిటెడ్ జాబితా వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల ఆస్తుల‌ను లాక్కుంటే కాంగ్రెస్ పార్టీ (Congress) మాడి మ‌సైపోవ‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. 22A జాబితాను వెంటనే రద్దు చేయాల‌ని, లేన‌ట్ల‌యితే అసెంబ్లీని స్తంభింపజేస్తామ‌ని, సచివాలయాన్ని ముట్టడిస్తామ‌ని హెచ్చ‌రించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే రాహుల్ గాంధీ (Rahul Gandhi) చోద్యం చూస్తున్నారా అని మండిప‌డ్డారు. 30 శాతం కమీషన్ల కోసమే పక్కా రిజిస్టర్డ్ ఇండ్ల‌ను స‌ర్కారు నిషేధిత జాబితాలో పెడుతున్నది ధ్వ‌జ‌మెత్తారు. హైద‌రాబాద్ బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి, హేమానగర్ కాలనీలను ప్రభుత్వం అకారణంగా 22-A నిషేధిత జాబితాలో చేర్చిన నేపథ్యంలో.. తీవ్ర ఆందోళనలో ఉన్న ఆయా కాలనీల వాసులకు బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఒక ప్రభుత్వం అనేది ప్రజల సమస్యలు పరిష్కరించాలి. ప్రజల ఇబ్బందులు తొలగించడానికి పని చేయాల‌న్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు లేని సమస్యలు సృష్టించి వారిని తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నద‌ని విమ‌ర్శించారు.

`మధ్యతరగతి కుటుంబాలు కడుపుకట్టుకుని, పచ్చడి మెతుకులు తిని, రూపాయి రూపాయి కూడబెట్టుకుని బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఇళ్లు కట్టుకుంటారు. పిల్లల పైచదువుల కోసం విదేశాలకు పంపేందుకు ఇల్లు కుదువబెట్టి లోన్ తీసుకుందామంటే మా ఇల్లు 22Aలో ఉందని బ్యాంకులు అప్పు ఇవ్వట్లేదని స్వప్న అనే సోదరి ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డ పెళ్లికో, ఆపదకో ఇల్లు అమ్ముకుందామన్నా అమ్ముకోలేని అయోమయ పరిస్థితిలోకి నెట్టేశారు.

ర‌ద్ద‌యిన చ‌ట్టాన్ని మ‌ళ్లీ తెచ్చి..

1998లో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాం 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ను (Land Ceiling) ఎత్తేశారు. ఎప్పుడో రద్దయిన చట్టాన్ని మళ్లీ తెచ్చి, పట్టా భూములను 22A నిషేధిత జాబితాలో పెట్టి వసూళ్లకు పాల్పడాలని చూస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను, ఎస్సీల అసైన్డ్ భూములను సైతం తెగనమ్ముతోంది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో (KPHB) ఉన్న 1000 గజాల పార్కును కూడా అమ్మకానికి పెట్టారు. ఆఖరికి గుడి కట్టడానికో, బడి కట్టడానికో, దవాఖానాకో, స్మశానానికో కూడా జాగ లేని పరిస్థితి సృష్టించారు. మరోవైపు కూకట్ పల్లిలోని 1000 గజాల ప్రైవేటు ప్లే గ్రౌండ్‌ను కూడా ప్రభుత్వం తనదే అంటున్న‌ది.

ప్ర‌భుత్వానిది తుగ్లక్ చర్య..

తప్పు చేసి నిషేధిత జాబితాలో పెట్టింది మీరు.. మీ కమీషన్ల కోసం చేసిన తప్పుకు సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలి? ఎందుకు అప్లికేషన్లు పెట్టుకోవాలి? ఇలా ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పుకోవాలని ఆలోచించడమే కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ చర్య. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Pongulati Srinivas Reddy).. తప్పు చేసింది మీరు, కేవలం క్షమాపణలు చెప్పి తప్పించుకోవాలని చూడకండి. అప్లికేషన్లతో సంబంధం లేకుండా ఆ భూములను 22A నుంచి తొలగించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. అధికారులు చేసిన తప్పు వెనుక దాక్కుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రజల పాదాల కింద నలిగిపోతారా?

ఢిల్లీలో 'నీట్' పరీక్ష పేపర్ లీకు గురించి యువత తిరగబడితే.. కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. నువ్వు చేసిన అవినీతి, స్కాములను ప్రజలు ఇన్నాళ్లూ భరించారు.. కానీ ఇప్పుడు వాళ్ల సొంత ఇళ్లనే లాక్కుంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. తక్షణమే ఈ సమస్య పరిష్కరిస్తారా? లేక ప్రజల పాదాల కింద నలిగిపోతారో తేల్చుకోండని హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ హైకమాండ్ ఈ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ (Real Estate) వ్యాపారుల చేతిలో పెట్టింది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులే. వీళ్లు రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే.. రాహుల్ గాంధీ చోద్యం చూస్తున్నారా?

మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మాత్రమే తెలుసు.. కానీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజల పక్షాన పోరాటం చేయడం తెలుసు, మీ మెడలు వంచడం తెలుసు. మీ మెడలు వంచైనా సరే ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రజల ఇళ్లను 22A జాబితా నుంచి తొలగించకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం.. అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తాం.

పోరాటినికి బీఆర్ఎస్ రెడీ..

ఎటువంటి పోరాటానికైనా బీఆర్ఎస్ సిద్ధం. ఈ జాబితాలను తొలగించకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోవడం ఖాయం. వాస్తవానికి ఆన్లైన్లో భూభారతి రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో 22A నిషేధిత జాబితాలను ప్రభుత్వం పూర్తిగా మాయం చేసింది. మొత్తం హైదరాబాద్ (Hyderabad) నగరాన్నే ఈ పోర్టల్ నుంచి బ్లాక్ చేశారు. ఎందుకు రాత్రికి రాత్రి ఈ పోర్టల్‌ను మాయం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ బ్లాకింగ్ పేరు మీద రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఇంకేమైనా విలువైన ల్యాండ్లను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారా? తక్షణమే 22A ప్రొహిబిషన్ జాబితాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని, వివరాలు బయటపెట్టాలని బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం.

Advertisement
Advertisement