త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | అలాంటి రాత‌ల‌తో నా గౌర‌వానికి భంగం.. కొత్త ప‌లుకుపై సీఎం రేవంత్ సుతిమెత్త‌ని స్పంద‌న‌

CM Revanth Reddy | సింగ‌రేణి బొగ్గు గనుల టెండ‌ర్ల విష‌యంలో కుంభ‌కోణం జ‌రిగింద‌ని, దాని వెనుకాల భ‌ట్టి విక్ర‌మార్క హ‌స్తం ఉంద‌ని ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక కొత్త ప‌లుకులో ప్ర‌చురిత‌మైన క‌థ‌నంపై సీఎం రేవంత్ రెడ్డి సుతిమెత్త‌గా స్పందించారు.

S

Telangana | Published On Jan 18, 2026, 5.25 pm IST

CM Revanth Reddy | అలాంటి రాత‌ల‌తో నా గౌర‌వానికి భంగం.. కొత్త ప‌లుకుపై సీఎం రేవంత్ సుతిమెత్త‌ని స్పంద‌న‌
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : సింగ‌రేణి బొగ్గు గనుల టెండ‌ర్ల విష‌యంలో కుంభ‌కోణం జ‌రిగింద‌ని, దాని వెనుకాల భ‌ట్టి విక్ర‌మార్క హ‌స్తం ఉంద‌ని ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక కొత్త ప‌లుకులో ప్ర‌చురిత‌మైన క‌థ‌నంపై సీఎం రేవంత్ రెడ్డి సుతిమెత్త‌గా స్పందించారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో దాదాపు రూ. 362 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్, ఏదులాపురంలోని జేఎన్‌టీయూ కళాశాలకు శంకుస్థాపన చేశారు. కూసుమంచిలో వంద పడకల ఆసుపత్రి, మద్దులపల్లిలో నూతన మార్కెట్ యార్డు, నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఏదులాపురం నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఖ‌మ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి.. రాధాకృష్ణ రాసిన కొత్త ప‌లుకుపై స్పందిస్తూ ఇలా వ్యాఖ్యానించారు.

నేడు టెండ‌ర్ల గురించి కొన్ని పత్రిక‌లు రాస్తున్నాయి. సింగ‌రేణిలో కొంత‌ కుంభ‌కోణం జ‌రిగింది.. బొగ్గంతా మాయ‌మైంద‌ని. నేను ఆ ప‌త్రిక‌ల‌కు, టీవీల‌కు, సోష‌ల్ మీడియా వాళ్ల‌కు, రాజ‌కీయ పార్టీ నాయ‌కుల‌కు చెప్ప‌ద‌ల‌చుకున్నా.. ఈ ప్ర‌భుత్వంలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు తావు లేదు. అవ‌స‌ర‌మైన ప్ర‌చారాన్ని క‌ల్పించి అపోహాలు క‌ల్పించి, ప్ర‌తిప‌క్షాలు బ‌ల‌ప‌డ‌డానికి ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో స‌హ‌కారం చేస్తున్నారు. మీకు మీడియా పంచాయితీలు ఉంటే త‌లుపులు మూసి కొట్టుకోండి.. లేక‌పోతే ఒక‌రిపై ఒక‌రు బుర‌ద జ‌ల్లుకోండి.. అంబోతులు కొట్లాడితే లేగ‌దూడ‌ల కాలు విరిగాయ‌ట‌. య‌జ‌మానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి.. మా మంత్రుల‌ను బ‌ద్నాం చేయ‌కండి.. లాగ‌కండి. మీరు రాస్తున్న రాత‌లు, చూపులు శుక్రాచార్యుడికి, మారీచుడికి, సుబ‌హుడికి స‌హ‌కారం అందించిన‌ట్టు ఉంట‌ది. ఒక్క‌సారి ఆలోచ‌న చేసి వాస్త‌వాల‌ను తెలుసుకొని, రాసే ముందు మ‌మ్మ‌ల్ని వివ‌ర‌ణ అడ‌గండి. 365 రోజులు ప్ర‌జ‌ల‌కు అంద‌బాటులో ఉన్న సీఎంగా వివ‌ర‌ణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. ఏదైనా వార్త టీవీలో, పేప‌ర్‌లో, సోష‌ల్ మీడియాలో ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రుల‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తే.. కుటుంబ పెద్ద‌గా నా గౌర‌వానికి భంగం క‌లిగిస్తుంది. నా నాయ‌క‌త్వం ప‌ట్ల అపోహల‌ను క‌లిగిస్తుంది. ఇలాంటి విష‌యాల్లో ఎలాంటి కాంప్ర‌మైజ్ లేదు. మా మంత్రుల మీద ఏది వ‌చ్చినా రాసే ముందు నా వివ‌ర‌ణ అడ‌గండి. ఇవాళ సింగ‌రేణి కోల్ మైనింగ్ టెండ‌ర్ విష‌యంలో ప్ర‌భుత్వం స్ప‌ష్టంగా, నిజ‌మైన‌ అనుభ‌వం ఉన్న వారికి ఇస్తుందే త‌ప్పా, అణాపైసా అవినీతికి తావు ఇవ్వం.. స‌హ‌చ‌ర మంత్రుల‌పై వార్త‌లు రాసేముందు నాతో వివ‌ర‌ణ తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నా అని మీడియాకు సీఎం రేవంత్ సూచించారు.

మంత్రుల స‌హ‌కారంతోనే ఈ ప్ర‌భుత్వం న‌డుపుతున్నాం..

అంద‌రి స‌హ‌కారం తీసుకుని తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు అనుభ‌వాన్ని తీసుకుని ఈ ప్ర‌భుత్వం న‌డుపుతున్నాం. స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ గుడిని 100 రోజుల్లో పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించి మీ అభిమాన నాయ‌కుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బాధ్య‌త అప్ప‌జెప్పి పూర్తి చేయించాం. ఢిల్లీలో ఏ అస‌వ‌రం ఉన్నా.. మ‌న రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావాల‌న్నా.. ఇత‌ర శాఖ‌ల అనుమ‌తులు కావాల‌న్నా భ‌ట్టి విక్ర‌మార్క కాలికి బ‌ల‌పం క‌ట్టి ఢిల్లీలో గ‌ల్లిగ‌ల్లి తిప్పి ప్ర‌తి మంత్రి వ‌ద్ద‌కు పంపించి రాష్ట్రానికి రావాల్సిన అనుమ‌తుల‌ను, నిధుల‌ను రాబ‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నా. ఇది ఉమ్మ‌డిగా మా ప్ర‌భుత్వం న‌డిపిస్తున్న విధానం. గ‌త ప్ర‌భుత్వాలు ఏకపాత్రాభిన‌యం చేసేవారు. మాది అలా కాదు.. అంద‌రం స‌మ‌న్వ‌యం చేసుకుని, అనుభ‌వాల‌ను పంచుకుని అవ‌క‌త‌వ‌క‌ల‌కు తావు లేకుండా ముందుకు వెళ్తున్నాం అని సీఎం స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement