త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | పేద‌ల కోసం రేవంత్ అన్న ఉన్న‌డని భ‌రోసా క‌ల్పించాలి : సీఎం రేవంత్‌

CM Revanth Reddy | పేద‌ల కోసం రేవంత్ అన్న ఉన్న‌డని భ‌రోసా క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి వైద్యారోగ్య సిబ్బందికి పిలుపునిచ్చారు. స‌న‌త్‌న‌గ‌ర్ టిమ్స్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి ఈ వ్యాఖ్య‌లు చేశారు.

P

Telangana | Published On Aug 17, 2026, 8.55 pm IST

CM Revanth Reddy | పేద‌ల కోసం రేవంత్ అన్న ఉన్న‌డని భ‌రోసా క‌ల్పించాలి : సీఎం రేవంత్‌
Advertisement

CM Revanth Reddy | పేద‌ల కోసం రేవంత్ అన్న ఉన్న‌డని భ‌రోసా క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి వైద్యారోగ్య సిబ్బందికి పిలుపునిచ్చారు. స‌న‌త్‌న‌గ‌ర్ టిమ్స్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 'నిజాం ఆసుప‌త్రి నిజాం స‌ర్కారు నూరు సంవ‌త్స‌రాలకి ముందు పేద‌ల కోసం ప్రారంభించిన ఆసుప‌త్రి. అది కూలిపోవ‌డానికి సిద్ధ‌మై.. అక్క‌డ వైద్యం అందించ‌డానికి క‌ష్ట‌మై వ‌ర్షాలు వ‌చ్చిన‌ప్పుడు వ‌ర‌ద‌లు వ‌స్తే పేద‌ల‌కు వైద్యం అందించ‌డ‌మే క‌ష్ట‌మైంది. ప‌దేళ్లు అధికారం ఉన్న‌వాళ్లు ఉస్మానియా హాస్పిట‌ల్‌ను మ‌రోచోట నిర్మించాల‌నే ఆలోచ‌న కూడా రాలేదు. నిర్ణ‌యం తీసుకోలేదు. మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక ఉస్మానియా హాస్పిట‌ల్ ప‌క్క‌నే గోషామ‌హ‌ల్‌లో 30 ఎక‌రాల్లో 2700కోట్ల‌తో 2వేల ప‌డ‌క‌ల‌తో మ‌ల్టిసూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ నిర్మించుకుంటున్నాం' అని వెల్ల‌డించారు.

ప‌దేళ్ల పాల‌న‌లో నిధులు ఇవ్వ‌డం మ‌రిచారు..

'టిమ్స్‌ల‌కు టెంకాయ కొట్టారు. నిధులు ఇవ్వ‌డం, నిర్మాణం మ‌రిచారు. వ‌రంగ‌ల్‌లో కూడా పెద్ద హాస్పిట‌ల్‌ను క‌డుతామ‌ని.. ఉన్న‌దాన్ని నిర్వీర్యం చేసి.. కొత్త నిర్మాణం కోసం ఉప‌న్యాసం ఇచ్చి అది కూడా మ‌రిచిపోయారు. మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక అత్యంత ప్రాధాన్య‌త‌లో ఉస్మానియా, టిమ్స్‌ల‌ను, వ‌రంగ‌ల్ ఆసుప‌త్రుల‌కు నిధులు కేటాయించి వేగంగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం. ఇవ‌న్నీ పూర్త‌యితే 10వేల ప‌డ‌క‌ల ఆసుప‌త్రులు ఈ రోజు పేద‌ల‌కు అందుబాటులోకి వ‌స్తాయి. ఒక‌నాడు జాన‌ప‌దాల్లో పాడుకునేవారు తెలంగాణ మారుమూల ప‌ల్లెల్లో.. నేనురాను బిడ్డో స‌ర్కారు ద‌వాఖానికి అని. వంద బాధ‌లు ఒక్క ప‌దం, జాన‌ప‌దంలోనే చెప్పుకోవ‌డం జ‌రిగింది. ఈనాడు సంవ‌త్స‌ర‌న్న‌ర తిరిగేలోప‌ల 2027 డిసెంబ‌ర్ 9 తేదీలోగా ఉస్మానియా, అల్వాల్‌, ఎల్‌బీన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్ ఆసుప‌త్రుల‌ను ఆరునెల‌ల‌కోటి పూర్తి చేసి.. ఏ కార్పొరేట్ స్థాయి హాస్పిట‌ల్ కూడా మ‌న ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌తో పోటీప‌డ‌లేని విధంగా చేస్తాం' అని పేర్కొన్నారు సీఎం రేవంత్‌.

ఎయిమ్స్‌కు పోటీగా నిమ్స్‌..

'ఒక్కో డైరెక్ట‌ర్‌ను నియ‌మించి, ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిమ్స్ అందిస్తున్న సేవ‌ల‌కు పోటీగా.. ఎయిమ్స్‌కు పోటీ సేవ‌లు అందిస్తున్న గుర్తింపు నిమ్స్‌కు ఉంది. రాబోయేరోజుల్లో వీట‌న్నింటిని ఆ స్థాయికి నిర్వ‌హించి, అవ‌స‌ర‌మైన నిధులు కేటాయించ‌డ‌మే కాదు.. అపోలో, య‌శోధ‌, ఏఐజీకి వెళ్తే ఎంత ప‌రిశుభ్రంగా ఆ హాస్పిట‌ల్స్‌ను నిర్వ‌హిస్తున్నారో.. ఆ హాస్పిట‌ల్స్‌ను నిర్వ‌హిస్తాం. వాటిపై ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ తీసుకోవాల‌ని సిబ్బందికి సూచిస్తున్నాం. ఆసుప‌త్రుల‌కు వ‌చ్చే రోగుల‌తో పాటు అటెండెంట్స్ హోట‌ల్స్‌, లాడ్జిల్లో ఉండ‌డం, రోగుల‌ను చూసుకోవ‌డం క‌ష్టం. వారికి క్యాంటిన్‌లో మంచి భోజ‌నం, వ‌స‌తి ఇవ్వాలి. అవ‌స‌ర‌మైన నిధులు మంజూరు చేయాల‌ని, సూప‌ర్ పీజీని కూడా మంజూరు చేయాల‌ని ఆరోగ్య‌శాఖ మంత్రికి సూచిస్తున్నా. న‌ర్సింగ్ కాలేజీలు ఇక్క‌డుంటే 60-70శాతం మ‌న న‌ర్సులే సేవ‌లందిస్తారు' అన్నారు.

