త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eatala Rajender | రేవంత్‌పై ఈటల రాజేందర్ ఫైర్: ఆ తుగ్లక్ పాలసీలు వద్దు.. దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్స్‌కి రా!

ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో రగడ ముదిరింది. రైతుల కష్టాలు చూసి చలించిన ఈటల రాజేందర్.. సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన చేస్తున్నారంటూ సంచలన సవాల్ విసిరారు.

J

Telangana | Published On May 28, 2026, 2.48 pm IST

Eatala Rajender | రేవంత్‌పై ఈటల రాజేందర్ ఫైర్: ఆ తుగ్లక్ పాలసీలు వద్దు.. దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్స్‌కి రా!
Advertisement

Eatala Rajender | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల ఇష్యూ పొలిటికల్ హీట్ పెంచుతోంది. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు బీజేపీ చేపట్టిన 'రైతు గోస - బీజేపీ భరోసా' యాత్రలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్.. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నిర్మల్ జిల్లా కడెం, ఖానాపూర్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును 'తుగ్లక్ పాలన'తో పోల్చారు. ఈ సందర్భంగా బీజేపీ నేతల వద్ద రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

కొనుగోలు కేంద్రాలా.. సెంట్రల్ జైళ్లా?

ఖానాపూర్, కడెం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులను చూసి బీజేపీ బృందం చలించిపోయింది. ఇరవై రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాలు 'సెంట్రల్ జైళ్ల'ను తలపిస్తున్నాయని, రాత్రింబవళ్లు ఇక్కడే మగ్గిపోతున్నామని వాపోయారు. లారీలకు, హమాలీలకు సొంత జేబుల్లోంచి అదనంగా డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తోందని, తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. సీఎం, మంత్రులకు ఉన్న ఇంట్రెస్ట్ 'ఫుట్ బాల్' ఆట మీద తప్ప రైతుల మీద లేదంటూ మండిపడ్డారు.

Eatala Rajender Challenges CM Revanth Reddy Over Farmers Issue

ఆ పాలసీల్లో అర్థముందా?

రైతుల కష్టాలు విన్న అనంతరం ఈటల రాజేందర్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవసాయంపై ఏమాత్రం అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎకరానికి 30 క్వింటాళ్ల తెల్ల జొన్నలు పండితే కేవలం 10 క్వింటాళ్లు మాత్రమే కొంటామనడం, 40 క్వింటాళ్ల మొక్కజొన్న వస్తే 26 క్వింటాళ్లే తీసుకుంటామనడం వెనుక ఉన్న లాజిక్ ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇక కౌలు రైతులైతే ధాన్యం అమ్ముకోవడానికి ఏకంగా భూ యజమాని వచ్చి వేలిముద్ర (Thumb impression) వేయాలనడం దారుణమన్నారు. ముంబై, దుబాయ్, హైదరాబాద్‌లలో ఉన్న ఓనర్లు ఎక్కడినుంచి వస్తారని నిలదీశారు. ఇవన్నీ మెదడు లేని తుగ్లక్ పాలసీలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దమ్ముంటే రాజీనామా చేసి రా!

చివరి గింజ కొనేవరకు రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఈటల.. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. "2034 వరకు నేనే సీఎం అని చెబుతున్నావు కదా.. ఈ దద్దమ్మ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు రైతులు బాధపడుతున్నారు. నీకు దమ్ముంటే ఇప్పుడే రాజీనామా చేయి.. ఎలక్షన్స్ (Elections) కు రా.. నీ సంగతేంటో తెలుస్తుంది" అంటూ ఛాలెంజ్ చేశారు. బీజేపీ నేతలు యాత్రలు చేస్తుంటే ప్రభుత్వం రాజకీయాలు అంటోందని, దమ్ముంటే మంత్రులు కొనుగోలు కేంద్రాలకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.

Eatala Rajender Challenges CM Revanth Reddy Over Farmers Issue

ఈ యాత్రలో బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, హరీష్ రెడ్డి, వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్సీలు, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement