త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన ‘జెన్-జీ’ యువత

నీట్ వివాదంలో కేంద్ర మంత్రి రాజీనామా చేయడం యువత విజయమని సీఎం రేవంత్ అన్నారు. చట్టసభల్లో పోటీ వయసు 21 ఏళ్లకు తగ్గించేలా అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు.

J

Telangana | Published On Jul 25, 2026, 9.18 pm IST

Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన ‘జెన్-జీ’ యువత
Advertisement
  • నీట్ వివాదంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జెన్-జీ (Gen Z) యువత సాధించిన విజయమన్న సీఎం రేవంత్ రెడ్డి
  • విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి, చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్
  • ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని ప్రతిపాదన
  • ఆగస్టులో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని వెల్లడి

Revanth Reddy Speech | త్రినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్షల నిర్వహణ వైఫల్యం, తదనంతర పరిణామాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జెన్-జీ (Gen Z) యువత చేసిన వీరోచిత పోరాటం వల్లే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన కొనియాడారు. హైదరాబాద్ వేదికగా వేలాది మంది యువతను ఉద్దేశించి ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.

కాంగ్రెస్ ఖాతాలో వేసుకోం.. ఇది మీ విజయం

యువత పట్టుదల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెడలు వంచక తప్పలేదని రేవంత్ అన్నారు. "58 ఇంచుల ఛాతీని ఓడించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేలా జెన్-జీ యువత విజయం సాధించింది" అని ఆయన ప్రశంసించారు. అంబేద్కర్, ఇందిరమ్మ విగ్రహాల సాక్షిగా తరలివచ్చిన ఈ యువత కాంగ్రెస్ నాయకులు లేదా కార్యకర్తలు కారని, ఈ చారిత్రక విజయాన్ని కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోబోదని ఆయన స్పష్టం చేశారు.

కేసులు ఎత్తివేయాలి.. పరిహారం చెల్లించాలి

కేవలం కేంద్ర మంత్రి రాజీనామాతో సరిపెట్టుకోకూడదని, సమస్య మూలాల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీ కారణంగా తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే ఆర్థిక పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, తమ హక్కుల కోసం పోరాటం చేసిన విద్యార్థులపై కేంద్రం మోపిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని పట్టుబట్టారు. ఈ సమస్యలపై రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో మరింత గట్టిగా గళమెత్తుతారని హామీ ఇచ్చారు. ఈడీ, సీబీఐ (ED, CBI) లాంటి సంస్థలతో అక్రమ కేసులు పెట్టి లొంగదీసుకునే ప్రయత్నాలను ఎదురొడ్డి యువత నిలబడిందన్నారు.

చట్టసభల్లో పోటీ వయసు 21 ఏళ్లకు తగ్గింపు?

రాజకీయాల్లో యువత ప్రాతినిధ్యం పెరగాల్సిన ఆవశ్యకతను సీఎం రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. రాజీవ్ గాంధీ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గిస్తే, పీవీ నరసింహారావు 73, 74 సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించారని గుర్తుచేశారు. సివిల్ సర్వీసెస్ (Civil Services) కు 21 ఏళ్లు అర్హత ఉన్నప్పుడు, చట్టసభలకు ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు. 21 ఏళ్లకే త్రివేండ్రంలో ఒక యువతి మేయర్ అయ్యారని, 21-22 ఏళ్ల వయసులోనే తెలుగమ్మాయిలు ఐఏఎస్ (IAS) సాధిస్తున్నారని ఉదాహరణలు ఇచ్చారు. బ్రిటన్, జర్మనీ, సింగపూర్ తరహాలో మన దేశంలో కూడా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించాలన్నారు.

ఆగస్టులో అసెంబ్లీ తీర్మానం

దీనిపై కార్యాచరణను కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసే వయసును 21 ఏళ్లుగా మారుస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. దేశ జనాభాలో 30 శాతం ఉన్న జెన్-జీ యువతకు పార్లమెంటులో కనీసం ఒక్క శాతం కూడా ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయమన్నారు. కేంద్రంలో కూడా విద్యాశాఖ, ఐటీ శాఖలను యువతకు అప్పగిస్తేనే దేశం వేగంగా ముందుకు వెళ్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఆకాంక్షించారు.

Advertisement
Advertisement