డాక్ట‌ర్లు ఇన్సెంటివ్స్‌..

'ఆరోగ్య‌శ్రీ‌, సీఎంఆర్ఎఫ్‌లో ఎక్కువ‌గా ప్రైవేటు వారికే ఎక్కువ నిధులు ఇస్తున్నాం. స‌ర్కారు ద‌వాఖానాల్లో వైద్యుల‌ను అద‌నంగా ప‌ని చేయ‌మ‌నండి. స‌ర్జ‌రీలు చేసే డాక్ట‌ర్ల‌కు ఇన్సెంటివ్స్ ఇద్దాం. దాంతో వారు అద‌న‌పు స‌మ‌యం ప్ర‌భుత్వ వైద్య‌శాల‌లోనే ప‌ని చేస్తారు. డ్యూటీ స‌మ‌యం త‌ర్వాత వారి నైపుణ్యం, నేర్ప‌రిత‌నం ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో చేరే పేషెంట్ల కోసం ఉప‌యోగించుకోవాలి. లేక‌పోతే ప్రైవేటు ఆసుప‌త్రుల్లో సేవ‌లు అందిస్తారు. దీన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించాలి. స్పెషాలిటీస్ ఉన్న డాక్ట‌ర్ల‌ను అద‌న‌పు స‌మ‌యం మ‌న ఆసుప‌త్రుల్లోనే ఉప‌యోగించుకునేలా చూడాలి. ఈవిధంగా ఈశాఖ‌ను ప్ర‌క్షాళ‌న చేసుకొని ప్ర‌జ‌ల‌కు ఒక న‌మ్మ‌కాన్ని అందించి మాకు క‌ష్టం వ‌స్తే తెలంగాణ ప్ర‌భుత్వం ఉన్న‌ది.. మ‌మ్మ‌ల్ని చూసుకునేందుకు తెలంగాణ సీఎం రేవంత్ అన్న ఉన్న‌డు అనే భ‌రోసా క‌ల్పించాలి. పేద‌ల‌కు న‌మ్మ‌కం, విశ్వాసం క‌ల్పిస్తే మ‌న జ‌న్మ సార్థ‌కం అయిన‌ట్టే'న‌న్నారు.

ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌నుకుంట‌రు..

'విద్యార్థుల‌కు న‌ర్స‌రీ టూ టువెల్త్ వ‌ర‌కు విద్య‌నందించి.. ఆ త‌ర్వాత సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తే వారికి సంక్షేమ ప‌థ‌కాన్ని వారికి ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. వారే సొంతంగా బ‌తుకుత‌రు. విదేశాల్లోనూ ప‌ని చేసి ల‌క్ష‌లు సంపాదిస్తూ వారి కుటుంబాన్ని ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. ఎవ‌రూ ఇష్టంతో సంక్షేమ ప‌థ‌కాల‌ను ఉచితంగా ప్ర‌భుత్వం నుంచి తీసుకోరు. క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు తీసుకునే ఆలోచ‌న చేస్త‌రు. చాలామంది ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌నుకుంట‌రు. క‌ష్ట‌ప‌డి బ‌త‌కాల‌నుకుంట‌రు. విద్య‌నేర్చుకొని, సాంకేతిక నైపుణ్యం నేర్చుకొని స‌మాజంలో గౌర‌వం పొందాల‌నుకుంట‌రు. ఆ అవ‌కాశం ప్ర‌భుత్వం క‌ల్పించ‌లేన‌ప్పుడే సంక్షేమ ప‌థ‌కాల కోస‌మే ఎదురుచూస్త‌రు. ప‌థ‌కాల‌ను త‌గ్గించాల‌నుకుంటే.. స‌ర్వ‌స‌తంత్రంగా వారి కాళ్ల‌పై వారు నిల‌బ‌డేవిధంగా మ‌న విధానాలను మ‌నం అమ‌లు చేస్తే ఎవ‌రూ ప్ర‌భుత్వం నుంచి ఉచితంగా ఆశించ‌రు. న‌ర్స‌రీ నుంచి టువెల్త్ క్లాస్ వ‌రకు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, స్కూల్ కిట్‌, ఎడ్యుకేష‌న్ ఇవ్వ‌డంతో పాటు నాణ్య‌మైన విద్య‌నందించాలి. సాంకేతిక నైపుణ్యం అందించాలి. దీనిపై స‌హ‌చ‌ర మంత్రులు స‌మ‌యాన్ని కేటాయించి.. ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి. ప్ర‌భుత్వం పేద ప్ర‌జ‌ల కోస‌మే ప‌ని చేస్తుంద‌నే న‌మ్మ‌కం క‌లిగిద్దాం' అని పిలుపునిచ్చారు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి.

Advertisement

తాజావార్తలు

Advertisement