త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | జెన్‌కోకు నాణ్య‌మైన బొగ్గును స‌ర‌ఫ‌రా చేయాలి : డిప్యూటీ సీఎం భ‌ట్టి

Bhatti Vikramarka | రాష్ట్రంలోని జెన్‌కో( GENCO )కు నాణ్య‌మైన బొగ్గును స‌ర‌ఫ‌రా చేయాల‌ని అధికారుల‌ను డిప్యూటీ సీఎం, ఇంధ‌న శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క( Bhatti Vikramarka ) ఆదేశించారు. కొత్తగూడెంలో సింగరేణి( Singareni ), జెన్‌కో సంస్థలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

S

Telangana | Published On Jul 24, 2026, 2.44 pm IST

Bhatti Vikramarka | జెన్‌కోకు నాణ్య‌మైన బొగ్గును స‌ర‌ఫ‌రా చేయాలి : డిప్యూటీ సీఎం భ‌ట్టి
Advertisement

Bhatti Vikramarka | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని జెన్‌కో( GENCO )కు నాణ్య‌మైన బొగ్గును స‌ర‌ఫ‌రా చేయాల‌ని అధికారుల‌ను డిప్యూటీ సీఎం, ఇంధ‌న శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క( Bhatti Vikramarka ) ఆదేశించారు. కొత్తగూడెంలో సింగరేణి( Singareni ), జెన్‌కో సంస్థలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సమావేశంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి, బొగ్గు నాణ్యత, జెన్‌కోకు సరఫరా చేస్తున్న బొగ్గు నాణ్యత, వివిధ బొగ్గు బ్లాకుల్లో నిల్వలు, నైని బ్లాక్‌లో ఉత్పత్తి పురోగతి తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జెన్‌కోకు నాణ్యమైన బొగ్గు నిరంతరాయంగా సరఫరా కావాలని అధికారులను ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తిలో ఒక్కరోజు కూడా ఆలస్యం జరగకూడదని, ప్రతి రోజు జాప్యం సింగరేణికి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి పోటీతత్వాన్ని ఎదుర్కోవాలంటే సాంకేతికత, నైపుణ్యం, సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి, ప్రైవేటు సంస్థలకు దీటుగా అత్యుత్తమ పనితీరు కనబర్చేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బొగ్గు నిల్వలు, ఉత్పత్తి ప్రణాళికలు, గనుల అభివృద్ధిపై ముందస్తు కార్యాచరణతో ముందుకు సాగాలని భ‌ట్టి విక్ర‌మార్క సూచించారు.

సింగరేణిని కాపాడుకోవడానికి, బలోపేతం చేయడానికి, అంతర్జాతీయ స్థాయికి విస్తరించడానికి ప్రజా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటుందని విక్రమార్క అన్నారు. సింగరేణి అభివృద్ధి కోసం ప్రభుత్వం తలుపులు 24 గంటలూ తెరిచే ఉంటుందని డిప్యూటీ సీఎం భరోసా కల్పించారు. ​రాబోయే 15 - 20 ఏళ్లలో ఇంధన రంగం స్వరూప స్వభావాలు పూర్తిగా మారబోతున్నాయని ఆయన అన్నారు. సోలార్, పంప్డ్ స్టోరేజ్, విండ్, హైడ్రోజన్, రేర్ ఎర్త్ మినరల్స్, బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు పెరిగితే, క్రమంగా థర్మల్ విద్యుత్ మరియు బొగ్గు వినియోగం తగ్గే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

గతంలో ఉత్పత్తి రంగంలో సింగరేణిది ఏకఛత్రాధిపత్యం ఉండేదని డిప్యూటీ సీఎం అన్నారు. ఏ ధర నిర్ణయిస్తే, ఆ ధరకే వినియోగదారులు బొగ్గును కొనుగోలు చేసేవారని డిప్యూటీ సీఎం అన్నారు. నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ప్రైవేటీకరణ విపరీతంగా పెరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల బహిరంగ వేలం విధానాన్ని తీసుకురావడంతో అనేక ప్రైవేట్ సంస్థలు రంగంలోకి వచ్చాయని చెప్పారు. దీనితో ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేట్ వారితో పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

సెమీకండక్టర్స్, చిప్స్, ఈవీ బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియం, కోబాల్ట్ వంటి అరుదైన ఖనిజాల మైనింగ్ రంగానికి సింగరేణి విస్తరించాలని భట్టి విక్రమార్క అన్నారు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల్లో క్రూషియల్ మినరల్స్ వేలంలో సింగరేణి పాల్గొనాలని చెప్పారు. సింగరేణి వద్ద దశాబ్దాల అనుభవం కలిగిన నిపుణులైన ఇంజనీర్లు, మైనింగ్ కార్మికులు ఉన్నారని ఆయన అన్నారు. ఈ అపారమైన మానవ వనరులను అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులకు ఉపయోగించాలన్నారు.

ఈ సమావేశంలో ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, జెన్‌కో సీఎండీ హరీష్, సింగరేణి డైరెక్టర్ గౌతమ్ పోట్రూ, జిల్లా కలెక్టర్ అంకిత్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement