త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vivek Venkataswamy | సింగ‌రేణి కార్మికుల‌కు రూ.10వేల పెన్ష‌న్ ఇవ్వండి.. కేంద్ర‌మంత్రిని కోరిన వివేక్‌..!

Vivek Venkataswamy | తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతూ రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీస్‌), గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, గనుల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి, కార్మిక సంక్షేమ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించారు.

P

Telangana | Published On Jul 27, 2026, 6.40 pm IST

Vivek Venkataswamy | సింగ‌రేణి కార్మికుల‌కు రూ.10వేల పెన్ష‌న్ ఇవ్వండి.. కేంద్ర‌మంత్రిని కోరిన వివేక్‌..!
Advertisement

Vivek Venkataswamy | తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతూ రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీస్‌), గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, గనుల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి, కార్మిక సంక్షేమ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించారు. తొలుత కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయిన ప్రతినిధి బృందం తెలంగాణలో కార్మిక సంక్షేమ కార్యక్రమాల విస్తరణకు మరింత కేంద్ర సహకారం అందించాలని కోరింది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాల పెంపు, కేంద్ర పథకాల అమలును మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించింది. ఆ త‌ర్వాత మ‌రో మంత్రి జయంత్ చౌదరిని కలిసి యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించే అంశంపై చర్చించారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ) అభివృద్ధి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాల విస్తరణపై ప్రతిపాదనలు అందించారు.

యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశం క‌ల్పించాలి..

అలాగే, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి కీలకమైన తాడిచర్ల-2 బొగ్గు గని ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ప్రాజెక్టులో ఎలాంటి జాప్యం లేకుండా పనులు చేపట్టి, స్థానిక యువతకు కనీసం వెయ్యి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల ప్రజలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, పునరావాస ప్యాకేజీ (ఆర్‌అండ్‌ఆర్)ను సమగ్రంగా అమలు చేయాలని సూచించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)లో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తక్కువ పెన్షన్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది రిటైర్డ్ కార్మికులకు కనీసం నెలకు రూ.10వేల పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సింగరేణి విస్తరణ, కొత్త బొగ్గు గనుల అభివృద్ధి, గనుల ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు కేంద్ర సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ప్ర‌తిపాద‌న‌ల‌కు సానుకూల స్పంద‌న‌..

తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు. తాడిచర్ల-2 ప్రాజెక్టు వేగవంతమైన అమలు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల పెంపు వంటి అంశాలపై సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ జీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాల విస్తరణ, కార్మిక సంక్షేమ బలోపేతం, గనుల రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

Advertisement
Advertisement