త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

National Honour (Amendment) Bill | వందేమాత‌రం బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మ‌ద్ద‌తు

National Honour (Amendment) Bill | రాజ్య‌స‌భ‌లో కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన వందేమాత‌రం బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని బీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ లీడ‌ర్ వద్దిరాజు ర‌విచంద్ర స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Jul 29, 2026, 5.51 pm IST

National Honour (Amendment) Bill | వందేమాత‌రం బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మ‌ద్ద‌తు
Advertisement

National Honour (Amendment) Bill | త్రినేత్ర‌.న్యూస్ : రాజ్య‌స‌భ‌లో కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన వందేమాత‌రం బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని బీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ లీడ‌ర్ వద్దిరాజు ర‌విచంద్ర స్ప‌ష్టం చేశారు. ఈ బిల్లుపై రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు.

1971లో ఈ చట్టాన్ని పార్లమెంట్ తీసుకొచ్చినప్పుడు లక్ష్యం ఒక్కటేనని, జాతీయ జెండా, జాతీయ గీతం, రాజ్యాంగం వంటి జాతీయ చిహ్నాలను ఉద్దేశపూర్వకంగా అవమానించే వారిని అడ్డుకోవడమన్నారు. అప్పట్లో సమాచార వ్యవస్థలు పరిమితంగా ఉండేవని, ఒక సంఘటన జరిగినా అది కొద్దిమందికే తెలిసేదన్నారు. కానీ, 1971నాటి మన దేశానికి, ఇప్పటి 2026 భారత దేశానికి చాలా తేడా ఉందని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. ఈ రోజు సోషల్ మీడియా, కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ టెక్నాలజీ, ప్రపంచవ్యాప్తంగా క్షణాల్లో సమాచారాన్ని చేరవేసే వ్యవస్థలు ఉన్నాయని, ఒక వ్యక్తి చేసిన అవమానకరమైన చర్య కొన్ని నిమిషాల్లోనే కోట్లాది మందికి చేరుతుందని.. ముఖ్యంగా యువతపై దాని ప్రభావం పడుతుందని, అంతర్జాతీయంగా కూడా భారతదేశ ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు.

అందుకే కాలానికి అనుగుణంగా చట్టాలు కూడా మారాలని, ఈ సవరణ భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేయడానికి కాదని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు. జాతీయ చిహ్నాలను గౌరవించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదని, అది ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఎంపీ రవిచంద్ర వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు మారవచ్చు, విధానాలు మారవచ్చు,రాజకీయ పార్టీలు మారవచ్చు, కానీ దేశం మాత్రం శాశ్వతం అని ఎంపీ రవిచంద్ర వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా, పదేపదే జాతీయ గౌరవాన్ని అవమానించే వారిపై మాత్రం చట్టం చాలా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట పడుతుందని ఎంపీ రవిచంద్ర చెప్పారు.

స్వాతంత్రోద్యమంలో, దేశ నిర్మాణంలో, వ్యవసాయంలో, పరిశ్రమల్లో, విద్యలో, రక్షణ రంగంలో వెనుకబడిన తరగతుల (బీసీల) పాత్ర ఎంతో గొప్పదని ఆయన చెప్పారు. దేశ జనాభాలో బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారని, కేంద్రంలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), మైనారిటీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, అవి ఉండడం కూడా అవసరమే అన్నారు. అయితే, జనాభాలో అత్యధికులుగా బీసీలకు మాత్రం ఇప్పటికీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం విచారకరమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా బీసీ వర్గానికి చెందిన వారే అని, వారి బలమైన ఆకాంక్షలను గుర్తించి, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిందిగా ఈ గౌరవ సభ ద్వారా తమ పార్టీ బీఆర్ఎస్ పక్షాన వినమ్రంగా కోరుతునన్నారు. అది సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతం చేసే చారిత్రాత్మక నిర్ణయం అవుతుందని ఎంపీ రవిచంద్ర చెప్పారు. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, "జాతీయ గౌరవానికి అవమానం నిరోధక (సవరణ) బిల్లు, 2026"కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని ఎంపీ వద్దిరాజు చెప్పారు.

Advertisement
Advertisement