త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | హ‌రీశ్ ఎఫెక్ట్‌.. హ్యామ్ రోడ్ల‌లో ఎక్సెస్ 5 శాత‌మే..!

Harish Rao | రోడ్లు, భ‌వ‌నాల శాఖ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్ట‌నున్న హ్యామ్ రోడ్ల‌లో పెద్ద ఎత్తున అవినీతి జ‌రుగుతుంద‌ని నిత్యం కాంగ్రెస్ స‌ర్కార్‌ను వెంటాడిన మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పోరాటం ఎట్ట‌కేల‌కు ఫ‌లించింది.

S

Telangana | Published On May 24, 2026, 5.50 pm IST

Harish Rao | హ‌రీశ్ ఎఫెక్ట్‌.. హ్యామ్ రోడ్ల‌లో ఎక్సెస్ 5 శాత‌మే..!
Advertisement

25 శాతం ఎక్సెస్‌తో టెండ‌ర్లు వ‌ద్దు
ఎక్సెస్ 5 శాత‌మే ఉండాల‌న్న సీఎం
మ‌రోసారి హ్యామ్ రోడ్ల నివేదిక‌లో మార్పులు
ఆ త‌ర్వాత‌నే కేబినెట్ ముందుకు ఫైలు
హ‌రీశ్‌రావు దాడితో వెన‌క్కి త‌గ్గిన రేవంత్ స‌ర్కార్

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : రోడ్లు, భ‌వ‌నాల శాఖ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్ట‌నున్న హ్యామ్ రోడ్ల‌లో పెద్ద ఎత్తున అవినీతి జ‌రుగుతుంద‌ని నిత్యం కాంగ్రెస్ స‌ర్కార్‌ను వెంటాడిన మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పోరాటం ఎట్ట‌కేల‌కు ఫ‌లించింది. 25 శాతం ఎక్సెస్‌తో టెండ‌ర్లు వేశార‌ని, దీంతో రూ. 5000 కోట్ల భారం ప్ర‌భుత్వంపై ప‌డుతుంద‌ని హ‌రీశ్‌రావు ప‌లు సంద‌ర్భాల్లో పేర్కొంటూ రేవంత్ స‌ర్కార్ అవినీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. అంతేకాదు హ్యామ్ రోడ్ల అవినీతిపై ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టి ప్ర‌భుత్వాన్ని చీల్చిచెండాడారు. మొత్తానికి హ‌రీశ్‌రావు దాడిని త‌ట్టుకోలేక‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది. ఈ ఒక్క విష‌యంలోనే కాదు.. అనేక కుంభ‌కోణాల‌ను హ‌రీశ్‌రావు బ‌ట్ట‌బ‌య‌లు చేస్తూ.. కాంగ్రెస్ స‌ర్కార్‌పై నిప్పు క‌ణిక‌లై మండిప‌డ్డారు.

ఇటీవ‌ల హ్యామ్ టెండ‌ర్ల ఫైనాన్షియ‌ల్ బిడ్‌ల‌ను తెర‌వ‌గా.. గుత్తేదారులు అంచ‌నా కంటే ఎక్కువ‌గా ధ‌ర‌ల‌ను కోట్ చేశారు. దీంతో హ‌రీశ్‌రావు ఆరోప‌ణ‌లకు మ‌రింత బ‌లం చేకూరింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో సీఎం రేవంత్ జోక్యం చేసుకుని.. 5 శాతానికి మించి ఎక్సెస్ ఉండ‌కూడ‌ద‌ని చెప్ప‌డంతో మ‌రోసారి నివేదిక‌లో మార్పులు చేసి కేబినెట్ ముందు ఉంచిన‌ట్లు తెలిసింది.

హ్యామ్ రోడ్ల‌పై హ‌రీశ్‌రావు ఆరోప‌ణ‌లివే..( మే 1, 2026)

హ్యామ్ మోడల్ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. 25 శాతం ఎక్సెస్‌తో టెండ‌ర్లు వేశారు. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఈ అవినీతిపై ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టాం. ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్‌లో రూ. 11 వేల కోట్లకు టెండర్ పిలిస్తే ఎక్సెస్‌తో కలిసి దాదాపుగా రూ. 15 వేల కోట్ల వరకు పోయింది. పంచాయతీ రాజ్‌లో రూ. 6 వేల కోట్లతో టెండర్ పిలిస్తే దాదాపుగా రూ. 7 నుంచి రూ. 8 వేల కోట్ల వరకు అవుతుంది. ఎక్సెస్ టెండర్ వల్ల రూ. 5 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. హ్యామ్ మోడ‌ల్ రోడ్ల కోసం 60 శాతం బ్యాంకు నుంచి అప్పు తెచ్చి, 30 ఇన్‌స్టాల్‌మెంట్ల‌లో 15 ఏళ్ల పాటు వ‌డ్డీతో స‌హా బ్యాంక్‌కు చెల్లించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజలపై తీవ్రమైన భారంతో పాటుగా రాబోయే ప్రభుత్వాలపై కూడా తీవ్రమైన భారం పడుతుంది. బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ 5 శాతానికి మించి ఎక్సెస్ టెండర్లు ఇవ్వలేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేసి, వెంటనే ఈ ప్రజాధనం లూటీని ఆపాలి అని మాజీ మంత్రి హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు.

నిన్న‌టి కేబినెట్‌లో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యం ఇలా..!

నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో హ్యామ్ రోడ్ల‌పై జ‌రిగిన చ‌ర్చ అనంత‌రం 5 శాతం కంటే ఎక్కువ కోట్ కాకుండా ఉండాల‌ని సీఎం స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిసింది. మొత్తం 441 రోడ్ల‌కు 34 ప్యాకేజీల్లో రూ. 13,006.27 కోట్ల‌తో 6,092.37 కిలోమీట‌ర్ల మేర ప‌నుల‌కు జూన్ 2న శంకుస్థాప‌న చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. గుత్తేదారు త‌న వాటా 60 శాతంతో చేప‌ట్టే ప‌నుల‌కు సంబంధించి జీఎస్టీకి ప్ర‌భుత్వం మినహాయింపు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఇది 9.30 శాతం ఉండ‌గా రీయింబ‌ర్స్ చేస్తామ‌ని తెలిపింది. అలాగే పెట్రోలింగ్, అంబులెన్స్ వాహ‌నాలు వాడ‌డం వ‌ల్ల అయ్యే ఖ‌ర్చు 4.46 శాతం ఉండ‌గా వాటిని ప్ర‌భుత్వ‌మే ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. వీట‌న్నింటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే 5 శాతంలోపే ఎక్సెస్ ఉంటుంద‌ని నివేదిక‌లో వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది.

సిద్దిపేట‌లో 75 శాతం.. ఖ‌మ్మం-2లో 14.40 శాతం

ఆర్ అండ్ బీ టెండ‌ర్ల‌లో వ‌చ్చిన ఎక్సెస్ ధ‌ర‌ల‌ను కేబినెట్ ముందు అధికారులు ఉంచారు. ఇందులో అత్య‌ధికంగా సిద్దిపేట‌లో 75 శాతం కీస్టోన్ ఇన్‌ఫ్రా ప్ర‌యివేటు లిమిటెడ్ కోట్ చేయ‌గా, అతి త‌క్కువ‌గా ఖ‌మ్మం-2లో మేఘా సంస్థ 14.40 శాతానికి కోట్ చేసిన‌ట్లు తెలిసింది.

Advertisement
Advertisement