త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR vs Ministers | కేటీఆర్ వ‌ర్సెస్ మంత్రులు.. కేవ‌లం ల‌క్ష‌న్న‌ర కోట్ల దోపిడీకి వ్య‌తిరేకం..

KTR vs Ministers | మూసీ పున‌రుజ్జీవంపై మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క‌, శ్రీధ‌ర్‌బాబు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మ‌ధ్య తీవ్ర మాటల యుద్ధం కొన‌సాగింది. మూసీ ప్ర‌క్షాళ‌న చేయ‌కుండా బీఆర్ఎస్ అడ్డుప‌డుతుంద‌ని మంత్రులు పేర్కొన్నారు. దీంతో కేటీఆర్ స్పందిస్తూ.. మూసీ ప్ర‌క్షాళ‌న‌కు మేం వ్య‌తిరేకం కాదు.. ల‌క్ష‌న్న‌ర కోట్ల దోపిడీకి వ్య‌తిరేకం అని ఆయ‌న‌ స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Mar 18, 2026, 1.03 pm IST

KTR vs Ministers | కేటీఆర్ వ‌ర్సెస్ మంత్రులు.. కేవ‌లం ల‌క్ష‌న్న‌ర కోట్ల దోపిడీకి వ్య‌తిరేకం..
Advertisement

KTR vs Ministers | త్రినేత్ర‌.న్యూస్ : మూసీ పున‌రుజ్జీవంపై మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క‌, శ్రీధ‌ర్‌బాబు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మ‌ధ్య తీవ్ర మాటల యుద్ధం కొన‌సాగింది. మూసీ ప్ర‌క్షాళ‌న చేయ‌కుండా బీఆర్ఎస్ అడ్డుప‌డుతుంద‌ని మంత్రులు పేర్కొన్నారు. దీంతో కేటీఆర్ స్పందిస్తూ.. మూసీ ప్ర‌క్షాళ‌న‌కు మేం వ్య‌తిరేకం కాదు.. ల‌క్ష‌న్న‌ర కోట్ల దోపిడీకి వ్య‌తిరేకం అని ఆయ‌న‌ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా మూసీ పున‌రుజ్జీవంపై చ‌ర్చ నేప‌థ్యంలో ఈ వాగ్వాదం జ‌రిగింది.

సంతృప్తిక‌రంగా స‌మాధానం చెప్ప‌లేదు..

కేటీఆర్ మాట్లాడుతూ.. నేను అడిగిన ఏ ప్ర‌శ్న‌కు కూడా మంత్రి శ్రీధ‌ర్ బాబు సంతృప్తిక‌రంగా స‌మాధానం చెప్ప‌లేదు. ఎన్ని ద‌శ‌ల్లో మూసీ ప్ర‌క్షాళ‌న‌ జ‌రుగుతంది అంటే స‌మాధానం లేదు. డీపీఆర్‌లు ఎన్నంటే స‌మాధానం లేదు. డీపీఆర్ ఫేజ్ 1కు వ‌చ్చింద‌న్నారు. నిన్న‌కాక మొన్న ఈ ప్రాజెక్టు ఎండీ న‌ర్సింహారెడ్డి తాజ్‌కృష్ణ‌లో ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. మంత్రి శ్రీధ‌ర్ బాబు బ‌హుషా లేర‌నుకుంటా అక్క‌డ‌. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వం త‌ప్పుదోవ ప‌ట్టిస్తుంది. ఎండీ డీపీఆర్ లేదంటారు. మంత్రి డీపీఆర్ వ‌చ్చిందంటారు. ఎవ‌ర్నీ నమ్మాలి అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

ఈ క్ర‌మంలో స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ క‌ల‌గజేసుకుని.. తాజ్ కృష్ణ‌లో మూసీపై ప్ర‌జెంటేష‌న్‌కు మిమ్మ‌ల్ని కూడా ఆహ్వానించాం. కానీ మీరు రాలేదు అని స్పీక‌ర్ చెప్ప‌గా వెంట‌నే కేటీఆర్ ఇలా స్పందించారు. ఫైవ్ స్టార్ హోట‌ళ‌ల్లో ప్ర‌జెంటేష‌న్లు వ‌ద్దు మూసీ తీరాన పెడుతార‌ని అనుకున్నాం. ప్ర‌జ‌ల‌తో, బాధితుల‌తో పెట్టాలి. ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో ఏంది అని అనుకున్నాం. మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్ అని కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు.

మూసీ ప్ర‌క్షాళ‌న వ్య‌తిరేకిస్తున్నారా..?

దీంతో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క క‌ల‌గ‌జేసుకుని.. మూసీ ప్ర‌క్షాళ‌నపై ద‌శాబ్ద కాలానికి పైగా చ‌ర్చ జ‌రుగుతుంది. మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు, ప‌ట్టాదారులు కానీ వారు, భూమి కొనుక్కోలేక గుడిసెలు వేసుకుని ఉంటున్న వారు, మూసీలో వ‌స్తున్న మురుగు త‌ట్టుకోలేక అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో బ‌తుకుతున్న వారి జీవ‌న స్థితిగ‌తుల‌ను మార్చాల‌ని ప్ర‌భుత్వం భావిస్తుంది. మూసీ ప్ర‌క్షాళ‌న వ్య‌తిరేకిస్తున్నారా..? మూసీ ప్ర‌క్షాళ‌న చేయొద్ద‌ని అనుకుంటున్నారా..? పేద‌లు అత్యంత ద‌య‌నీయ ప‌రిస్థితుల్లో ఉన్నారు. ఉండ‌డానికి స‌రైన ప‌రిస్థితుల్లేవు. ఈగ‌లు దోమ‌లతో జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. వారి స్థితిగ‌తులు మార్చాల‌ని సామాజిక బాధ్య‌త‌తో ముందుకు పోతున్నాం. పేద‌ల గుడిసెలు పోతే అంత మందికి లెక్క‌ట్టి ప‌ట్టా ఉన్నా లేకున్నా.. అపార్ట్‌మెంట్లు క‌ట్టించి అభివృద్ధిలో భాగ‌స్వామ్యం చేస్తామ‌ని ప్ర‌భుత్వం ఘంటాప‌థంగా చెబుతుంటే.. బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. న‌గ‌రానికి మ‌ణిహారంగా మూసీని తీర్చిదిద్దాల‌ని ప్ర‌భుత్వం అనుకుంటే ప్ర‌తిదానికి అడ్డుప‌డుతున్నారని భ‌ట్టి విక్ర‌మార్క మండిప‌డ్డారు.

ఇక మూసీ ప్ర‌క్షాళ‌న‌లో ఇండ్లు కోల్పోయే కుటుంబాల్లోని మ‌హిళ‌ల‌కు వ‌డ్డీ లేని రుణాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తాం. ఇవేం వ‌ద్దు. వారు అదే మురికి కూపంలో ఉండాలి.. మూసీకి మంచి నీళ్లు రావొద్దు అనేది బీఆర్ఎస్ నేత‌ల కోరిక‌. ఇవి కోరుకునే వారు క‌రెక్ట్ కాదు. ఇదొక మ‌హాయ‌జ్ఞం. మూసీలోకి వ‌చ్చే ప్ర‌తి నాలాకు ఎస్టీపీలు పెట్టి వ‌దులుతాం. ప్ర‌చార ఆర్భాటం కోసం మొద‌లుపెట్టి.. తూతూ మంత్రంగా చేసి వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేదు అని భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు.

కేవ‌లం ల‌క్ష‌న్న‌ర కోట్ల దోపిడీకి వ్య‌తిరేకం..

భ‌ట్టి విక్ర‌మార్క కామెంట్స్‌పై కేటీఆర్ స్పందిస్తూ.. డీపీఆర్ లేద‌ని ఎండీ చెబ‌తున్నారు.. మంత్రి ఉంద‌ని చెబుతున్నారు. ఉంటే టేబుల్ చేయండి. 50 మీట‌ర్ల బ‌ఫ‌ర్ జోన్ మీరే ఇచ్చార‌ని చెబుతున్నారు. కానీ 5 కిలోమీట‌ర్ల అవ‌త‌ల ఉండే హ‌నుమాన్ న‌గ‌ర్‌కు మొన్న నోటీసులు ఇచ్చారు. మ‌రి ఏ ఆలోచ‌న చేస్తున్నారో మాకు తెల్వదు. మంత్రి 1450 నిర్మాణాలు అంటారు. గెజిట్‌లో 10 వేల నిర్మాణాలు అని పేర్కొన్నారు. కుడి చేయి ఏం చేస్తుందో ఎడ‌మ చేయికి తెల్వ‌దు. డిప్యూటీ సీఎం పేద‌ల మీద ప్రేమ ఒల‌క‌బోశారు.. వెలుగుమ‌ట్ల‌లో నిర్దాక్షిణ్యంగా ఇండ్ల‌ను కూల‌గొట్టారు. మూడు రోజుల వ‌ర‌కు ప‌త్తా లేరు. మాకు అర్థమైంది ఏందంటే.. ప్ర‌భుత్వం వ‌ద్ద పైస‌ల్లేవు.. ప్ర‌ణాళిక‌ల్లేవు. ఏడీబీ లోన్ ఇవ్వ‌లేదు. కేవ‌లం ల‌క్ష‌న్న‌ర కోట్ల దోపిడీకి వ్య‌తిరేకం.. మూసీ ప్రక్షాళ‌న‌కు వ్య‌తిరేకం కాదు. ప్ర‌భుత్వ స‌రైన స‌మాధానం చెప్ప‌నందుకు మేం నిర‌స‌న‌గా వాక్ ఔట్ చేస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement