త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | భూములివ్వ‌లేం, డ‌బ్బులివ్వ‌లేం.. సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం నుంచి భూములు, ఇండ్ల‌తో పాటు ఆర్థిక ల‌బ్ధి ఆశించొద్ద‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మా ప్ర‌భుత్వం ఇవ్వ‌గ‌లిగింది కేవ‌లం విద్య‌నే అని ఆయ‌న తేల్చిచెప్పారు.

S

Telangana | Published On Jan 17, 2026, 4.51 pm IST

CM Revanth Reddy | భూములివ్వ‌లేం, డ‌బ్బులివ్వ‌లేం.. సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

మా నుంచి అవి ఆశించొద్దు
మేం ఇవ్వ‌గ‌లిగింది కేవ‌లం విద్య‌నే
ఇత‌ర దేశాల‌తో పోటీ ప‌డాలంటే విద్య బాగుండాలి..
లాంగ్వేజ్, నాలెడ్జ్‌ను ఇంప్రూవ్ చేసుకోవాలి..
విద్య లేక‌పోతే జీవితం గాఢ అంధ‌కారం
ఐఏఎస్, ఐపీఎస్‌లుగా మ‌న పిల్ల‌లు రాణించాలి..
అప్పుడే ఉజ్వ‌ల భ‌విష్య‌త్‌
జ‌డ్చ‌ర్ల బ‌హిరంగ స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం నుంచి భూములు, ఇండ్ల‌తో పాటు ఆర్థిక ల‌బ్ధి ఆశించొద్ద‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మా ప్ర‌భుత్వం ఇవ్వ‌గ‌లిగింది కేవ‌లం విద్య‌నే అని ఆయ‌న తేల్చిచెప్పారు. మ‌న పిల్ల‌లు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా రాణించిన‌ప్పుడే ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉంటుంద‌ని సీఎం పేర్కొన్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని చిట్టిబోయిన‌ప‌ల్లిలో ట్రిపుల్ ఐటీ క్యాంప‌స్‌కు సీఎం రేవంత్ భూమి పూజ చేశారు.

ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత హైద‌రాబాద్ రాష్ట్రానికి పాల‌మూరు జిల్లాకు చెందిన బూర్గుల రామ‌కృష్ణారావు సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. మ‌ళ్లీ 75 ఏండ్ల త‌ర్వాత మ‌న‌కు అవ‌కాశం వ‌చ్చింది. ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుని విద్యాసంస్థ‌లు, సాగునీటి ప్రాజెక్టుల‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఈ దేశ తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ విద్యకు, ఇరిగేష‌న్‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చారు. ఎందుకంటే విద్య జీవితంలో స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తుంది.. ఇరిగేష‌న్ ఆహార భ‌ద్ర‌త‌ను ఇస్తుంది. నాగార్జున సాగ‌ర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల‌ను నెహ్రూ క‌ట్టించారని సీఎం గుర్తు చేశారు.

లాంగ్వేజ్, నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్

ఇత‌ర దేశాల‌తో పోటీ ప‌డాలంటే మ‌న విద్యా వ్య‌వ‌స్థ బాగుండాలి. విద్య ఒక్క‌టే స‌రిపోదు.. భాష ప‌రిజ్ఞానం కూడా ఉండాలి.. క‌మ్యూనికేష‌న్ కూడా ముఖ్య‌మే. ప్ర‌తి ఒక్క విద్యార్థి లాంగ్వేజ్‌, నాలెడ్జ్‌ను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ రెండు ఎప్పుడైతే అల‌వ‌రుచుకుంటారో.. అప్పుడు జీవితంలో గొప్ప‌గా ఎద‌గొచ్చు. ప్ర‌తి అంశంపై అవ‌గాహ‌న పెంచుకోవ‌డంతో పాటు చిత్త‌శుద్ది, ప‌ట్టుద‌ల పెంపొందించుకోవాలి అని రేవంత్ సూచించారు.

17 ఏండ్ల‌లో అన్ని చ‌ట్ట‌స‌భ‌ల్లో ప‌ని చేశాను..

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుకున్న నేను.. మిడ్జిల్ నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. 2006లో జ‌డ్పీటీసీ, 2007లో ఎమ్మెల్సీ, 2009, 2014లో ఎమ్మెల్యే, 2019లో ఎంపీగా, 2023లో సీఎం అయ్యాను. ఈ 17 ఏండ్ల‌లో భార‌త‌దేశంలో ఉన్న అన్ని చ‌ట్ట‌స‌భ‌ల్లో ప‌ని చేశాను. జిల్లా ప‌రిష‌త్ స‌భ్యుడిగా జిల్లా స్థాయిలో, ఎమ్మెల్సీగా మండ‌లిలో, ఎమ్మెల్యేగా శాస‌న‌స‌భ‌లో, ఎంపీగా పార్ల‌మెంట్‌లో ప‌ని చేశాను. ఇక ఏ మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌కపోయిన‌ప్ప‌టికీ.. అంద‌రి స‌హ‌కారంతో సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాను. సీఎంగా అవ‌కాశం వ‌చ్చింది కాబ‌ట్టి.. ప్ర‌పంచంతో పోటీ ప‌డే విధంగా విద్యా వ్య‌వ‌స్థ‌ను బాగు చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను అని ఆయ‌న పేర్కొన్నారు.

