త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | రుణ‌మాఫీపై.. సిద్దిపేట గ‌డ్డ మీద‌.. సిరిసిల్ల అడ్డా మీద చ‌ర్చ‌కు సిద్ధం

CM Revanth Reddy | రైతుల‌కు పూర్తిస్థాయిలో రుణ‌మాఫీ కాలేదంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హ‌రీశ్‌రావు, కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రైతు రుణ‌మాఫీపై సిద్దిపేట గ‌డ్డ‌.. సిరిసిల్ల అడ్డా మీద చ‌ర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం.. మీరు సిద్ధ‌మేనా అని సీఎం రేవంత్ స‌వాల్ విసిరారు.

S

Telangana | Published On Sep 5, 2026, 6.58 pm IST

CM Revanth Reddy | రుణ‌మాఫీపై.. సిద్దిపేట గ‌డ్డ మీద‌.. సిరిసిల్ల అడ్డా మీద చ‌ర్చ‌కు సిద్ధం
Advertisement

హ‌రీశ్‌రావు, కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స‌వాల్

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రైతుల‌కు పూర్తిస్థాయిలో రుణ‌మాఫీ కాలేదంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హ‌రీశ్‌రావు, కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రైతు రుణ‌మాఫీపై సిద్దిపేట గ‌డ్డ‌.. సిరిసిల్ల అడ్డా మీద చ‌ర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం.. మీరు సిద్ధ‌మేనా అని సీఎం రేవంత్ స‌వాల్ విసిరారు. న‌కిరేక‌ల్‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేసిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో రేవంత్ ప్ర‌సంగించారు.

ఇది ఆషామాషీ స‌మావేశం కాదు.. కాంగ్రెస్ త‌లెత్తుకుని నిల‌బ‌డేలా ఈ స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి ప్ర‌త్యేక‌త ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి ఈ రోజు 1000 రోజుల పూర్తి చేసుకున్నాం. న‌ల్ల‌గొండ గ‌ద్ద‌ర్ అద్భుత‌మైన పాట‌ను తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అంకితం చేసిండు.. ఆ పాట‌లో ఒక్కొక్క ప‌థ‌కాన్ని వివ‌రించి చెబుతుంటే నాకే ఆశ్చ‌ర్యం వేసింది. తెల్వ‌కుండానే వెయ్యి రోజుల్లో ఇంత అద్భుత‌మైన గొప్ప ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తే కొంత‌మంది దుర్మార్గులు స‌న్నాసులు ఈ రోజు ఈ ప్ర‌భుత్వం ఫెయిల్ అయింద‌ని రాజీనామా చేయాల‌ని ఊరూరు తిరుగుతున్న‌రు. పండుగ నాడు గంగిరెద్దుల్లొలు వ‌చ్చిన‌ట్టు.. ఏది ప‌డితే అది మాట్లాడి ప్ర‌జా పాల‌న‌ను విమ‌ర్శిస్తున్నారు అని రేవంత్ మండిప‌డ్డారు.

క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్, రైతు భ‌రోసా ర‌ద్దు చేశామా..?

విజ్ఞులైన ప్ర‌జ‌లు, మీడియా మిత్రులు ఆలోచ‌న చేయాలి. ప‌దేండ్ల పాల‌న‌, ఈనాటి వెయ్యి రోజుల ప్ర‌జా పాల‌ను చూడండి. వారు ఇచ్చిన హామీల‌ను, ప‌దేండ్ల‌లో చేసిన ప‌నులు బేరీజు వేసుకోండి. సంక్షేమ ప‌థ‌కాల‌ను అందిస్తున్నాం. అభివృద్ధి కోసం అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్న మా ప్ర‌జా పాల‌న‌ను అంచ‌నా వేయండి. ఒక్క మాట అడ‌గ‌ద‌ల‌చుకున్నా.. మా ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే వారిని సూటిగా అడుగుతున్నా.. మీరు అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌ను ఈ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిందా.. క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్, రైతు భ‌రోసా ర‌ద్దు చేశామా..? వాటిని అమ‌లు చేస్తూనే నిధులు పెంచి అందుబాటులోకి తీసుకొచ్చాం అని సీఎం తెలిపారు.

మోస‌గించి గ‌ద్దె దిగిపోయారు..

ప‌దేండ్ల‌లో రుణ‌మాఫీ చేయ‌క‌పోవ‌డంతో రైతుల‌కు అప్పులు పెరిగాయి. రెండోసారి రుణ‌మాఫీ చేస్తార‌ని కేసీఆర్‌ను సీఎం చేస్తే.. అస‌లు, మిత్తీకి పంగ‌నామం పెట్టి ఓఆర్ఆర్ అమ్ముకుని ఏడున్న‌ర వేల కోట్ల మింగి రుణ‌మాఫీ చేయ‌లేదు. చివ‌రి విడ‌త రైతు భ‌రోసా ఎగ‌గ్గొట్టి.. ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను అడ్డుపెట్టుకుని మోస‌గించి గ‌ద్దె దిగిపోయారు. ఇవాళ ప్ర‌జా పాల‌న‌లో తొలి ఏడాదిలోనే 25 ల‌క్ష‌ల 35 వేల మంది రైతుల‌కు రూ. 20617 కోట్లు.. రూ. 2 ల‌క్ష‌ల చొప్పున రుణ‌మాఫీ చేశాం. రుణ‌మాఫీపై సిద్దిపేట గ‌డ్డ మీద‌.. సిరిసిల్ల అడ్డా మీద చర్చిచేందుకు సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా..? మీరు రైతు భ‌రోసా నిధులు ఎగ్గొడితే.. మేం 32 నెల‌ల్లోనే రూ. 36 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జ‌మం చేశాం.. దీనిపై కూడా శాస‌న‌స‌భ‌లో చ‌ర్చిద్దామా అని స‌వాల్ విసురుతున్నాను అని సీఎం పేర్కొన్నారు.

Advertisement
Advertisement