త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | డిసెంబ‌ర్ 9 చ‌రిత్ర‌లో నిలిచిపోయే రోజు.. ‘విజ‌య్ దివ‌స్’ సంబురాల‌కు కేటీఆర్ పిలుపు

KTR | డిసెంబర్‌ 9.. ఉద్యమరూపం భావజాల వ్యాప్తి దశ నుంచి పోరాట పథానికి మారిన సందర్భం. ఉద్యమనేత, టీఆర్‌ఎస్‌ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు నవంబర్‌ 29, 2009న ఆమరణ దీక్ష ప్రారంభించింది మొదలు 11 రోజులపాటు నలుదిక్కులను ఏకం చేసి కేంద్రం తెలంగాణ ఏర్పాటు చేయక తప్పని అనివార్యతను సృష్టించిన అజరామర ఘట్టం. ఈ ఘ‌ట్టంతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్ర‌క్రియ‌లో కీల‌క మ‌లుపు తిప్పింది.

S

Telangana | Published On Dec 7, 2025, 2.10 pm IST

KTR | డిసెంబ‌ర్ 9 చ‌రిత్ర‌లో నిలిచిపోయే రోజు.. ‘విజ‌య్ దివ‌స్’ సంబురాల‌కు కేటీఆర్ పిలుపు
Advertisement

KTR | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్ర‌క్రియ‌కు కీల‌క‌మైన‌ డిసెంబ‌ర్ 9వ తేదీ చ‌రిత్ర‌లో నిలిచిపోయే రోజు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో డిసెంబర్ 9న విజయ్ దివ‌స్ వేడుక‌ల‌ను ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని గులాబీ శ్రేణుల‌కు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో కేటీఆర్ టెలికాన్ఫ‌రెన్స్ నిర్వహించి, దిశానిర్దేశం చేశారు.

కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజే డిసెంబర్ 9 అని కేటీఆర్ గుర్తుచేశారు. నవంబర్ 29న 'దీక్షా దివ‌స్'ను విజయవంతం చేసినట్లే, కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ 9ని విజయం సాధించిన రోజుగా ‘విజయ్ దివ‌స్’ పేరుతో పండుగలా జరుపుకోవాలని ఆయన సూచించారు. డిసెంబర్ 9 రోజే 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష వలన ఒక రూపం వచ్చిందని కేటీఆర్ అన్నారు. అంతటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ, ఆనాడు కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తుచేస్తూ, ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సిద్ధించిన రోజును సంబరంగా నిర్వహించుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున, గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే ఈ కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ సూచించారు.

డిసెంబర్ 9న చేపట్టాల్సిన కార్యక్రమాలివే..

విజయ్ దివ‌స్‌ను పుర‌స్క‌రించుకొని ప్ర‌తి నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని కేటీఆర్ సూచించారు. డాక్టర్ బీఆర్అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయాలి. పార్టీ కార్యాలయాల వద్ద లేదా ప్రధాన కూడళ్లలో విజయానికి సూచికగా పింక్ బెలూన్లను గాలిలోకి ఎగురవేయాలి. కార్యక్రమం అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కేసీఆర్ దీక్ష, తెలంగాణ పోరాటం, విద్యార్థుల త్యాగాలను ప్రజలకు, భవిష్యత్ తరాలకు గుర్తుచేయాలని కేటీఆర్ పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో నిమ్స్‌లో ప్రత్యేక కార్యక్రమం

కేసీఆర్ దీక్ష ఫలవంతమైన నిమ్స్ (NIMS), గాంధీ ఆసుపత్రిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. నగర నాయకత్వం ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. విజ‌య్ దివాస్‌కు మరో రెండు రోజులు సమయం ఉన్నందున జిల్లా అధ్యక్షులు చొరవ తీసుకొని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement