త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NIMS | ప్రభుత్వ వైద్యరంగంలో నిమ్స్‌ సరికొత్త అధ్యాయం

NIMS | నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (NIMS) మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. మూడేళ్లలోపే వెయ్యి రోబోటిక్‌ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వ వైద్యరంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ ఘనత సాధించిన నిమ్స్‌ వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం అభినందించారు. అత్యాధునిక రోబోటిక్‌ శస్త్రచికిత్సలను సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో నిమ్స్‌ విజయవంతమైందని సీఎం పేర్కొన్నారు.

P

Telangana | Published On Aug 3, 2026, 4.34 pm IST

NIMS | ప్రభుత్వ వైద్యరంగంలో నిమ్స్‌ సరికొత్త అధ్యాయం
Advertisement
  • మూడేళ్లలోనే వెయ్యి రోబోటిక్‌ శస్త్ర చికిత్సలు
  • వైద్య బృందాన్ని అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి

NIMS | నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (NIMS) మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. మూడేళ్లలోపే వెయ్యి రోబోటిక్‌ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వ వైద్యరంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ ఘనత సాధించిన నిమ్స్‌ వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం అభినందించారు. అత్యాధునిక రోబోటిక్‌ శస్త్రచికిత్సలను సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో నిమ్స్‌ విజయవంతమైందని సీఎం పేర్కొన్నారు. ఒకప్పుడు అత్యంత ఖరీదైన ఈ చికిత్సలు పొందలేని నిరుపేద రోగులకు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రపంచస్థాయి వైద్యం అందడం తెలంగాణ ప్రజారోగ్య వ్యవస్థలో కీలకమైన ముందడుగని తెలిపారు. నిమ్స్‌ అత్యుత్తమ సేవలు, సాంకేతిక ఆవిష్కరణలు, సమాన వైద్య సేవల పట్ల చూపుతున్న నిబద్ధతకు ఈ ఘనత నిదర్శనమన్నారు.

రోబోటిక్‌ సాంకేతికతను సాధారణ శస్త్రచికిత్సల్లో వినియోగించడం ద్వారా శస్త్రచికిత్సల కచ్చితత్వం పెరగడంతో పాటు శస్త్రచికిత్స అనంతర నొప్పి, రక్తస్రావం తగ్గడం, ఆసుపత్రిలో ఉండే రోజులు తగ్గడం, రోగులు త్వరగా కోలుకునే అవకాశం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య సంస్థలకు నిమ్స్‌ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ విజయానికి కృషి చేసిన నిమ్స్‌ డైరెక్టర్‌, సీనియర్‌ యూరాలజీ, రీనల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ప్రొఫెసర్‌, రోబోటిక్‌ సర్జరీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రాహుల్‌ దేవ్‌రాజ్‌తో పాటు యూరాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, అనస్థీషియాలజీ, నర్సింగ్‌ సేవలు, ఆపరేషన్‌ థియేటర్‌ సిబ్బంది, ఇతర విభాగాల వైద్యులు, ఉద్యోగులను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.

వెయ్యి రోబోటిక్‌ శస్త్రచికిత్సల్లో యూరాలజీ విభాగం 590, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం 248, సర్జికల్‌ ఆంకాలజీ విభాగం 162 శస్త్రచికిత్సలు నిర్వహించింది. యూరాలజీ, జీర్ణాశయ, కాలేయం, పిత్తాశయం, ప్యాంక్రియాస్‌, కొలొరెక్టల్‌, స్త్రీల సంబంధిత, క్యాన్సర్‌కు సంబంధించిన క్లిష్ట శస్త్రచికిత్సలను రోబోటిక్‌ విధానంలో విజయవంతంగా నిర్వహించారు. ముఖ్యంగా ఈ శస్త్రచికిత్సల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) వంటి ప్రభుత్వ పథకాల కింద పూర్తిగా ఉచితంగా నిర్వహించడం విశేషం. అత్యాధునిక వైద్యసేవలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సైతం అందుబాటులోకి తీసుకురావాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమని సీఎం పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement