త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | భూ భార‌తి పోర్ట‌ల్ దొంగ‌లు రేవంత్‌, పొంగులేటే

RS Praveen Kumar | రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న భూ భారతి పోర్టల్‌లో 22 వేల భూ బదలాయింపులు జరిగాయ‌ని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. భూమి యజమానులకు సంబంధం లేకుండా పోర్టల్‌లో మార్పులు చేశారని ఆరోపించారు. రూ.3 కోట్ల 95 లక్షల కుంభకోణం జ‌రిగింద‌ని మంత్రి పొంగులేటే అన్నార‌న్నారు.

S

Telangana | Published On Jul 7, 2026, 4.52 pm IST

RS Praveen Kumar | భూ భార‌తి పోర్ట‌ల్ దొంగ‌లు రేవంత్‌, పొంగులేటే
Advertisement
  • కీల‌క శాఖ‌లు వాళ్ల ద‌గ్గ‌రే పెట్టుకున్న‌రు
  • రూ.3 కోట్ల 95 లక్షల కుంభకోణం అని పొంగులేటే అన్న‌రు
  • వారి మాఫియా గ్యాంగ్ కాల్ డేటాను బ‌య‌ట‌కు తీయాలి
  • రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో పోర్టల్‌లో మార్పులు చేశారు
  • అక్ర‌మాల‌పై అధికారులిచ్చిన క‌మిటీ రిపోర్టు ఏది?
  • శేరిలింగంప‌ల్లిలో స‌హ‌స్ర ఇన్ఫ్రా కంపెనీకి 13 గుంట‌ల భూమి బ‌దలాయించారు
  • రెవెన్యూ శాఖ చ‌ట్టాల‌ను ఉల్లంఘించింది
  • భూ భార‌తి బాధితులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు రావాలి
  • మీడియా స‌మావేశంలో రేవంత్, పొంగులేటిపై ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ధ్వ‌జం

RS Praveen Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న భూ భారతి పోర్టల్‌లో 22 వేల భూ బదలాయింపులు జరిగాయ‌ని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. భూమి యజమానులకు సంబంధం లేకుండా పోర్టల్‌లో మార్పులు చేశారని ఆరోపించారు. భూ భారతి అక్రమాలపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో పోర్టల్‌లో మార్పు చేశారన్నారు. రూ.3 కోట్ల 95 లక్షల కుంభకోణం అని మంత్రి పొంగులేటే అన్నార‌న్నారు. శేరిలింగంపల్లిలో 13 గుంటల భూమిని సహస్ర ఇన్ఫ్రా కంపెనీకి బదలాయించారని మండిప‌డ్డారు. భూ భారతి బాధితులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు రావాల‌ని పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మ‌ట్లాడుతూ రేవంత్, పొంగులేటిపే తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

ప్ర‌జ‌ల వివ‌రాల‌ను దాచి పెట్టారు..

తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారు. భూ భారతి పోర్టల్ వచ్చిన తర్వాత రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రైతన్న‌లూ.. మీ భూమి ఉందో లేదో చెక్ చేసుకోండి. ప్రజల వివరాలను ప్రభుత్వం దాచి పెట్టింది.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. కీలకమైన శాఖలు రేవంత్ రెడ్డి, పొంగులేటి వద్దే ఉన్నాయి. వారు ఒకరినొక‌రు కాపాడుకుంటున్నారు. భూ యజమానికి తెలియకుండా భూ బదలాయింపు జరగడానికి రూల్ లేదు. రెవెన్యూ శాఖ చట్టాలను ఉల్లఘించింది అని ఆర్ఎస్పీ ఫైర‌య్యారు.

హైద‌రాబాద్, రంగారెడ్డిలో 200 ఎక‌రాలు బ‌ద‌లాయించారు..

పోర్టల్‌లో దొంగలు మీరే. 2024 నుంచి 2026 జూన్ వరకు మీ ఎల్లో మాఫియా గ్యాంగ్‌లు ఇదే పని చేస్తున్నాయి. శేరిలింగంపల్లిలో 13 గుంటల భూమిని సహస్ర ఇన్ఫ్రా కంపెనీకి బదలాయించారు. తన శాఖలో ఏం జరుగుతుందో పొంగులేటికి తెలియదా? హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 200 ఎకరాలకు పైగా భూమిని బదలాయింపు చేశారు. 50 శాతం వాటాలు పంచుకుంటున్నారు. రాష్ట్రంలో మాఫియా పాలన నడుస్తోంది. 10 వేల కోట్ల కుంభకోణంపై రెవెన్యూ మంత్రి ఎందుకు ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వం అధికారులను బలి పశువులను చేస్తోంది. ఎమ్మార్వోలను ఆర్డీవోలుగా కూర్చోబెడుతున్నారు అని ప్ర‌వీణ్ కుమార్ మండిప‌డ్డారు.

భీంరెడ్డిని ఎందుకు అరెస్టు చేయ‌లే..

భూ భారతి స్కామ్ బాహుబలి స్కామ్. పొంగులేటి మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అధికారులతో రికార్డులు తారుమారు చేయిస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేయాలి. రేవంత్, పొంగులేటి మాఫియా గ్యాంగ్‌ల కాల్ డేటాను బయటకు తీయాలి. ఏసీబీ కేసులో ఎవరైనా ఒక్కటే. భీంరెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేసి అరెస్టు చేయకుండా నోటీసులు ఇచ్చారు. దిలీప్ నాయక్ అనే ఎమ్మార్వోను పట్టుకుని వెంటనే అరెస్టు చేశారు.
భుజంగరావుకు, అంబేద్కర్‌కు ఒక న్యాయం భీంరెడ్డికి ఒక న్యాయం ఉండొద్దు. క్రిశాంక్, బాల్క సుమన్‌ను జైలుకు పంపించారు. మరి రేవంత్ రెడ్డిని, అనిరుధ్ రెడ్డిని, మక్కన్ సింగ్‌ను ఎందుకు జైలుకు పంపలేదు అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిల‌దీశారు.

ఈ మీడియా స‌మావేశంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్, తుంగ బాలు, దాసరి ఉష, గోపగాని రఘురాం, మంద శ్యామ్ పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement