Mallu Ravi | హైదరాబాద్ : ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడం దారుణమని.. తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) కన్వీనర్ డా.మల్లు రవి వ్యాఖ్యానించారు. గ్రామీణ్ - వీబీ జీ రామ్జీ బిల్లు-2025తో రాష్ట్రాలపై మరింత భారం పడుతుందని వివరించారు. ఎంపీ మల్లు రవి న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బీజేపీ, మోదీ ప్రభుత్వం.. ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును మారుస్తుంది. ఈ పథకానికి ఇచ్చే డబ్బులు కూడా తగ్గిస్తోంది. దీనివల్ల రాష్ట్రాలపై భారం పెరగబోతోంది. డబ్బుల విషయంలో రాష్ట్రాలకు లింకు పెట్టడం మంచిది కాదు. ఈ నిర్ణయం ద్వారా ఈ పథకాన్ని నీరుగార్చాలని ఎన్డీయే ప్రభుత్వం చూస్తోంది. అందుకే ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఎంత వ్యతిరేకించినా.. ఈ బిల్లును తీసుకొచ్చి.. దానిపైన చర్చ చేయడానికి 4 గంటల సమయం కేటాయించారు. ఎన్డీయే ప్రభుత్వానికి మెజార్టీ ఉంది కాబట్టి.. ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు' అని మల్లు రవి వ్యాఖ్యానించారు. 'దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో గాంధీజీది ప్రధాన భూమిక. అందుకే ఆయన్ను యావత్తు దేశం గౌరవిస్తోంది. ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని అంటున్నాం. అలాంటి మహాత్మా గాంధీ పేరుని మార్చడాన్ని ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాకుండా.. అన్ని పార్టీల్లో ఉన్న లీడర్స్, బీజేపీలో బ్యాలెన్స్గా ఉన్న నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. స్వతంత్ర పోరాటానికంటే ముందు ఒక్కసారి మాత్రమే గాంధీజీ ఏఐసీసీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. దాని తర్వాత స్వతంత్ర పోరాటం కోసం నెహ్రూ, పటేల్, ఇతర జాతీయ నాయకులందరినీ ఐక్యపరిచారు. భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ స్వతంత్ర పోరాటంలోకి వచ్చే విధంగా చేసినటువంటి గొప్ప జాతీయ నాయకుడు మహాత్మా గాంధీ. గాంధీ నడిపిన స్వతంత్ర పోరాటంలో.. ఇప్పుడున్న బీజేపీ, అంతకు ముందున్న జనసంఘ్, హిందూ మహాసభ గానీ ఎప్పుడూ స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు' అని మల్లు రవి స్పష్టం చేశారు. 'దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత.. 1948లో నాథూరాం గాడ్సే మహాత్మా గాంధీని చంపటాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ దుర్మార్గమైన చర్య తర్వాత.. దేశంలో ఆర్ఎస్ఎస్ను కొంతకాలం బ్యాన్ చేశారు. ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తుందన్న సంగతి మనందరికీ తెలుసు. బీజేపీ అధికారం చేపట్టిన 12 సంవత్సరాల తర్వాత.. గాంధీజీ పేరును మారుస్తున్నారు. దీని వెనక ఆర్ఎస్ఎస్ ఉంది. ఈ దుర్మార్గమైన చర్యని సమర్థిస్తే.. దేశ ప్రజలు ఒప్పుకుంటారా.. అధికారంలో మీరు ఉండొచ్చు.. కానీ మహాత్మా గాంధీ లాంటి జాతిపిత పేరును తీసేయటం చరిత్రాత్మక తప్పిదంగా నేను భావిస్తున్నాను. దేశానికి స్వతంత్ర వచ్చాక చాలా పార్టీలు పాలించాయి. కానీ.. ఎవ్వరూ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. అందుకే మహాత్మా గాంధీ పేరుని తీసేయకుండా.. పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నా' అని మల్లు రవి స్పష్టం చేశారు. 'కేవలం పేరు మార్పే కాకుండా.. కొత్త బిల్లు వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వమే నూటికి నూరు శాతం ఈ పథకం కోసం నిధులు కేటాయించేది. కానీ.. ఇప్పుడు 60 శాతానికి తగ్గించి, రాష్ట్రాలను 40 శాతం భరించాలని అంటున్నారు. దీనివల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరుగుతుంది. అలాగే.. గతంలో గ్రామపంచాయతీలో పనులను నిర్ణయించి.. దాన్ని వివిధ దశల్లో కేంద్రానికి పంపేవారు. వర్క్ డిమాండ్ ఆధారంగా నిధులు కేటాయించేవారు. కానీ.. ఇప్పుడు కేంద్రం పరిమిత నిధులు కేటాయిస్తామని అంటోంది. దీనివల్ల నిరుపేదలు నష్టపోతారు. పని కల్పించకపోతే.. పేదల హక్కులను ఎలా కాపాడతారు' అని మల్లు రవి ప్రశ్నించారు. అందుకే ఈ బిల్లుని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఎంపీ మల్లు రవి చెప్పారు. పార్లమెంట్ సభ్యుడిగా తాను కూడా తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. దీనిపైనా పార్లమెంట్లో మాట్లాడి.. తమ వైఖరి చెబుతానని వెల్లడించారు. అలాగే.. తెలంగాణలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను భారీ సంఖ్యలో గెలిపిస్తున్నారని చెప్పారు. కొన్ని చోట్ల ఇతర పార్టీలు బలపర్చిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారని.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలనేది తన అభిప్రాయమన్నారు.