త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | పిల్ల‌ల‌ను క‌న‌గ‌లం కానీ.. వాళ్ల బుద్ధుల‌ను క‌న‌గ‌ల‌మా : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026కు శాస‌న‌స‌భ ఆమోదం తెలిపిన సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆవేద‌న‌తో మాట్లాడారు. పిల్ల‌ల‌ను క‌న‌గ‌లం కానీ, వాళ్ల బుద్ధుల‌ను క‌న‌గ‌ల‌మా అని ఓ సినిమాలోని డైలాగ్‌ను చెప్పారు. ఈ రోజు కొంద‌రు త‌ల్లిదండ్రుల ప‌రిస్థితి అదే అని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Mar 29, 2026, 5.00 pm IST

CM Revanth Reddy | పిల్ల‌ల‌ను క‌న‌గ‌లం కానీ.. వాళ్ల బుద్ధుల‌ను క‌న‌గ‌ల‌మా : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026కు శాస‌న‌స‌భ ఆమోదం తెలిపిన సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆవేద‌న‌తో మాట్లాడారు. పిల్ల‌ల‌ను క‌న‌గ‌లం కానీ, వాళ్ల బుద్ధుల‌ను క‌న‌గ‌ల‌మా అని ఓ సినిమాలోని డైలాగ్‌ను చెప్పారు. ఈ రోజు కొంద‌రు త‌ల్లిదండ్రుల ప‌రిస్థితి అదే అని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బతికున్నప్పుడు గుప్పెడు మెతుకులు పెట్టని బిడ్డలు, చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం అత్యంత విషాదక‌ర‌మ‌ని సీఎం పేర్కొన్నారు.

శాస‌న‌స‌భ‌లో సీఎం ప్ర‌సంగం..

పురాణాలలో మాతృ పితృ భక్తికి మారుపేరుగా నిలిచిన శ్రవణ కుమారుడి కథ అద్దం పడుతుంది. చూపులేని తన వృద్ధ తల్లిదండ్రుల కోరిక మేరకు, వారిని ఒక కావిడి బుట్టలలో కూర్చోబెట్టుకుని తన భుజాలపై మోస్తూ పుణ్యక్షేత్ర దర్శనానికి తీసుకువెళ్లాడు. ఒకరోజు సరయూ నదీ తీరంలో తల్లిదండ్రుల దప్పిక తీర్చడానికి శ్రవణుడు నీళ్లు ముంచుతుండగా, ఆ శబ్దాన్ని విని ఏదో క్రూర మృగం అని పొరబడిన దశరథ మహారాజు 'శబ్దభేది' బాణాన్ని ప్రయోగిస్తాడు. ఆ బాణం తగిలి శ్రవణుడు మరణించాడు. పుత్రశోకంతో అలమటించిన ఆ వృద్ధ దంపతులు "నీవు కూడా పుత్ర వియోగంతోనే మరణిస్తావు" అని దశరథుడిని శపిస్తారు. తల్లిదండ్రులను ప్రేమించడంలో శ్రవణ కుమారుడిని ఆదర్శంగా తీసుకుంటే ఎలాంటి చట్టాలు, ఎలాంటి నిబంధనలు అవసరం లేదు అని సీఎం పేర్కొన్నారు.

ఆధునిక సమాజపు చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తోంది..

ప్రఖ్యాత దుస్తుల బ్రాండ్ రేమండ్స్ మాజీ ఆధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్ పథ్ సింఘానియా (87) మార్చి 28న ముంబైలో కన్నుమూశారు. వ్యాపారవేత్తగా విజయవంతమైన జీవితాన్ని గడిపిన సింఘానియా చివరికి కొడుకు చేసిన ద్రోహంతో అనామికుడిగా తనువు చాలించాల్సి వచ్చింది. విజయ్ పథ్ సింఘానియా తన జీవితకాలపు కష్టార్జితాన్ని, సుమారు రూ. 1,000 కోట్ల విలువైన రేమండ్ సామ్రాజ్యపు వాటాలను కుమారుడు గౌతమ్ సింఘానియాకు 'గిఫ్ట్ డీడ్' ద్వారా అప్పగించిన తర్వాత ఆయన జీవితం అత్యంత విషాదకరంగా మారింది. ఆస్తి చేతికి రాగానే గౌతమ్ తన తండ్రిని నిర్లక్ష్యం చేయడమే కాకుండా, ముంబైలోని ప్రతిష్టాత్మక 'జేకే హౌస్'లో ఆయనకు దక్కాల్సిన నివాసాన్ని కూడా నిరాకరించి బయటకు పంపించేశారు. తన కారు, డ్రైవర్ సిబ్బందిని కూడా గౌతమ్ తొలగించడంతో ఆయన దక్షిణ ముంబైలో ఒక సాధారణ అద్దె ఇంట్లో నివసించాల్సి వచ్చింది. ఒకప్పుడు విమానాలలో తిరుగుతూ అత్యంత విలాసవంతమైన జీవితం గడిపారు. ఆస్తి మొత్తం కొడుకు పరం చేయడంతో చివరకు కనీస సౌకర్యాలు లేక, సొంత ఖర్చుల కోసం కోర్టులను ఆశ్రయించాల్సిన దుర్భర స్థితికి చేరుకున్నారు. తన ఆత్మకథ 'An Incomplete Life'లో ఈ చేదు అనుభవాలను వివరించారు. "పిల్లలకు సర్వస్వం ఇచ్చేసి నేను పెద్ద తప్పు చేశాను, ఏ తండ్రీ నాకంటే దారుణమైన స్థితిని అనుభవించకూడదు" అని ఆయన ఆ పుస్తకంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఆస్తిపాస్తులు లేకపోయినా తన భుజాలపై తల్లిదండ్రులను మోసి పుణ్యక్షేత్రాలు చూపించిన శ్రవణ కుమారుడి గాథ అజరామరమైతే.. అనామకుడిగా కన్నుమూసిన విజయ్ పథ్ సింఘానియా ఉదంతం ఆధునిక సమాజపు చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తోంది సీఎం రేవంత్ తెలిపారు.

