త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deviprasad | మూడేండ్ల‌లో ఒక్క‌ హామీ అమలు చేయలే.. మరో రెండేండ్లు అడగడం అమానుషం: దేవీప్రసాద్

Deviprasad | కాంగ్రెస్ పార్టీ (Congress) ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, దాదాపు మూడేండ్లు కావస్తున్నా ఒక్క ప్రధాన హామీని కూడా అమలు చేయకపోవడం దారుణమ‌ని తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత దేవీప్ర‌సాద్ (Deviprasad) విమ‌ర్శించారు.

G

Telangana | Published On Sep 6, 2026, 12.31 pm IST

Deviprasad | మూడేండ్ల‌లో ఒక్క‌ హామీ అమలు చేయలే.. మరో రెండేండ్లు అడగడం అమానుషం: దేవీప్రసాద్
Advertisement

Deviprasad | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ పార్టీ (Congress) ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, దాదాపు మూడేండ్లు కావస్తున్నా ఒక్క ప్రధాన హామీని కూడా అమలు చేయకపోవడం దారుణమ‌ని తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత దేవీప్ర‌సాద్ (Deviprasad) విమ‌ర్శించారు. ఉద్యోగులు అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో చివరకు ఆందోళనలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మూడేండ్లు సమయం ఇచ్చినా సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం, ఇప్పుడు మరో రెండేండ్లు సమయం ఇవ్వాలని కోరడం ఉద్యోగుల పట్ల అమానుషమైన వైఖరికి నిదర్శన‌మ‌ని చెప్పారు.

ఆ కుట్రలో భాగంగానే సీఎం వ్యాఖ్య‌లు..

ఐదేండ్ల‌ కాలానికి ఎన్నికైన ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడా ఐదేళ్లు సమయం కోరడం దేశంలోనే అరుదైన పరిస్థితి అని ఎద్దేవా చేశారు. ప్రతి ఐదేండ్ల‌కు రావాల్సిన పీఆర్సీని (PRC) ఆలస్యం చేసి పదేండ్ల‌కు ఒకసారి చేసే కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రి (Revanth Reddy) వ్యాఖ్యలు ఉన్నాయనే అనుమానం ఉద్యోగుల్లో ఉందని చెప్పారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం పదేళ్లకు ఒకసారి పీఆర్సీ ప్రతిపాదన చేసినప్పుడు ఉద్యోగులు వీరోచితంగా పోరాడి తిప్పికొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన సమయంలో ఉద్యోగుల వేతనాలను సకాలంలో సవరించకుండా `మరో రెండేండ్లు పీఆర్సీ అడగవద్దు` అని చెప్పడం ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తున్న‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, పెన్షన్ బకాయిలు, మేనిఫెస్టో హామీల అమలుపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమే..

ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీయడానికి సంఘాల్లో చీలికలు తీసుకురావడం, ఉద్యోగులు, ఉపాధ్యాయుల మధ్య విభేదాలు సృష్టించడం దుర్మార్గమని విమ‌ర్శించారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కుల పరిరక్షణ కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు ప్రజా సమస్యలపై నిరసనలు చేపడితే ప్రభుత్వం కౌంటర్ ఉద్యమాలతో వాటిని అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు.

ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని అడిగితే `మరో రెండేండ్లు అడగవద్దు` అని చెప్పడం ప్రజాపాలన కాదని.. ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమేన‌న్నారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా, వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం రాజకీయ కప్పదాట్లు వేస్తోందని ఆరోపించారు. సంస్కారం ఉండటంతోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నా సహిస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమ‌ని వెల్ల‌డించారు. నిరసనలు, పోరాటాలు చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని ముఖ్య‌మంత్రికి తెలియకపోవడం విషాదక‌ర‌మ‌న్నారు.

చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి..

సెప్టెంబర్ 10న నిర్వ‌హించ‌నున్న‌ చలో హైదరాబాద్‌ను (Challo Hyderabad) విజయవంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ భేదాలను పక్కనపెట్టి హైద‌రాబాద్‌కు లక్షలాదిగా తరలివచ్చి ప్రభుత్వానికి తమ ఐక్యతను చాటాల‌న్నారు. ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడుదాం, సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమిద్దామ‌ని చెప్పారు.

Advertisement
Advertisement