త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | తెలంగాణ‌లో కాంగ్రెస్ ఖ‌తం.. 78 సీట్ల‌తో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటు

KTR | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని ఇక అయిపోయినట్లే అని, ఇదే అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించుకున్న సొంత సర్వేలోనూ తేలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

S

Telangana | Published On Jul 9, 2026, 4.59 pm IST

KTR | తెలంగాణ‌లో కాంగ్రెస్ ఖ‌తం.. 78 సీట్ల‌తో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటు
Advertisement

రెండున్న‌రేండ్ల ప‌ద‌వీకాలంపై సీఎం రేవంత్ విస్తృత‌ స‌ర్వే
స‌ర్వేలో ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా వ్యక్తమైంది
ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా బీఆర్ఎస్‌కు 78 సీట్లని స‌ర్వేలో తేలింది
కేంద్ర‌, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌లోనూ ఇదే వ్య‌క్త‌మైంది
ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను త‌ట్టుకోలేకనే అడ్డ‌గోలుగా సీఎం మాట‌లు
బీఆర్ఎస్ పార్టీ నేత‌ల స‌మావేశంలో కేటీఆర్ వ్యాఖ్య‌లు

KTR | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని ఇక అయిపోయినట్లే అని, ఇదే అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించుకున్న సొంత సర్వేలోనూ తేలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తన పరిపాలన పైన, తన నాయకత్వం పైన, సగం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒక విస్తృత సర్వేను చేయించుకున్నారని, అందులోనూ ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా వ్యక్తమైందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ సుమారు 78 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ సర్వేలో తేలిందన్నారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ నివాసంలో జ‌రిగిన స‌మావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

దీంతో పాటు రెండు మీడియా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగాలు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం వ్యక్తమైందన్నారు. మరోసారి ప్రజలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని స్పష్టంగా తమ అభిప్రాయం చెప్పిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.

అయితే, తన సొంత సర్వేతో పాటు పలు సర్వేల్లో వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే ముఖ్యమంత్రి గత వారం రోజులుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. దీంతో పాటు తన పరిపాలన వైఫల్యాలను ముఖ్యంగా కప్పిపుచ్చుకునేందుకు అనేక అటెన్షన్ డైవర్షన్ పనులు చేస్తున్నారని, అందులో భాగంగానే కాళేశ్వరం నుంచి మొదలుకొని రైతుబంధు వరకు అన్నింటిపైన అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని, సగం పరిపాలనా కాలం ముగిసిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఇచ్చిన గ్యారంటీల అమలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైనందువల్లనే తెలంగాణలోని సబ్బండ వర్గాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై నమ్మకం కోల్పోయారన్నారు.

దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా స్పష్టంగా ప్రజలు బిఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నారని, బిజెపి లాంటి ఇతర పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ జారుడు బండపైన నిలబడిందని, ఇక పుంజుకునే అవకాశమే లేదన్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల అబద్ధాలు చెప్పినా, ప్రజలకు మోసం చేయాలని చూసినా కాంగ్రెస్ పార్టీ ముందు ముందు ప్రజామోదం పొందడం అత్యంత కష్టమని కేటీఆర్ అన్నారు.

Advertisement
Advertisement