తల్లిదండ్రుల పట్ల భక్తి లేని వారికి భయం కలిగించేందుకే ఈ చట్టం..

ఈ బిల్లును ఎంతో బాధ్యతతో, భావోద్వేగంతో ఆలోచన చేసి తీసుకువస్తున్నాం. తల్లిదండ్రుల పట్ల భక్తి లేని వారికి భయం కలిగించేందుకే ఈ చట్టం. వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ కల్పించే దిశగా ఇది ఒక కీలక అడుగు. మనిషి బంధాలు.. అనుబంధాలను మర్చిపోయి చివరికి పేగు బంధాలను కూడా విస్మరించి.. భౌతిక సుఖాలు, ఆర్థిక ప్రయోజనాలు, సంపద కోసం పాకులాటల్లో మునిగిపోయారు. “అడ్డాల నాడే బిడ్డలు తప్ప గడ్డాల నాడు కాదు” అని అనాథలుగా మారిన తల్లి దండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం ఈ సమాజానికి మంచిది కాదు అని సీఎం పేర్కొన్నారు.

తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో వివక్ష, నిర్లక్ష్యం

మన దేశంలో పిల్లల సామాజిక భద్రత, మహిళల భద్రత, హక్కులకు రాజ్యాంగ రక్షణతో పాటు, అనేక చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (ఏ) ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్య హక్కు ఉంది. ఆర్టికల్ 24 ప్రకారం ప్రమాదకర పనుల్లో బాల కార్మికుల నిషేధం ఉంది. అనాథలు, నిరాశ్రయ పిల్లలు, నేరాల్లో చిక్కుకున్న పిల్లల సంరక్షణ కోసం జువెనైల్ జస్టిస్ యాక్ట్ (2015) ఉంది. పిల్లలపై లైంగిక దాడులు, వేధింపుల నుంచి రక్షణ కోసం పోక్సో యాక్ట్ (2012) ఉంది. రైట్ టు ఎడ్యూకేషన్ యాక్ట్ (2009) ఉంది. 14 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోకూడదని చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది. బాల్య వివాహాల నిషేధం చట్టం ఉంది. మన దేశానికి పిల్లల హక్కులు, రక్షణ విషయంలో అనేక అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఉన్నాయి. మహిళల విషయానికి వస్తే... గృహహింస నుంచి వాళ్లకు భద్రత కల్పించడం కోసం చట్టం ఉంది. లైంగిక నేరాలకు సంబంధించి నిర్భయ లాంటి చట్టాలు ఉన్నాయి. వరకట్న నిషేధ చట్టం ఉంది.. మహిళల గౌరవం - హక్కుల పరిరక్షణకు చట్టం ఉంది. ఇక వృద్ధుల సామాజిక భద్రతకు సంబంధించి మన దేశంలో చట్టాలు ఉన్నాయి. పిల్లలు తమ తల్లి దండ్రులను చూసుకోవడం చట్టబద్ధ బాధ్యతగా చేస్తూ “maintenance and welfare of parents and senior citizens act 2007” ఉంది. ఇంకా మరికొన్ని చట్టాలు ఉన్నాయి. ఐనా, సమాజంలో తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో జరుగుతోన్న వివక్ష, నిర్లక్ష్యం మనం చూస్తున్నామ‌ని సీఎం తెలిపారు.

చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం అత్యంత విషాదం..

బతికున్నప్పుడు గుప్పెడు మెతుకులు పెట్టని బిడ్డలు, చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం అత్యంత విషాదం. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది ... పిల్లలను కనగలం కానీ, వాళ్ల బుద్ధులను కనగలమా అని. ఈ రోజు కొందరు తల్లిదండ్రుల పరిస్థితి ఇదే. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. లేదా ఎక్కువ మంది పిల్లలను కనే వాళ్లు. దాని వల్ల ఒకరు కాకపోయినా ఇంకొకరైనా తల్లిదండ్రుల సంరక్షణ చూసుకునే వాళ్లు. ఈ రోజుల్లో పరిస్థితులు మారాయి.. కుటుంబ నియంత్రణతో ఒక్కరో ఇద్దరికో పరిమితమయ్యారు. కుటుంబం అంటే కొడుకైనా, కూతురైనా ఇద్దరూ సమానమే. ఆడబిడ్డలకు తల్లిదండ్రులకు ప్రేమ ఉన్నా.. మెట్టినింటి బాధ్యతలతో ఏమీ చేయలేకపోతున్నారు. నాకు తెలిసిన ఒక ప్రజా ప్రతినిధి తండ్రికి క్యాన్సర్ వస్తే ఆయనను చూసుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఇటీవలే ఆ తండ్రి మరణించారు అని సీఎం గుర్తు చేశారు.

ఏ తల్లిదండ్రులు అనాథలుగా ఉండకూడదు..

తల్లిదండ్రులను చూసుకోలేని వారిని సామాజం బహిష్కరించాలి. ఒక సామాజిక బాధ్యతగా ఈ బిల్లును తీసుకువస్తున్నాం. ఈ చట్టంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని కాదు. ఈ చట్టంతో వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించేందుకే మా ప్రయత్నం. ఏ తల్లిదండ్రులు అనాథలుగా ఉండ కూడదు, చివరి రోజుల్లో వాళ్ల బాగోగుల కోసం ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఈ బిల్లును తెస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement