త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gattu Ramachander Rao | అబద్ధాలు + బూతులు = కాంగ్రెస్ పార్టీ

రాష్ట్రంలో క్రైం రేట్, శాంతిభద్రతలపై సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బీఆర్ఎస్ నేత గట్టు రామచందర్ రావు సంచలన ఆరోపణలు చేశారు.

J

Telangana | Published On Jul 22, 2026, 3.55 pm IST

Gattu Ramachander Rao | అబద్ధాలు + బూతులు = కాంగ్రెస్ పార్టీ
Advertisement
  • సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో 14 శాతం పెరిగిన క్రైం రేటు
  • గడిచిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో వెయ్యికి పైగా హత్యలు
  • రాహుల్ గాంధీకి ఢిల్లీలో ఒక విధానం, హైదరాబాద్‌లో మరో విధానం
  • త్వరలోనే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి బీజేపీకి తాకట్టు పెట్టడం ఖాయం
  • గట్టు రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు

Gattu Ramachander Rao | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ భవన్ (Telangana Bhavan) వేదికగా బీఆర్ఎస్ నేత గట్టు రామచందర్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రం ఒక ఆర్థిక అరాచకవాది చేతిలో ఆగమైపోతోందని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన మండిపడ్డారు. సీఎం వ్యవహారశైలి, పోలీసుల పనితీరు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

హత్యలు, సైబర్ క్రైమ్‌లకు కేరాఫ్ అడ్రస్

రాష్ట్ర హోం శాఖ ఒక క్రిమినల్ చేతిలో ఉందంటూ గట్టు రామచందర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఏడాదిలో క్రైం రేట్ (Crime Rate) ఏకంగా 14 శాతం పెరిగిందన్నారు. గడిచిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో దాదాపు వెయ్యి హత్యలు జరిగాయని, హంతకులు సెల్ఫీలు (Selfies) తీసుకుని మరీ దారుణాలకు ఒడిగడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్‌లలో (Cyber crimes) తెలంగాణ అన్ని రికార్డులను బ్రేక్ చేస్తోందని, సీఎం అనుచరుల సేవకే పోలీసులు పరిమితం అయ్యారని విమర్శించారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు జుట్టు పట్టుకుని లాక్కెళ్లడం సర్వసాధారణంగా మారిపోయిందని ధ్వజమెత్తారు.

బూతులకు అడ్డాగా గాంధీ భవన్

గాంధీ భవన్ బూతులకు అడ్డాగా మారిపోయిందని గట్టు విమర్శించారు. కేవలం బీఆర్ఎస్ నేతలను తిట్టడానికే కొందరికి కేబినెట్ హోదా ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు అనుచిత వాగ్దానాలు చేసి ప్రజలను కాంగ్రెస్ 'బకరా'లను చేసిందని మండిపడ్డారు. "ఎకరాలు చేసి బకరాలకు అమ్ముకుంటున్నారు" అని విమర్శించే సీఎం.. ఇప్పుడు వేల ఎకరాలు కొల్లగొట్టి అక్రమంగా డబ్బులు వెనకేసుకుంటున్నారని.. త్వరలోనే ఆయన బండారం బయటపడుతుందని హెచ్చరించారు.

ఢిల్లీలో ఫైట్.. గల్లీలో సైలెంట్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరును సైతం ఆయన తప్పుబట్టారు. రాహుల్ గాంధీకి ఢిల్లీలో ఒక విధానం, హైదరాబాద్‌లో మరో విధానం ఉందన్నారు. ఢిల్లీలో మోదీపై పోరాడే రాహుల్.. హైదరాబాద్‌లో మాత్రం మోదీకి జోడీ అయిన రేవంత్‌కు వంత పాడుతున్నారని విమర్శించారు. నిన్న రాహుల్ గాంధీ ఢిల్లీలో చేసిన ధర్నాలో ఇద్దరు కాంగ్రెస్ సీఎంలు పాల్గొంటే.. రేవంత్ రెడ్డి మాత్రం ఎందుకు డుమ్మా కొట్టారని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ను బీజేపీకి తాకట్టు పెట్టడం ఖాయం

సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీని బీజేపీకి (BJP) తాకట్టు పెట్టడం పక్కా అని గట్టు రామచందర్ రావు జోస్యం చెప్పారు. పాత కాంగ్రెస్ నాయకులు ఎవరూ రేవంత్‌ను పట్టించుకోవడం లేదని.. సరైన సమయం కోసం వాళ్ళు ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. కొడంగల్‌లో చిన్న ఉద్యోగులైన బీఎల్‌వోల (BLOs) మీద సీఎం చిందులు వేయడం ఆయన ఫ్యూడల్ మైండ్ సెట్‌కు (Feudal mindset) అద్దం పడుతోందన్నారు. బాడీ షేమింగ్ (Body shaming) చేయడం, జాతుల గురించి మాట్లాడటం రేవంత్‌కు అలవాటుగా మారిందని.. ఆయనది ఏ జాతి? క్రిమినల్ జాతా? లేక ఓటుకు నోటు జాతా? అని గట్టు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రం ఈ క్రైం నుంచి బయటపడాలంటే రేవంత్ తన పదవి నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement