త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gandra | ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: గండ్ర వెంకటరమణ రెడ్డి

P

Telangana | Published On May 19, 2026, 3.36 pm IST

Gandra | ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: గండ్ర వెంకటరమణ రెడ్డి
Advertisement

Gandra | రాష్ట్రంలో ఆరుగాలం రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ధాన్యం సేక‌ర‌ణ‌లో ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ విష‌యంలో ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. గన్ని బ్యాగుల ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పలుమార్లు వెళ్లేందుకు సమయం కేటాయిస్తున్నప్పటికీ రైతుల సమస్యలను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు.

రైతు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి నిజమైన రైతు సమస్యలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో భారీగా తరుగు తీస్తున్నారని, వంద కిలోల ధాన్యానికి ఏడు కిలోలకు పైగా కోత విధిస్తున్నారని ఆరోపించారు. మక్కలు పండించిన రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, భూపాలపల్లి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మక్కలు కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ రైతు బాంధవుడిగా నిలిచారని, రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గండ్ర గుర్తుచేశారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం యాప్ ప్రవేశపెట్టడం రైతులకు ఉపయోగం కంటే ఇబ్బందులు ఎక్కువగా తెచ్చిందన్నారు. జూన్ నెలలో యూరియా కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించిన గండ్ర.. రైతుల కన్నీళ్లకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని స‌ర్కారును హెచ్చరించారు.

Advertisement
Advertisement