త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Vivek | ప‌రిశ్ర‌మ‌ల్లో భ‌ద్ర‌తే తొలి ప్రాధాన్యం..

Minister Vivek | రాష్ట్రంలోని పరిశ్రమల్లో అత్యున్నత భద్రతా ప్రమాణాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. పరిశ్రమల్లో ప్రమాదాలు పూర్తిగా నివారించాలంటే ప్రభుత్వం, యాజమాన్యాలు, కార్మికులు సమన్వయంతో పనిచేసి బలమైన సేఫ్టీ కల్చర్‌ను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.

S

Telangana | Published On Jul 29, 2026, 3.07 pm IST

Minister Vivek | ప‌రిశ్ర‌మ‌ల్లో భ‌ద్ర‌తే తొలి ప్రాధాన్యం..
Advertisement

సేఫ్టీ సంస్కృతిని పెంపొందించాలి
కంబస్టిబుల్ డస్ట్ ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు
పరిశ్రమల్లో ప్రమాదాల నివారణపై ప్రభుత్వం సీరియస్
రిస్కీ ఆపరేషన్లలో కాంట్రాక్ట్ కార్మికులతో పనులు చేయించొద్దు
నేష‌న‌ల్ వ‌ర్క్ షాప్‌లో మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి

Minister Vivek | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని పరిశ్రమల్లో అత్యున్నత భద్రతా ప్రమాణాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. పరిశ్రమల్లో ప్రమాదాలు పూర్తిగా నివారించాలంటే ప్రభుత్వం, యాజమాన్యాలు, కార్మికులు సమన్వయంతో పనిచేసి బలమైన సేఫ్టీ కల్చర్‌ను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.

లక్డీకాపూల్‌లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI)లో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల "ప్రాసెస్ సేఫ్టీ ఆఫ్ కంబస్టిబుల్ డస్ట్స్" వర్క్‌షాప్‌కు మంత్రి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సందర్భంగా కంబస్టిబుల్ డస్ట్‌పై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు.

మంత్రి వివేక్ మాట్లాడుతూ.. కంబస్టిబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీలు వంటి కారణాలతో దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు ఇప్పటికే సమగ్ర భద్రతా నిబంధనలు ఉన్నప్పటికీ వాటి అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పరిశ్రమలకు ప్రభుత్వం మరింత స్వేచ్ఛ కల్పించిందని, అయితే ఆ స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా పెరిగిందని చెప్పారు. ప్రభుత్వం జోక్యం లేకుండానే పరిశ్రమలు స్వయంగా అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటించే సంస్కృతిని అలవరచుకోవాలని సూచించారు.

సిగాచి ఘటన ప్రతి పరిశ్రమకు హెచ్చరికగా నిలవాలి అని మంత్రి అన్నారు. తగిన భద్రతా చర్యల కోసం రూ.15 నుంచి రూ.20 లక్షలు ఖర్చు చేయకపోవడం వల్ల చివరకు అమూల్యమైన ప్రాణనష్టం సంభవించిందని, సంస్థకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. చిన్న మొత్తాన్ని ఆదా చేయాలనే ఆలోచన చివరకు భారీ మూల్యం చెల్లించే పరిస్థితిని తీసుకొస్తుందని హెచ్చరించారు.

ప్రతి కంపెనీ బోర్డు సమావేశంలో పారిశ్రామిక భద్రతపై ప్రత్యేక సమీక్ష తప్పనిసరిగా నిర్వహించాలని మంత్రి సూచించారు. ఫ్యాక్టరీ ఆక్యుపైయర్, బోర్డు సభ్యులు భద్రతా ప్రమాణాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని, ఇందుకోసం అయ్యే వ్యయాన్ని ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూడాలని అన్నారు.

పరిశ్రమల్లో భద్రత పెరిగితే కార్మికుల్లో విశ్వాసం పెరిగి ఉత్పాదకత కూడా గణనీయంగా మెరుగవుతుందని మంత్రి పేర్కొన్నారు. కార్మికులకు తరచూ సేఫ్టీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, కొత్త సాంకేతికతలు, ఉత్తమ పద్ధతులను పరిశ్రమల్లో అమలు చేయాలని సూచించారు. ఈ తరహా వర్క్‌షాప్‌లు ప్రభుత్వం, పరిశ్రమలు పరస్పరం నేర్చుకునేందుకు ఉపయోగపడతాయని చెప్పారు.

ప్రమాదకర విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులను నియమించొద్దని మంత్రి స్పష్టమైన సూచనలు చేశారు. సిగాచి ఘటనలో ప్రమాదకర విభాగాల్లో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులకు తగిన అనుభవం, శిక్షణ లేకపోవడం కూడా ఒక కారణమని పేర్కొన్నారు. ప్రమాదకర కార్యకలాపాలు జరిగే ప్రాంతాల్లో కంపెనీ శాశ్వత ఉద్యోగులే విధులు నిర్వహించేలా వచ్చే ఆరు నెలల్లో తగిన నిబంధనలు రూపొందించాలని ఫ్యాక్టరీల శాఖ అధికారులను ఆదేశించారు.

కంబస్టిబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీలు వంటి ప్రమాదకర అంశాలపై ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలు రూపొందించి పరిశ్రమల్లో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఫ్యాక్టరీస్ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా ఉందని, కార్మికుల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీఎస్ఆర్ శాస్త్రవేత్త డా. సూర్యనారాయణ, ఫ్యాక్టరీల శాఖ డైరెక్టర్ మోహన్ బాబు, నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ ప్రతినిధులు, వివిధ పరిశ్రమలకు చెందిన సీనియర్ అధికారులు, నిపుణులు, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, కోల్, టెక్స్టైల్ తదితర రంగాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement