త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD | శ్రీ‌వారి భక్తులకు అలర్ట్.. నో హారన్ జోన్‌గా తిరుమల

TTD | తిరుమల వెళ్లే భక్తులకు దేవ‌స్థానం బోర్డు కీల‌క సూచ‌న‌లు చేసింది. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మిక ప్రశాంతతను కాపాడేందుకు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. కొండపైకి వెళ్లే వాహనదారులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.

P

Devotional | Published On Jul 1, 2026, 7.48 pm IST

TTD | శ్రీ‌వారి భక్తులకు అలర్ట్.. నో హారన్ జోన్‌గా తిరుమల
Advertisement

TTD | తిరుమల వెళ్లే భక్తులకు దేవ‌స్థానం బోర్డు కీల‌క సూచ‌న‌లు చేసింది. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మిక ప్రశాంతతను కాపాడేందుకు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. కొండపైకి వెళ్లే వాహనదారులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. తిరుమలను ‘నో హారన్ జోన్’గా ప్రకటించిన టీటీడీ.. అవసరం లేకుండా వాహనాల హారన్లు మోగించవద్దని భక్తులు, వాహనదారులకు విజ్ఞప్తి చేసింది. ‘సైలెంట్ తిరుమల ఇనిషియేటివ్’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆలయ పరిసరాల్లో శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారి నామస్మరణలో ఉండేలా చర్యలు చేపట్టినట్లు టీటీడీ వెల్లడించింది.

తిరుమల ఘాట్ రోడ్లు, కొండపైకి వెళ్లే ప్రధాన మార్గాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో నో హారన్ నిబంధనలకు సంబంధించిన సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ట్యాక్సీలు, టీటీడీ వాహనాలు, పోలీసు వాహనాలు సహా అన్ని రకాల వాహనాలు ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సైరన్లు వినియోగించాలని, వీఐపీ వాహనాల రాకపోకల్లో కూడా అనవసరంగా హారన్లు ఉపయోగించకూడదని అధికారులు స్పష్టం చేశారు. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కొండపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్యతో పాటు వాహనాల రద్దీ కూడా భారీగా పెరిగింది. ప్రతిరోజూ వేల సంఖ్యలో వాహనాలు కొండపైకి చేరుకుంటుండటంతో శబ్ద కాలుష్యం పెరుగుతోందని అధికారులు గుర్తించారు.

తిరుమలలో పగటి సమయంలో 50 డెసిబల్స్, రాత్రి వేళల్లో 40 డెసిబల్స్‌కు మించి శబ్దం ఉండకూడదనే నిబంధనలు ఉన్నాయి. వీటిని అమలు చేయడం ద్వారా తిరుమలలో సహజమైన ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించడమే లక్ష్యంగా టీటీడీ ముందుకు వెళ్తోంది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునేలా ఈ చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలను ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలిపేందుకు భక్తులు కూడా సహకరించాలని కోరారు.

Advertisement
Advertisement