త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | సెప్టెంబర్ 7లోగా జీవో 97 రద్దు చేయకుంటే సీఎం ఇంటి ముట్టడే

పాలిటెక్నిక్ ఆస్తులను స్కిల్ వర్సిటీకి ధారాదత్తం చేసే జీవో 97ను వెంటనే రద్దు చేయాలని, లేకుంటే లక్ష మందితో సీఎం ఇంటిని ముట్టడిస్తామని తలసాని హెచ్చరించారు.

J

Telangana | Published On Sep 3, 2026, 2.55 pm IST

Talasani Srinivas Yadav | సెప్టెంబర్ 7లోగా జీవో 97 రద్దు చేయకుంటే సీఎం ఇంటి ముట్టడే
Advertisement
  • పాలిటెక్నిక్ కాలేజీల ఆస్తులను కొల్లగొట్టేందుకే రేవంత్ సర్కార్ జీవో 97 తీసుకొచ్చిందని మాజీ మంత్రి తలసాని ఆరోపణ
  • ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ స్టూడెంట్స్‌కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
  • సెప్టెంబర్ 7వ తేదీలోగా జీవోను వెనక్కి తీసుకోకపోతే విద్యార్థులతో కలిసి సీఎం ఇంటిని ముట్టడిస్తామని వార్నింగ్
  • స్కిల్ వర్సిటీ పేరుతో వేలాది కోట్ల విలువైన భూములను ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని తీవ్ర విమర్శలు

Talasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో పాలిటెక్నిక్ ఆస్తులను కొల్లగొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 97ను తీసుకొచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆయన స్వయంగా వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ నెల 7వ తేదీలోగా ఆ వివాదాస్పద జీవోను వెనక్కి తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం

ప్రజాపాలన పేరుతో ఈ ప్రభుత్వం దోపిడీ దొంగల్లా రాష్ట్రాన్ని దోచుకుంటోందని తలసాని విమర్శించారు. స్కిల్ వర్సిటీ (Skill University) పేరుతో పాలిటెక్నిక్ కాలేజీల భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee reimbursement), స్కాలర్‌షిప్స్ (Scholarships) ఇవ్వకుండా వారి భవిష్యత్‌ను రోడ్డు పాలు చేస్తున్నారని మండిపడ్డారు.

కమిటీల పేరుతో డ్రామాలు

ప్రభుత్వం తూతూ మంత్రంగా ఒక కమిటీ వేసి కాలయాపన చేస్తోందని తలసాని ఫైర్ అయ్యారు. "అసలు ఈ జీవో తీసుకురమ్మని ఎవరడిగారు? ప్రశాంతంగా కాలేజీల్లో చదువుకునే పిల్లలను రోడ్ల మీదికి ఎందుకు తెచ్చారు?" అని సూటిగా ప్రశ్నించారు. ఇది కేవలం అధికారి ఆకునూరి మురళి సమస్య కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల భూములపై ముఖ్యమంత్రికి కన్ను పడిందని ఆయన ఆరోపించారు.

లక్ష మందితో సీఎం ఇంటి ముట్టడి

సెప్టెంబర్ 7లోగా జీవో 97ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే.. లక్ష మంది పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని సంచలన ప్రకటన చేశారు. విద్యార్థులు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, సెక్రటేరియట్ ముట్టడి అయినా సరే బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వారికి పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఏకమైతే ఏకంగా కేంద్ర ప్రభుత్వమే దిగివచ్చిందని, ఈ స్టూడెంట్ పవర్ (Student Power) ను తక్కువ అంచనా వేయొద్దని తలసాని ఈ సందర్భంగా సీఎంను హెచ్చరించారు. మహబూబాబాద్, సూర్యాపేటలో స్టూడెంట్స్ పై జరిగిన పోలీసు దౌర్జన్యాలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాబోయే రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని, విద్యార్థులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement