త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కేంద్రానికి సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి: ఆ 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకోండి.. గడువు పెంచండి..!

తెలంగాణ రైతాంగం ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా తీసుకోవాలని, పాత బకాయిలైన రూ.1,468 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు.

J

Telangana | Published On Feb 12, 2026, 9.00 pm IST

CM Revanth Reddy | కేంద్రానికి సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి: ఆ 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకోండి.. గడువు పెంచండి..!
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో ధాన్యం సేకరణ, మిల్లింగ్ గడువు పెంపు, కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గురువారం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ఆయన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగం, పౌరసరఫరాల శాఖకు సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రం సమర్పించారు.

అదనపు ధాన్యం సేకరణపై విజ్ఞప్తి

వానాకాలం పంటకు (2025-26 సీజన్) సంబంధించి రాష్ట్రం నుంచి 53.73 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) ధాన్యం సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే, రాష్ట్రంలో పంట దిగుబడి భారీగా రావడంతో అదనంగా మరో 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఈ అదనపు ధాన్యాన్ని 10 శాతం నూకతో ఎఫ్‌సీఐ (FCI) ద్వారా స్వీకరించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

CM Revanth Reddy Meets Union Minister Pralhad Joshi

బాయిల్డ్ రైస్, గడువు పెంపు

యాసంగి పంట: 2024-25 యాసంగి సీజన్‌కు సంబంధించి 5 శాతం నూకతో అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు.

గడువు పొడిగింపు: 2024-25 వానాకాలం పంటకు సంబంధించి 'కస్టమ్స్ మిల్లింగ్ రైస్' (CMR) గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 28తో ముగుస్తోంది. దీనిని మరో రెండు నెలల పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.

రూ.1,468 కోట్ల పాత బకాయిలు విడుదల చేయండి

గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. 2014-15 వానాకాలంలో ఎఫ్‌సీఐకి సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి రూ.1,468.94 కోట్లు తెలంగాణకు రావాల్సి ఉంది. నాడు అదనపు లెవీ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకుందని, దానికి వడ్డీనే రూ.2 వేల కోట్లకు పైగా పెరిగిపోయిందని సీఎం వివరించారు. ఈ అసలు మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే, 'ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన' కింద (మే 2021 నుంచి మార్చి 2022 వరకు, మరియు ఏప్రిల్ 2022లో) సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన రూ.343.27 కోట్ల బకాయిలను కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అదనపు డైరెక్టర్ రోహిత్ సింగ్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement