త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | గ్రామసభల‌తో ఎల్‌నీనోపై చైతన్యం కల్పించండి

Uttam Kumar Reddy | ఎల్‌నినోపై గ్రామ స‌భ‌ల ద్వారా చైత‌న్యం క‌ల్పించాల‌ని.. జిల్లాల వారీగా కార్యాచ‌ర‌ణ క‌లిగి ఉండాల‌ని మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. సాగునీటి వినియోగాన్ని శాస్త్రీయంగా నిర్వ‌హించాల‌ని సూచించారు.

S

Telangana | Published On Jul 9, 2026, 4.42 pm IST

Uttam Kumar Reddy | గ్రామసభల‌తో ఎల్‌నీనోపై చైతన్యం కల్పించండి
Advertisement
  • వాతావరణ, వ్యవసాయ, నీటిపారుదల శాఖల సమన్వయంతో కార్యాచరణ
  • జిల్లాల వారీగా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష‌లు చేప‌ట్టాలి
  • సాగునీటి వినియోగాన్ని శాస్త్రీయంగా నిర్వహించాలి
  • రైతులు వదంతులు నమ్మొద్దు.. అధికారుల సూచనలనే పాటించాలి
  • ఎల్‌నినోపై స‌మీక్ష‌లో అధికారుల‌కు మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి దిశా నిర్దేశం

Uttam Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఎల్‌నినోపై గ్రామ స‌భ‌ల ద్వారా చైత‌న్యం క‌ల్పించాల‌ని.. జిల్లాల వారీగా కార్యాచ‌ర‌ణ క‌లిగి ఉండాల‌ని మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. సాగునీటి వినియోగాన్ని శాస్త్రీయంగా నిర్వ‌హించాల‌ని సూచించారు. జిల్లాల వారీగా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష‌లు ఉంటాయ‌ని చెప్పారు. రైతులు కూడా వదంతులు న‌మ్మొద్ద‌ని.. అధికారుల సూచ‌న‌ల‌నే పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు గురువారం ఎల్‌నీనోపై రాష్ట్ర సచివాలయంలో ఆయ‌న‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు పాల్గొన‌గా వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా అటెండయ్యారు. వీరితో పాటు కలెక్టర్లు, వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఎల్‌నీనోపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది. ఎల్‌నీనో ప్రభావానికి అనుగుణంగా జిల్లా వారీ కార్యాచరణకు ఆదేశాలిచ్చాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రతి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. వాతావరణ, వ్యవసాయ, నీటిపారుదల శాఖల సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలి. వర్షపాతం, నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి అని ఉత్త‌మ్ ఆదేశించారు.

రిజ‌ర్వాయ‌ర్ల‌పై ప్ర‌త్యేక దృష్టి...

శాస్త్రవేత్తల సూచనల మేరకు పంటల ఎంపికపై రైతులకు మార్గదర్శకాలు జారీ చేశాం. ప్రతి రైతుకు వ్యవసాయ శాఖ ద్వారా సాంకేతిక సలహాలు అందుబాటులోకి తెస్తాం. రిజర్వాయర్లలో నీటి లభ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సాగునీటి వినియోగాన్ని శాస్త్రీయంగా నిర్వహిస్తాం. సాగుకు అవసరమైన ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలి. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలి. ప్రతి జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం. ఎల్‌నీనో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది.

ఈ స‌మీక్ష‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, నీటి పారుదల శాఖ‌ కార్యదర్శి ఇ.శ్రీధర్, సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వి.సి జానయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement