త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ప్ర‌శ్నాప‌త్రాల లీక్‌ను అరిక‌ట్టాల‌ని పిల్‌.. కేంద్రం, రాష్ట్రాల‌కు సుప్రీం నోటీసులు..

Supreme Court | పోటీ పరీక్షలు, ప్రభుత్వ నియామక పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

P

National | Published On Aug 18, 2026, 3.18 pm IST

Supreme Court | ప్ర‌శ్నాప‌త్రాల లీక్‌ను అరిక‌ట్టాల‌ని పిల్‌.. కేంద్రం, రాష్ట్రాల‌కు సుప్రీం నోటీసులు..
Advertisement

Supreme Court | పోటీ పరీక్షలు, ప్రభుత్వ నియామక పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పేపర్ లీకేజీకి పాల్పడిన నిందితులు, వారి కుటుంబ సభ్యుల చర, స్థిరాస్తులను దర్యాప్తు చేసి స్వాధీనం చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం మంగళవారం న్యాయవాది అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించింది. త‌ర్వాతి విచారణను సెప్టెంబరు 25కు వాయిదా వేసింది.

నిందితుల ఆస్తులపై దర్యాప్తు

పేపర్‌ లీకేజీకి పాల్పడిన వారితో పాటు ఈ నేరంలో భాగస్వాములైన వ్యక్తుల మొత్తం ఆస్తులను అంచనా వేసి దర్యాప్తు చేయాలని పిటిషనర్‌ కోరారు. వారి కుటుంబ సభ్యుల ఆస్తులపైనా విచారణ జరపాలని పేర్కొన్నారు. అక్రమ ఆస్తులు, నేరపూరిత కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆస్తులు ఉన్నట్లు దర్యాప్తులో తేలితే అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్‌ నిరోధక చట్టం, బినామీ ఆస్తుల చట్టం, బ్లాక్‌ మనీ చట్టాల కింద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పేపర్‌ లీకేజీ కేసుల్లో దోషులుగా తేలిన వారికి విధించే శిక్షలను ఏకకాలంలో కాకుండా వరుసగా అమలు చేయాలని కూడా పిటిషన్‌లో కోరారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను నిరోధించవచ్చని పిటిషనర్‌ పేర్కొన్నారు. పేపర్‌ లీకేజీలను ఎదుర్కొనేందుకు ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి మూడు నెలల్లో నివేదిక సమర్పించేలా న్యాయ కమిషన్‌ను ఆదేశించాలని ప్రత్యామ్నాయంగా కోరారు.

విద్యార్థుల హక్కులకు భంగం

పేపర్‌ లీకేజీలను అడ్డుకోవడం, నిందితులను గుర్తించి దర్యాప్తు చేయడం, న్యాయపరంగా శిక్షించడంలో వైఫల్యం చెందడం వల్ల విద్యార్థుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 14, 16, 19, 21 అధికరణాలను ఇందుకు ప్రస్తావించారు. పేపర్‌ లీకేజీలను నిరోధించేందుకు ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చినా.. దర్యాప్తు, విచారణ పూర్తి చేయడానికి నిర్దిష్ట గడువు లేకపోవడం సహా వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని పిటిషనర్‌ తెలిపారు. పేపర్‌ లీకేజీల కారణంగా నెలలు, సంవత్సరాల తరబడి పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పరీక్షలు రద్దు కావడం, వాయిదా ప‌డ‌డం వల్ల వారి విద్య, ఉద్యోగ ప్రణాళికలకు ఆటంకం కలుగుతోందని తెలిపింది. దీర్ఘకాలిక కోచింగ్‌, పరీక్షల సన్నద్ధత కోసం కుటుంబాలు చేసిన ఖర్చులు వృథా కావడంతో ఆర్థిక భారం పెరుగుతోందని పేర్కొన్నారు. కొన్ని కుటుంబాలు అప్పులపాలవుతున్నాయని తెలిపారు. లీకేజీల కారణంగా విద్యార్థుల్లో మానసిక, శారీరక ఒత్తిడి పెరిగి తీవ్ర మానసిక సమస్యలకు దారితీస్తోందని, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలూ చోటుచేసుకున్నాయని పిటిషన్‌లో ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement