త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

MGKLIP | శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరిగినా పాలమూరు రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూరు పంపులు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ పంపులను తక్షణమే ప్రారంభించి రిజర్వాయర్ల కింద ఉన్న ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

P

Telangana | Published On Aug 7, 2026, 8.16 pm IST

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Advertisement

MGKLIP | శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరిగినా పాలమూరు రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూరు పంపులు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ పంపులను తక్షణమే ప్రారంభించి రిజర్వాయర్ల కింద ఉన్న ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం జలాశయం 162 టీఎంసీలకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. వరద ప్రవాహాలు వచ్చి వారం రోజులు గడిచినా రైతులకు నీరు అందించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణకు అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకోకుండా వదిలేస్తే, ఆ నీరు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఒకవైపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, మాల్యాల పంప్‌హౌస్‌ల ద్వారా ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించుకుంటుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.

“రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ నేతలకు ఉన్న సోయి తెలంగాణ నీటి మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. పాలమూరు లాంటి కరువు ప్రాంతంలో నీరు అందుబాటులో ఉన్నా విడుదల చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యం” అని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలో పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్‌ను సలహాదారుగా నియమించుకున్న ప్రభుత్వం.. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ రిజర్వాయర్‌ను గతంలోనే కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్‌తో అనుసంధానం చేశారని గుర్తుచేశారు. నార్లాపూర్‌లో నీటిని నింపితే కేఎల్‌ఐ పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. నార్లాపూర్ పంపులను వెంటనే ప్రారంభించి రిజర్వాయర్లు, చెరువులు, కుంటలను నింపడంతో పాటు కాలువలకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సాగునీటి కోసం పోరుబాట: లక్ష్మారెడ్డి

పాలమూరు రైతులకు సాగునీరు అందించేందుకు పోరుబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహాలు వస్తున్నా.. నీళ్లు లేవంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పంపుల ప్రారంభానికి ఈ నెల 11 వరకు గడువు ఇస్తున్నామని మాజీ ఎమ్మెల్యేలు అల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి తెలిపారు. అప్పటిలోగా ప్రభుత్వం స్పందించకుంటే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి లక్షలాది మంది రైతులతో నార్లాపూర్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నార్లాపూర్ వద్ద రైతులు, ప్రజలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వారు వెల్లడించారు.

Advertisement
Advertisement