త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minors Arrest | గేమింగ్ కోసం డబ్బుల్లేవు.. అప్పుడే ఓ తాళం కనబడింది

Minors Arrest | వారిద్దరూ మైన‌ర్లు. చ‌క్కగా చ‌దువుకోవాల్సిన వ‌య‌సులో ఆన్‌లైన్ గేమింగ్‌ల‌కు అల‌వాటు ప‌డ్డారు. డ‌బ్బులు చాల‌కపోవ‌డంతో చోరీలు చేయాల‌నుకున్నారు.

S

Hyderabad | Published On Aug 25, 2026, 6.51 pm IST

Minors Arrest | గేమింగ్ కోసం డబ్బుల్లేవు.. అప్పుడే ఓ తాళం కనబడింది
Advertisement
  • రైన్ బజార్‌లో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
  • ఇద్దరు మైనర్ల అరెస్ట్.. రూ.18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం

Minors Arrest | త్రినేత్ర‌.న్యూస్‌: వారిద్దరూ మైన‌ర్లు. చ‌క్కగా చ‌దువుకోవాల్సిన వ‌య‌సులో ఆన్‌లైన్ గేమింగ్‌ల‌కు అల‌వాటు ప‌డ్డారు. డ‌బ్బులు చాల‌కపోవ‌డంతో చోరీలు చేయాల‌నుకున్నారు. ఈ ఆలోచ‌న మెదిలిందే త‌డువు అప్పుడే వారికి ఓ తాళం క‌న‌బ‌డింది. వెంట‌నే వార‌నుకున్న ప్లాన్‌ను ప‌క్కాగా అమ‌లు చేశారు. ఇక ఏంచ‌క్కా జ‌ల్సాలు చేయాల‌నుకొని భావించ‌గా పోలీసులు వ‌ల ప‌న్ని ప‌ట్టుకోవ‌డంతో ఖంగుతిన‌డం వాళ్ల వంతైంది. ఇంత‌కీ ఈ చోరీ ఘ‌ట‌న ఎక్క‌డ? ఎలా జ‌రిగిందంటే..

హైదరాబాద్ సిటీ టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అండె శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. హైద‌రాబాద్‌ యాకుత్‌పురాకు చెందిన 16, 15 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలురు గేమింగ్ జోన్లలో డబ్బులు పెట్టి గేమ్‌లు ఆడటానికి అలవాటు పడ్డారు. వ్యక్తిగత ఖర్చులకు, గేమింగ్‌కు డబ్బులు చాలకపోవడంతో దొంగతనాలు చేయాలని పథకం పన్నారు. ఈ క్రమంలో ఈ నెల 21న‌ అర్ధరాత్రి స‌మ‌యంలో రైన్ బజార్ పరిధిలోని ఓ ఇంటి గేటుకు బయట తాళం వేసి ఉండటాన్ని గమనించారు. ఇదే త‌డువుగా వెంటనే భవనం పైకప్పుపైకి ఎక్కి, మెట్ల మార్గం నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. బంగారు ఆభరణాలు, భారత‌, విదేశీ క‌రెన్సీని ఎత్తుకెళ్లారు. నిందితులలో ఒకరి ఇంట్లో ఆభరణాలు దాచిపెట్టి, తర్వాత కలవాలని ప్లాన్ చేసుకున్నారు.

బాధితుడి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న రైన్ బ‌జార్ పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు. ప‌క్కా స‌మాచారంతో ఇద్ద‌రు బాలుర‌ను మంగ‌ళ‌వారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచార‌ణ‌లో చోరీ చేసిన‌ట్లు బాలురు ఒప్పుకోవ‌డంతో వారి వ‌ద్ద నుంచి 124.67 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.25,000 న‌గ‌దు, సుమారు రూ.12,000 విలువైన విదేశీ కరెన్సీ, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ. 18,00,000 ఉంటుంద‌ని పేర్కొన్నారు.

చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.సైదాబాబు, రైన్ బజార్ ఎస్‌హెచ్‌వో సి.నేతాజీ, డీఐ ఎండీ.నయీముద్దీన్‌ల‌ పర్యవేక్షణలో ఎస్సైలు ఎం.మహేష్, కె.రామారావు, ఎం.మధు, చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్, రైన్ బజార్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ఆప‌రేష‌న్ నిర్వ‌హించిన‌ట్లు అద‌న‌పు డీసీపీ అండె శ్రీ‌నివాస‌రావు తెలిపారు.

Advertisement
Advertisement