త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి

Indiramma Illu | పేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో స్టీల్, సిమెంట్ పరిశ్రమలు భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి నిర్మాణ సామగ్రిని తక్కువ ధరలకు అందించాలని కోరారు.

P

Telangana | Published On Jul 9, 2026, 5.45 pm IST

Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి
Advertisement
  • స్టీల్, సిమెంట్ ధరలు త‌గ్గించండి
  • కంపెనీల‌కు మంత్రులు శ్రీ‌ధ‌ర్‌బాబు, పొంగులేటి విజ్ఞ‌ప్తి
  • సానుకూలంగా స్పందించిన యాజ‌మాన్యాలు

Indiramma Illu | పేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో స్టీల్, సిమెంట్ పరిశ్రమలు భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి నిర్మాణ సామగ్రిని తక్కువ ధరలకు అందించాలని కోరారు. సచివాలయంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి ధరలు, సరఫరా, పరిశ్రమల సహకారం అంశాలపై వివిధ పరిశ్రమల ప్రతినిధులతో మంత్రులు సమావేశమయ్యారు. మంత్రుల విజ్ఞప్తికి పరిశ్రమల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదని, పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం, సామాజిక భద్రత, ఆత్మగౌరవాన్ని అందించే మహత్తర కార్యక్రమమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ మినహా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగుతున్నాయని, సుమారు 85 శాతం ఇళ్ల శ్లాబ్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన ఇళ్లు కూడా వివిధ నిర్మాణ దశల్లో వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. రెండో విడతలో నియోజకవర్గానికి 2 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేయడంతో పాటు, జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని మంత్రులు వెల్లడించారు. గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా 1,000 నుంచి 1,500 ఇళ్ల వరకు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని, మూడో, నాలుగో విడతల్లోనూ అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 శాతం సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ పేదల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం లేదని మంత్రులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ పేదల ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు. నిర్మాణ పురోగతికి అనుగుణంగా ప్రతి సోమవారం పారదర్శకంగా లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రతి పేద కుటుంబం సొంత ఇంటిలో నివసించే వరకు ప్రభుత్వం తన బాధ్యతను కొనసాగిస్తుందని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఒక ప్రజా ఉద్యమంగా మారాలంటే ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రులు అన్నారు. పేదలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం చేసే సంస్థలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. స్టీల్, సిమెంట్ పరిశ్రమలు తక్కువ ధరలకు నిర్మాణ సామగ్రి అందించేలా చర్యలు తీసుకోవాలని, ఆ సామగ్రి లబ్ధిదారులకు చేరే విధంగా పరిశ్రమలు, హౌసింగ్ అధికారులు కలిసి రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని మంత్రులు సూచించారు. సమావేశంలో పరిశ్రమల ప్రతినిధులతో పాటు హౌసింగ్ శాఖ కార్యదర్శి వీపీ గౌతమ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, టీజీఐఐసీ ఎండీ శశాంక తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement