త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్న‌డు : హ‌రీశ్‌రావు

Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. కాంగ్రెస్ పాలనలో భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు.

S

Telangana | Published On Sep 4, 2026, 7.40 pm IST

Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్న‌డు : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. కాంగ్రెస్ పాలనలో భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. కాగ‌జ్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏకంగా 42,867 ఎక‌రాల రైతుల భూములు 22ఏ జాబితాలో బందీ అయింద‌న్నారు. రేవంత్ ఇల్లు నిషేధిత జాబితాలో ప‌డితే రాత్రికి రాత్రే తీసేసుకున్నాడు.. మ‌రి పేద‌ల‌కు ఒక న్యాయం, ముఖ్య‌మంత్రికి ఇంకో న్యాయ‌మా..? అని నిల‌దీశారు. ఈ పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా రేవంత్ రెడ్డి నిషేధించాలి అని సిర్పూర్ స‌భ‌లో హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలపై సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గం కౌటాలలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావుకు.. స్థానిక రైతులు తమ భూములను అకారణంగా 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారంటూ కన్నీటిపర్యంతమై తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతుల ఆవేదనను చూసి చలించిపోయిన హరీశ్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల గారడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల భూములకు విముక్తి కల్పించే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని రైతులకు ఆయన భరోసా ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. నా పేద రైతుల భూములు గుంజుకోవద్దు, వారి గొంతు నొక్కొద్దు అని మా కోనప్ప గారు ఈ మీటింగ్ పెడితే రైతుల కష్టాలు చూసి బాధేసింది. నేను హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే రెండు లక్షల ఇండ్లను 22ఏ లో పెట్టారనుకున్నా. కానీ, ఒక్క సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలోనే ఏకంగా 42,867 ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి రైతుల నోటికాడ బుక్కను రేవంత్ రెడ్డి లాక్కున్నాడు. కౌటాలలో 6,350 ఎకరాలు, చింతల మానేపల్లిలో అత్యధికంగా 8,878 ఎకరాలు, బెజ్జూరులో 8,325 ఎకరాలు, కాగజ్‌నగర్‌లో 6,690, సిర్పూర్ టీలో 4,406, పెంచికల్ పేట్‌లో 2,950, దహేగాంలో 5,268 ఎకరాలను రాత్రికి రాత్రే బ్లాక్ లిస్టులో పడేశారని హ‌రీశ్‌రావు తెలిపారు.

మల్లవ్వ లాంటి రైతులు చెప్తుంటే కన్నీళ్లు వచ్చాయి

కేసీఆర్ గిరిజనులకు 6 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చి ఆదుకుంటే, రేవంత్ రెడ్డి ఉన్న భూములను గుంజుకుంటున్నాడు. భూములు 22ఏ లో పడితే రైతుల బతుకులు ఆగమాగం అవుతాయి. ఇందాక ఇక్కడ విజయలక్ష్మి, భీంబాయి, మల్లవ్వ లాంటి రైతులు చెప్తుంటే కన్నీళ్లు వచ్చాయి. పాత అప్పు కట్టి, కొత్త లోన్ కోసం పోతే మీ భూమి గవర్నమెంట్ తీసుకుందంటూ బ్యాంక్ మేనేజర్లు వారిని బయటకు పంపేశారు. కొత్తగా తీసుకొచ్చిన యాప్ వల్ల భూమి పేరు మీద లేకపోతే రేపు యూరియా, డీఏపీ కూడా దొరకదు, రైతుబంధు రాదు, ప్రమాదం జరిగితే బీమా రాదు అని మాజీ మంత్రి పేర్కొన్నారు.

రైతుల పాలిట ఈ 22ఏ ఒక ఉరితాడులా మారింది

ఆడబిడ్డ పెళ్లి చేద్దామని భూమి అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కుదరదంటున్నాడు. ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ దాకా తిరిగినా న్యాయం జరగట్లేదు. రైతుల పాలిట ఈ 22ఏ ఒక ఉరితాడులా మారింది. కేసీఆర్ ప్రజలే కేంద్ర బిందువుగా పాలన చేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం భూములే కేంద్ర బిందువుగా పాలన చేస్తున్నాడు. ఎవరి భూములు గుంజుకోవాలి, ఎవరిని 22ఏ లో పెట్టాలి, ఎవరిని బెదిరించాలి అనేదే కాంగ్రెస్ విధానం. ఒకప్పుడు ల్యాండ్ గ్రాబర్లు భూములు కబ్జా చేసేవాళ్లు.. కానీ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే కబ్జాదారుగా మారి రాష్ట్రవ్యాప్తంగా 14.50 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టింది. సిర్పూర్ రైతులు, ఇక్కడ దరఖాస్తులు ఇచ్చిన 40 వేల మంది రైతులు దొంగలా? కబ్జాదారులా? హైదరాబాద్‌లో కూర్చుని పేద రైతులను దొంగలు అని అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

ఇది అధికారుల తప్పు కాదు, రేవంత్ రెడ్డి చేయిస్తున్న కుట్ర

అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్.. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న పట్టా భూములను లాక్కుంటోంది. 100 ఏళ్ల కిందటి రికార్డులు తీసి, ఆసిఫాబాద్ కలెక్టర్ ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ భూములను 22ఏ లో పెట్టాలని ప్రభుత్వానికి లేఖ రాశాడు. అంటే ఇది అధికారుల తప్పు కాదు, రేవంత్ రెడ్డి చేయిస్తున్న కుట్ర. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరా కూడా నిషేధిత జాబితాలో పెట్టలేదని మంత్రి బొంకులేటి.. అదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు. ఇన్ని లక్షల మంది ఆస్తులను రాత్రికి రాత్రే సున్నా వాల్యూ చేసి, అడ్డగోలుగా మాట్లాడిన పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా నిషేధిత జాబితాలో పెట్టాలన్నారు హ‌రీశ్‌రావు.

లక్షలాది మంది రైతులతో నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌ను ముట్టడిస్తా

హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22ఏ లో పడింది. నేను ఆ విషయం బయటపెట్టగానే ముఖ్యమంత్రి హోదాలో రాత్రికి రాత్రే తన ఇంటిని ఆ లిస్టులో నుంచి తీసేసుకున్నాడు. మరి నీకు ఒక న్యాయం, మా రైతులు, భీంబాయి, విజయలక్ష్మి లాంటి వాళ్లకు ఒక న్యాయమా? రేవంత్ రెడ్డి ఇల్లు తీసినట్టే సిర్పూర్‌లో పెట్టిన 40 వేల ఎకరాలను కూడా వెంటనే 22ఏ నుంచి తొలగించాలి. లేదంటే లక్షలాది మంది రైతులతో సెక్రటేరియట్‌ను, నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌ను ముట్టడిస్తామ‌ని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

కొండా సురేఖ నిన్ను తిట్టిందని తీసేశావు..

కొండా సురేఖ నిన్ను తిట్టిందని తీసేశావు.. మరి లక్షల మంది ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? నీకు ఏమైనా దాంట్లో 50/50 వాటా ఉందా రేవంత్ రెడ్డి. అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం, ఈ నెల 7 నుంచి అసెంబ్లీ మొదలవుతుంది, అక్కడ తేల్చుకుంటాం. అప్పటిలోగా తీయకపోతే మా కోవ లక్ష్మక్క ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందే పొయ్యి పెట్టి, వంటా వార్పు చేసి అక్కడే పడుకుంటామ‌ని హ‌రీశ్‌రావు వ్యాఖ్యానించారు.

ఇక ఇక్కడ ఏ శక్తి ఎదురొచ్చినా తుఫాన్‌లో కొట్టుకుపోవాల్సిందే..

ఈ నియోజకవర్గంలో ఎవరెన్ని కుట్రలు చేసినా గులాబీ జెండా ఎగరడం ఖాయం. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఢిల్లీలో కొట్లాడుకుంటారు కానీ, కాగజ్‌నగర్‌లో మాత్రం బీఆర్ఎస్ మీదకు కలిసి వస్తారు. మా కోనప్ప, మా ప్రవీణన్న ఇద్దరూ ఇప్పుడు ఒక్కటయ్యారు. ఇక ఇక్కడ ఏ శక్తి ఎదురొచ్చినా తుఫాన్‌లో కొట్టుకుపోవాల్సిందే. మళ్లీ కేసీఆర్ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రతి అవ్వా తాత, అక్కా చెల్లెలు నమ్ముతున్నారు. దళారులను నమ్మి రైతులు రూపాయి లంచం ఇవ్వొద్దు, మీ భూములు మీకు దక్కేంతవరకు బీఆర్ఎస్ పార్టీ అండగా కొట్లాడుతుంది అని హ‌రీశ్‌రావు తెలిపారు.

Advertisement
Advertisement