త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Plenary | ప్లీనరీనా? బహిరంగ సభనా? అసలేదీ లేదా?

BRS Plenary | 25 వసంతాలు పూర్తి చేసుకొని తెలంగాణలో పెట్టని కోటగా ఎదిగిన భారత రాష్ట్ర సమితిలో ఇప్పుడు ఉత్సాహం సన్నగిల్లిందా? తెలంగాణ సాధనే సంకల్పంగా పోరాటం చేసి భారత రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన గులాబీ పార్టీ నేడు నైరాశ్యంలో కూరుకుపోయిందా? జనమే బలంగా ఎదిగిన పార్టీని నిస్పృహ ఆవహించిందా?

S

Telangana | Published On Apr 9, 2026, 8.16 pm IST

BRS Plenary | ప్లీనరీనా? బహిరంగ సభనా? అసలేదీ లేదా?
Advertisement

ఏప్రిల్ 27న బీఆర్ ఎస్ 26వ వార్షికోత్సవం
మౌనం వహించిన అగ్ర నాయక గణం
జగిత్యాలలోనూ ఎటూ తేల్చని కేటీఆర్
నైరాశ్యంలో కార్యకర్తలు
సారు ప్రజాక్షేత్రంలోకి ఇంకెప్పుడొస్తారోనంటూ..
ఆశగా ఎదురుచూస్తున్న శ్రేణులు

BRS Plenary | త్రినేత్ర‌.న్యూస్ : 25 వసంతాలు పూర్తి చేసుకొని తెలంగాణలో పెట్టని కోటగా ఎదిగిన భారత రాష్ట్ర సమితిలో ఇప్పుడు ఉత్సాహం సన్నగిల్లిందా? తెలంగాణ సాధనే సంకల్పంగా పోరాటం చేసి భారత రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన గులాబీ పార్టీ నేడు నైరాశ్యంలో కూరుకుపోయిందా? జనమే బలంగా ఎదిగిన పార్టీని నిస్పృహ ఆవహించిందా? పొలికేకలు, సింహగర్జనలతో జనాల్ని ఉర్రూతలూగించిన ఉద్యమ పార్టీ నిరుత్సాహ అగాథంలోకి జారిపోయిందా?... ఇవీ సగటు బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న ప్ర‌శ్న‌లు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందరంగా బహిరంగ సభ లేదా ప్లీన‌రీని నిర్వహించే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీ. ఈ విష‌యంలో మీన‌మేషాలు లెక్కిస్తుండ‌డంపై పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.

ఎంత దద్దమ్మ ప్రభుత్వమైనా పాత ప్రాజెక్టులను కొనసాగించాలి కదా. రెండేళ్లయినా పాలమూరు ప్రాజెక్టులో తట్టెడు మట్టయినా తీయలేదు.ఎంతసేపూ భూములు అమ్ముకుందామనే యావలోనే ఉంటే ఎలా? రాష్ట్రానికి వచ్చే నీళ్లను కాపాడలేని ఇదేమి దద్దమ్మ ప్రభుత్వం? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజల మధ్య ఎండగడతాం. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో గ్రామగ్రామాన ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం.భారీ బహిరంగ సభలు నిర్వహిస్తాం. సభలకు నేనూ వస్తా. ఈ ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చాం. ఇకపై మౌనంగా ఉండేది లేదు. పాలమూరుపై కేంద్రాన్ని ఎండగడతాం. పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నోరు మూసుకొని ఉంటే మేమైనా పూనుకోవాలి కదా. అందుకే నేనే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నా. ఇవాళి వరకు ఒక కథ. రేపటి నుంచి మరో కథ. తెలంగాణ కోసం ఎందాకైనా పోరాడతాం.

2025 డిసెంబ‌ర్ 21న కేసీఆర్

బహిరంగ సభలకు ట్రేడ్ మార్క్

ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ (నాడు టీఆర్ఎస్) సభలంటే జనంలో చెప్పలేనంత క్రేజ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కేసీఆర్ ప్రసంగాల కోసం జనం ఎంత దూరం నుంచైనా సరే వచ్చేవారు. ఆ సభలన్నీ కార్యకర్తల్లో ఓ కొత్త ఉత్సాహాన్ని నింపేవి. ప్రజా సమస్యలపై పోరాటానికి ఓ దిశ దశ చూపించేవి. 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని జలదృశ్యంలో జరిగిన ఆవిర్భావ సభ నుంచి ఆ తర్వాత జరిగిన సింహగర్జనలు, జైత్రయాత్రలు, పొలికేకలు, తెలంగాణ గర్జనలు వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి.

జనమే బలం

బీఆర్ ఎస్ పార్టీకి జనమే బలం. జనం ఆకాంక్షల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అది. అందుకే ఉద్యమ కాలం నుంచి ప్రతిరోజూ జనంతో మమేకమై ఉన్న కార్యక్రమాల ద్వారా తారస్థాయికి ఎదిగింది. పల్లెబాట, రైల్ రోకో, సడక్ బంద్, వంటావార్పు, చలో ఢిల్లీ వంటి పోరాట పంథాలో ఎక్కువగా జనమే పాలుపంచుకున్నారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాటాలు చేయాల్సిన అవసరం లేకుండా పోయినందున ప్రతి ఏటా పార్టీ ప్లీనరీ లేదా సభలకు పరిమితమైంది. 2025లో రజతోత్సవం సందర్భంగా వరంగల్ లోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించి.. తాము జనంతోనే ఉన్నామని బీఆర్ ఎస్ చాటి చెప్పింది. ఆ తర్వాత ఏడాది గడిచి మరొక ఆవిర్భావ దినోత్సవం సమీపిస్తున్నా... అగ్రశ్రేణి నాయకత్వం ఇంకా ఈ విషయంలో ఇంకా మౌనంగానే ఉన్నది. గురువారం నాడు జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ ఎస్ లో చేరిక సందర్భంగా.. ప్లీనరీ లేదా సభ కు సంబంధించి ఏదో ఒక ప్రకటన వస్తుందని ఎదురు చూసిన శ్రేణులకు నిరాశే ఎదురైంది.

సారూ.. ఇంకెప్పుడొస్తారు

పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాట పంథా ఎలా ఉన్నా ప్రజా క్షేత్రంలో..పోరాట యోధుడు కేసీఆర్ కనిపించని లోటు స్పష్టంగా కనబడుతున్నది. దిగువ స్థాయి పార్టీ కార్యకర్తలపై ఇది ప్రభావం చూపుతున్నది. 2024 ఫిబ్రవరి 13న నల్లగొండలో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ రైతుల కోసం తాను కొట్లాడుతానని అన్నారు. మళ్లీ చలో నల్గొండతోనే ఆపమని రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎక్కడికక్కడ నిలదీస్తామని స్పష్టం చేశారు.ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్షం బాధ్యత తమకు ఇచ్చారన్న కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకపోతే తానే అక్కడ కుర్చీ వేసుకొని మరమ్మతులు చేయిస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇది గడిచి రెండేండ్లు గడిచినా గులాబీ దళపతి ప్రజా క్షేత్రంలోకి రాలేదు. గత ఏడాది డిసెంబరు 21న తెలంగాణ భవన్ లో కేసీఆర్ మాట్లాడుతూ.. కృష్ణా జలాల విషయంలో మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టేలా పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో గ్రామా గ్రామాన ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పారు. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. కళ్లముందే ఇంత మోసం జరుగుతూ ఉంటే .. కేసీఆర్ మౌనంగా ఉంటారా? అందుకే నేనే స్వయంగా రంగంలోకి దిగుతున్నాని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆ దిశగా ఎటువంటి కార్యాచరణకు పార్టీ పూనుకోలేదు. దీంతో ....తమ బాస్ ఇంకెప్పుడు రంగంలోకి దిగుతారా అంటూ గులాబీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement