త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJYM | ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు విడుద‌ల చేయాలి.. లేదంటే ఉద్య‌మం మ‌రింత ఉధృతం చేస్తాం

BJYM | : తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి మల్క ఆందోళన వ్యక్తం చేశారు.

S

Telangana | Published On Aug 25, 2026, 7.13 pm IST

BJYM | ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు విడుద‌ల చేయాలి.. లేదంటే ఉద్య‌మం మ‌రింత ఉధృతం చేస్తాం
Advertisement

BJYM | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యా సంవత్సరాలు పూర్తయినప్పటికీ సర్టిఫికెట్లు అందక ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి మల్క ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు నాయకత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది మద్దతు సేకరించడమే లక్ష్యంగా ఉద్యమాన్ని చేపట్టామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో బీజేవైఎం కార్యకర్తల ఆధ్వర్యంలో సుమారు 3.5 లక్షల సంతకాలను సేకరించామని, ఈ వారాంతానికి ఆ సంఖ్యను 5 లక్షలకు పెంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు.

బంగారం తాకట్టు పెట్టడం, అప్పులు చేయడం

నాలుగేళ్ల క్రితం విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు సైతం కొన్ని కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని యశస్వి మల్క పేర్కొన్నారు. చేతిలో ఉద్యోగ నియామక పత్రాలు ఉన్నప్పటికీ, అవసరమైన విద్యా సర్టిఫికెట్లు సమర్పించలేక యువత తమ ప్రతిభతో సాధించిన ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు బంగారం తాకట్టు పెట్టడం, అప్పులు చేయడం ద్వారా కళాశాల ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య రాష్ట్రంలోని ఇంజనీరింగ్, డిగ్రీ సహా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కుటుంబాలకు తీవ్రమైన సమస్యగా మారిందని పేర్కొన్నారు.

హామీలు నెర‌వేర్చ‌డంలో విఫ‌లం

గత కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో అనేక కళాశాలలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, అధ్యాపకులు, సిబ్బందికి జీతాలు చెల్లించడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని యశస్వి మల్క తెలిపారు. ఈ పరిస్థితికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ బాధ్యత వహించాలని ఆయన విమర్శించారు. గతంలో కేటీఆర్, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాలు, 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి హామీలను అమలు చేయకుండా విద్యార్థులను, యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు చేపడుతున్న రెండు రోజుల నిరాహార దీక్షకు విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని యశస్వి మల్క పిలుపునిచ్చారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులతో ఢిల్లీకి వెళ్లి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసం ఎదుట బీజేవైఎం, బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. విద్యార్థుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు జమ అయ్యే వరకు, బకాయిలు పూర్తిగా విడుదలయ్యే వరకు ఈ పోరాటం ఆగదని యశస్వి మల్క స్పష్టం చేశారు.

Advertisement
Advertisement