త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR vs Balmoori Venkat | కేటీఆర్ వన్నీ ‘మచ్చర్ పహిల్వాన్’ మాటలే.. అయ్య పేరుతో వచ్చిన నీకు సీఎంతో చర్చించే స్థాయి లేదు: బల్మూరి వెంకట్ ఫైర్

సీఎం రేవంత్ రెడ్డితో చర్చించే స్థాయి కేటీఆర్‌కు లేదని, దమ్ముంటే కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురావాలని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు.

J

Telangana | Published On Jul 1, 2026, 7.01 pm IST

KTR vs Balmoori Venkat | కేటీఆర్ వన్నీ ‘మచ్చర్ పహిల్వాన్’ మాటలే.. అయ్య పేరుతో వచ్చిన నీకు సీఎంతో చర్చించే స్థాయి లేదు: బల్మూరి వెంకట్ ఫైర్
Advertisement
  • సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి కేటీఆర్‌కు లేదని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ విమర్శ
  • ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే.. కేటీఆర్‌తో తాను ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ ఓపెన్ చాలెంజ్
  • కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న 'రైతు భరోసా', ప్రజాపాలనను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపాటు
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి వంద సార్లైనా ఢిల్లీకి వెళ్తారు, దాన్ని ప్రశ్నించే హక్కు కేటీఆర్‌కు లేదు

KTR vs Balmoori Venkat | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ మాట్లాడుతున్న మాటలన్నీ 'మచ్చర్ పహిల్వాన్' మాటల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్ష నేత కేసీఆర్, కేటీఆర్ తీరుపై విమర్శల వర్షం కురిపించారు. దమ్ముంటే కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురావాలని.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఫామ్ హౌస్‌కే పరిమితమైన కేసీఆర్

"ప్రజా సమస్యలపై చర్చ కోసం ప్రతిపక్ష నేత లేఖ రాస్తే.. అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం సీఎం సవాల్‌పై సైలెంట్‌గా ఫామ్ హౌస్‌లో పడుకున్నారు" అని బల్మూరి వెంకట్ విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చకు సిద్ధమైతే.. తాను కేటీఆర్‌తో ఎక్కడైనా చర్చించేందుకు రెడీ అంటూ ఓపెన్ చాలెంజ్ చేశారు. సభలో ఉండాల్సిన ప్రతిపక్ష నేత సైలెంట్ గా ఉంటే.. కేటీఆర్ మాత్రం బయట సవాళ్లు విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు వచ్చే స్థాయి కేటీఆర్‌కు లేదని ఆయన తేల్చి చెప్పారు.

జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎదిగిన నాయకుడు రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ రాజకీయ ప్రస్థానాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బల్మూరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. "ప్రజల మద్దతుతో ఒక ZPTC స్థాయి నుంచి కష్టపడి సీఎం స్థాయికి ఎదిగిన నాయకుడు రేవంత్ రెడ్డి. కానీ, కేటీఆర్ మాత్రం వాళ్ల అయ్య (కేసీఆర్) పేరుతో రాజకీయాల్లోకి వచ్చారు.. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత సీటు కోసం బావ బామ్మర్దులు (కేటీఆర్, హరీష్ రావు) పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.

అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలనను చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని విప్ వెంకట్ అన్నారు. మాట ఇచ్చిన ప్రకారం అన్నదాతల ఖాతాల్లో 'రైతు భరోసా' నిధులు జమ చేస్తుంటే జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అప్పులపైనా కేటీఆర్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని గత పదేళ్లలో దివాలా తీయించి, రోడ్డున పడేసింది ఎవరో తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు.

వంద సార్లైనా ఢిల్లీకి వెళ్తాం

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలపై కేటీఆర్ చేస్తున్న విమర్శలను బల్మూరి వెంకట్ తిప్పికొట్టారు. "రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ఎన్ని సార్లైనా ఢిల్లీ వెళ్తారు. అది అడగడానికి కేటీఆర్ ఎవరు? అవసరమైతే రాష్ట్ర నిధుల కోసం, ప్రాజెక్టుల కోసం 70 సార్లు కాదు.. 100 సార్లైనా ఢిల్లీకి వెళ్తారు" అని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement