త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalyana Lakshmi Scheme Stopped | 50 లక్షల లాయర్ నీకు ఓకే.. ఆడబిడ్డలకు వద్దా? సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

పేదింటి ఆడబిడ్డల కోసం తెచ్చిన కల్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా కుట్రతో నీరుగార్చుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

J

Hyderabad | Published On Aug 17, 2026, 7.14 pm IST

Kalyana Lakshmi Scheme Stopped | 50 లక్షల లాయర్ నీకు ఓకే.. ఆడబిడ్డలకు వద్దా? సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్
Advertisement
  • కల్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా ఆపేస్తోందని హరీశ్ రావు సంచలన ఆరోపణ
  • కోర్టులో 30 రోజులైనా కౌంటర్ వేయకుండా పథకంపై స్టే వచ్చేలా చేసి ఆడబిడ్డలకు అన్యాయం చేశారని విమర్శ
  • రాజకీయ కక్ష సాధింపు కోసం రోజుకు రూ. 50 లక్షలు ఇచ్చి లాయర్‌ను తెచ్చిన సీఎం, పేదల కోసం ఎందుకు తేలేదని నిలదీత
  • బీఆర్ఎస్ పోరాటంతోనే దిగివచ్చి హడావుడిగా అప్పీల్‌కు వెళ్తున్నారని మండిపాటు

Kalyana Lakshmi Scheme Stopped | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా చిట్ చాట్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన 'కల్యాణ లక్ష్మి' పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ పక్కా కుట్రతో బొంద పెడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. సంక్షేమం అనేది పాలకులకు ఇష్టం ఉంటే చేసే దానం కాదని.. అది రాజ్యాంగం అప్పగించిన ప్రాథమిక బాధ్యత అని ఆయన గుర్తుచేశారు.

కోర్టు స్టే వెనుక పక్కా స్కెచ్..

కల్యాణ లక్ష్మి పథకాన్ని నిలిపివేయడానికి కోర్టు 'స్టే' (Stay) ఇచ్చిందంటూ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని హరీశ్ రావు మండిపడ్డారు.

"కౌంటర్ దాఖలు చేయడానికి కోర్టు 30 రోజుల సమయం ఇచ్చినా కావాలనే వదిలేశారు. మీరు కౌంటర్ వేయకపోవడం వల్లే కదా కోర్టు స్టే ఇచ్చింది? ఇది ఆడబిడ్డల మీద కక్షతో మీరు చేసిన కుట్ర కాదా? దీన్నిబట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పట్ల ఉన్న ప్రేమ ఏపాటిదో ఇట్టే అర్థమవుతోంది," అని ఆయన దుయ్యబట్టారు.

లెక్కలే సాక్ష్యం.. జనాభా పెరిగినా లబ్ధిదారులు తగ్గారు

మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్న 16 లక్షల లెక్కలు వాస్తవం కాదన్న హరీశ్ రావు.. కేసీఆర్ హయాంలో ఏకంగా 14.50 లక్షల పెళ్లిళ్లకు సాయం చేసి ఆదుకున్నామని వివరించారు.

2021-22 (బీఆర్ఎస్ పాలన): ఒక్క ఏడాదే 2,31,371 పెళ్లిళ్లకు ఆర్థిక సాయం.

2024-25 (కాంగ్రెస్ పాలన): కేవలం 1.58 లక్షల పెళ్లిళ్లకు మాత్రమే సాయం.

2025-26 అంచనా: మరీ దారుణంగా 86 వేల పెళ్లిళ్లకు పరిమితం (కేవలం రూ. 870 కోట్లు).

జనాభా పెరిగినప్పుడు దరఖాస్తులు, పెళ్లిళ్ల సంఖ్య పెరగాలి కానీ.. కాంగ్రెస్ పాలనలో లబ్ధిదారుల సంఖ్య ఎందుకు పడిపోయిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కక్ష సాధింపు కోసం కోట్లు.. పేదల కోసమైతే అడ్డంకులు

తనపై రాజకీయ కక్ష సాధింపు కోసం, తప్పుడు కేసులు పెట్టి వాదించడానికి సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ్ లూథ్రాను సీఎం ప్రత్యేకంగా తెచ్చుకున్నారని హరీశ్ రావు ఆరోపించారు.

"ఆయనకు రోజుకు 50 లక్షల రూపాయల ఫీజు చెల్లించడానికి ముఖ్యమంత్రికి పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రత్యర్థుల మీద కేసులకు రోజుకు 50 లక్షలు కట్టే ప్రభుత్వానికి.. లక్షలాది మంది ఆడబిడ్డల భవిష్యత్తు ముడిపడి ఉన్న కల్యాణ లక్ష్మి కేసును వాదించడానికి ఒక మంచి లాయర్‌ దొరకలేదా? లేక కావాలనే లాయర్‌ను పెట్టలేదా?" అని సూటిగా ప్రశ్నించారు.

బీఆర్ఎస్ దెబ్బకే అప్పీల్ డ్రామాలు

సింగిల్ జడ్జి స్టే ఇచ్చిన వెంటనే డివిజన్ బెంచ్‌కు (Division Bench) అప్పీల్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ రోడ్లెక్కి పోరాటం చేసిన తర్వాతే ప్రభుత్వం ఉలిక్కిపడి కదిలిందని.. బీఆర్ఎస్ ఒత్తిడి లేకపోతే ఈ పథకాన్ని ఎప్పుడో శాశ్వతంగా సమాధి చేసేవాళ్లని ఆయన విమర్శించారు. కేసీఆర్ మొదటి కేబినెట్ సమావేశంలోనే ఏకంగా 42 సంక్షేమ పథకాలకు ఆమోదముద్ర వేస్తే.. నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ పథకాలను ఒక్కొక్కటిగా ఎలా ఎత్తివేయాలా అని కుట్రలు చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.

Advertisement
Advertisement