విద్య రాని వాడు వింత ప‌శువు

స్వాతంత్య్రం వ‌చ్చిన నాడు జ‌మీందార్లు, భూస్వాముల వ‌ద్ద ల‌క్ష‌లాది ఎక‌రాల భూములు ఉండే. నాడు ఇందిరా గాంధీ, పీవీ న‌ర‌సింహారావు అగ్రిక‌ల్చ‌ర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి నిరుపేద‌ల‌కు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు అసైన్‌మెంట్ ప‌ట్టాలు, ఆదివాసీ గిరిజ‌నుల‌కు పోడు భూముల ప‌ట్టాలు ఇచ్చారు. ఇల్లు లేని నిరుపేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇండ్లు ఇచ్చారు. కానీ ఇవాళ నిరుపేద‌లకు పంచ‌డానికి ప్ర‌భుత్వం వ‌ద్ద భూమి లేదు. మా ప్ర‌భుత్వం నుంచి భూములు, ఆర్థిక ల‌బ్ధి ఆశించ‌కూడ‌ద‌ని సూచ‌న చేస్తున్నాను. మేం ఇవ్వ‌గ‌లిగిందే కేవ‌లం విద్య‌నే. మీ జీవితాల‌ను మార్చేది విద్య‌నే. విద్య ఒక్క‌టే త‌ల్లిదండ్రుల‌ను ఆత్మ‌గౌర‌వంతో త‌లెత్తుకునే విధంగా చేస్తుంది. విద్య రాని వాడు వింత ప‌శువు అని పెద్ద‌లు చెప్పారు. కాబ‌ట్టి మీకు స‌మాజంలో గుర్తింపు రావాలంటే విద్య‌లో రాణించాలి. ఈ క్ర‌మంలోనే మా ప్ర‌భుత్వం విద్య‌ను ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త కింద ఎంచుకున్నాం అని సీఎం తెలిపారు.

విద్య లేక‌పోతే జీవితం గాఢ అంధకారం

ఈ ట్రిపుల్ ఐటీ ఒక్కటే కాదు.. పాల‌మూరు వ‌ర్సిటీకి లా కాలేజీ, ఇంజినీరింగ్ ఇచ్చాం. ఇక ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్ర‌పంచంతో పోటీ ప‌డాలంటే ప్ర‌తి ఒక్క‌రూ గొప్ప‌గా చ‌దువుకోవాలి. రేప‌టి భ‌విష్య‌త్ కూడా చ‌దువు మీద‌నే ఆధార‌ప‌డి ఉంటుంది. విద్య లేక‌పోతే జీవితం గాఢ అంధ‌కారంగా మారుతుంది. అందుకే ఈ జిల్లాలో విద్యా వ్య‌వ‌స్థ‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నాం. పాల‌మూరు జిల్లా వాడు సంత‌కం పెడితే ఏదైనా జ‌రుగుతుంది. మీరు సాధించుకొని స‌మాజానికి ఆద‌ర్శంగా నిల‌బ‌డేలా ముందుకు వెళ్లాలి. నిబ‌ద్ధ‌త కూడా చాలా ముఖ్యం. నిబ‌ద్ధ‌త లేని జీవిత ప్ర‌యాణం ఉప‌యోగ‌క‌రంగా ఉండ‌దు. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన విద్య అవ‌స‌రం. ప్ర‌తి విద్యార్థి 25 ఏండ్ల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో చదువుకుంటే.. 75 ఏండ్ల వ‌ర‌కు మిమ్మ‌ల్ని గౌర‌వంగా ఉండేలా చేస్తుంద‌న్నారు సీఎం.

వ‌చ్చే ఏడాది నాటికి ట్రిపుల్ ఐటీ నిర్మిస్తాం..

ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్-1, 2 లాంటి ఉద్యోగాలు సాధించాలి. ఈ ఉద్యోగాలు మ‌న భ‌విష్య‌త్‌ను మారుస్తాయి. సివిల్స్‌కు ప్రిపేర‌య్యే వాళ్ల‌కు స్కాల‌ర్‌షిప్‌లు ఇస్తున్నాం. రాష్ట్రంలోని ప్ర‌తి విద్యార్థికి మా ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది. ఇత‌ర రాష్ట్రాల్లోనూ మ‌న పిల్ల‌లు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా చ‌లామ‌ణి కావాలి. కేంద్రంలో కూడా మ‌న పిల్ల‌లు ఉండాలి. అప్పుడే మ‌న రాష్ట్రానికి కావాల్సిన నిధులు వ‌స్తాయి. వ‌చ్చే ఏడాది నాటికి ట్రిపుల్ ఐటీ భ‌వ‌నం నిర్మించి, చ‌దువుకోవ‌డానికి మంచి వాతావ‌ర‌ణాన్ని ఏర్పాటు చేస్తాం. మీ అంద‌రికి ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉంటుంది. జీవితంలో ఏ స్థాయికైనా ఎద‌గండి.. క‌న్న త‌ల్లిదండ్రుల‌ను, పుట్టిన ఊరును మాత్రం మ‌ర‌వ‌కండి అని సీఎం సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement