త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Coal Gasification Scheme | బొగ్గు గ్యాసిఫికేషన్‌ పథకానికి స్పంద‌న క‌రువంటూ వార్త‌లు.. స్ప‌ష్ట‌త‌నిచ్చిన కేంద్రం..!

Coal Gasification Scheme | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.37,500 కోట్లతో చేపట్టిన బొగ్గు, లిగ్నైట్‌ గ్యాసిఫికేషన్‌ పథకానికి దరఖాస్తులు రాలేదన్న వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. తొలి విడత దరఖాస్తుల స్వీకరణకు గడువు సెప్టెంబరు 7 వరకు ఉందని.. గడువు ముగియకముందే పథకానికి స్పందన లేదని చెప్పడం సరికాదని బొగ్గు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

P

National | Published On Sep 5, 2026, 6.17 pm IST

Coal Gasification Scheme | బొగ్గు గ్యాసిఫికేషన్‌ పథకానికి స్పంద‌న క‌రువంటూ వార్త‌లు.. స్ప‌ష్ట‌త‌నిచ్చిన కేంద్రం..!
Advertisement

Coal Gasification Scheme | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.37,500 కోట్లతో చేపట్టిన బొగ్గు, లిగ్నైట్‌ గ్యాసిఫికేషన్‌ పథకానికి దరఖాస్తులు రాలేదన్న వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. తొలి విడత దరఖాస్తుల స్వీకరణకు గడువు సెప్టెంబరు 7 వరకు ఉందని.. గడువు ముగియకముందే పథకానికి స్పందన లేదని చెప్పడం సరికాదని బొగ్గు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. దేశీయ బొగ్గు, లిగ్నైట్‌ను సింథసిస్‌ గ్యాస్‌ (సింగ్యాస్‌), మిథనాల్‌, అమ్మోనియా, యూరియా వంటి విలువైన ఉత్పత్తులుగా మార్చే లక్ష్యంతో ఈ పథకాన్ని కేంద్ర కేబినెట్‌ మే 13న ఆమోదించింది.

దిగుమతి ఆధారిత ముడిపదార్థాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు దేశ ఇంధన, ఆర్థిక భద్రతను బలోపేతం చేయడం దీని ఉద్దేశం. పథకంపై పరిశ్రమ వర్గాలకు అవగాహన కల్పించేందుకు మే 28న ఢిల్లీ, జూన్‌ 11న హైదరాబాద్‌, జూన్‌ 18న ముంబయిలో రోడ్‌షోలు నిర్వహించారు. అనంతరం జూలై 7న ఆర్‌ఎఫ్‌పీ జారీ చేసి ఆన్‌లైన్‌ దరఖాస్తు పోర్టల్‌ను ప్రారంభించారు. జూలై 20న ప్రీ-అప్లికేషన్‌ సమావేశం నిర్వహించారు. తొలి విడత గడువు ఇంకా ముగియలేదని.. తాల్చేర్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (టీఎఫ్‌ఎల్‌), ఎన్‌టీపీసీ లిమిటెడ్‌ ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాయని మంత్రిత్వశాఖ తెలిపింది. మరికొన్ని సంస్థలు ప్రాజెక్టుల సన్నాహకాల్లో ఉన్నాయని పేర్కొంది. భారీ స్థాయి ప్రాజెక్టులు కావడంతో ప్రీ-ఫీజిబిలిటీ నివేదికలు, సాంకేతికత ఎంపిక, బొగ్గు సరఫరా ఏర్పాట్లు, ఆర్థిక మదింపులు, సమగ్ర ప్రాజెక్టు ప్రతిపాదనల రూపకల్పనకు సమయం పడుతుందని వివరించింది.

ఒకే విడతతో పథకాన్ని పరిమితం చేయకుండా.. వరుస విడతల్లో దరఖాస్తులు స్వీకరించేలా నిబంధనలు రూపొందించారు. ఒక విడత ముగిసిన మరుసటి రోజు నుంచి తదుపరి విడత ప్రారంభమై రెండు నెలలపాటు కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు సన్నాహకాలకు అదనపు సమయం అవసరమైన సంస్థలకు కూడా అవకాశం లభించనుంది. ఈ పథకం ద్వారా దాదాపు 25 ప్రాజెక్టులకు రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు, సుమారు 50 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేస్తోంది. 2030 నాటికి 100 మిలియన్‌ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్‌ సామర్థ్యాన్ని సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో ఈ పథకం కీలకంగా మారనుంది.

Advertisement
Advertisement