త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

తెలంగాణలో ఏకంగా 1.30 కోట్ల ఓట్ల గల్లంతు వెనుక బీజేపీ కుట్ర ఉందా? టీపీసీసీ జూమ్ మీటింగ్‌లో నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన సీరియస్ వార్నింగ్ ఏంటో తెలుసా?

J

Telangana | Published On Aug 13, 2026, 11.55 pm IST

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

సంక్షిప్త సారాంశం

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్ మీటింగ్‌లో ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 73 లక్షల ఓట్ల తొలగింపు, 64 లక్షల ఓట్లను 'అనామలీస్' జాబితాలో పెట్టడం వెనుక బీజేపీ కుట్ర ఉందని ఏఐసీసీ నేత మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA), మంత్రులు అప్రమత్తంగా ఉండి అర్హులైన ఓటర్లను కాపాడుకోవాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటి నేతపైనైనా కఠిన చర్యలు తప్పవని హైకమాండ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

Advertisement
  • కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ స్ట్రాంగ్ వార్నింగ్

Telangana Voter List Deletion | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో (Telangana) సంచలనం రేపుతున్న 'ఓట్ల గల్లంతు' అంశంపై కాంగ్రెస్ (Congress) హైకమాండ్ సీరియస్ దృష్టి సారించింది. టీపీసీసీ (TPCC) అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగిన జూమ్ మీటింగ్‌లో (Zoom meeting) ఏఐసీసీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ పాల్గొని పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఊహించని స్థాయిలో జరుగుతున్న భారీ ఓట్ల తొలగింపు వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని ఆమె హెచ్చరించారు.

బీజేపీ, ఎన్నికల కమిషన్ కుట్ర

ఎన్నికల కమిషన్ (Election Commission) ఏకంగా 73 లక్షల ఓట్లను తొలగించడం, మరో 64 లక్షల ఓట్లను 'అనామలీస్' (Anomalies - లోపాలున్నవిగా) జాబితాలో పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించాలని ఆమె సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరగలేదని, మొత్తం కోటి 30 లక్షలకు పైగా ఓట్లపై సందిగ్ధత నెలకొనడం పార్టీకి చాలా ప్రమాదకరమని మీనాక్షి నటరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా బీజేపీ (BJP), ఎన్నికల కమిషన్ కలిసి చేస్తున్న కుట్రగా ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తం కావాలని శ్రేణులకు సూచించారు.

ఎమ్మెల్యేలు, BLAలదే కీలక బాధ్యత..

ఓట్ల తొలగింపు పేరుతో జరుగుతున్న ఈ కుట్ర రాజకీయాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి నాయకులపైనే ఉందని ఆమె స్పష్టం చేశారు. బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAs) అత్యంత అప్రమత్తంగా ఉండి, అనర్హుల ఓట్లను తొలగించడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు దక్కేలా పోరాడాలన్నారు. భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికలకు ఇవే ఓట్లు కీలకం కాబట్టి.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర సీనియర్ నేతలు డిజిటల్ (Digital) డేటాను, అనామలీస్ ఓట్లను (Anomalies votes) తీక్షణంగా పరిశీలించాలని ఆదేశించారు. నేటి నుంచే వార్డుల వారీగా ప్రతి ఓటును ట్రాక్ చేయాలని సూచించారు.

నిర్లక్ష్యం చేస్తే వేటే.. ఎంత పెద్ద లీడరైనా సరే

ఓటర్ల జాబితా సవరణ పనులపై ఇంచార్జ్ మంత్రులు, నియోజకవర్గ ఇంచార్జులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని హైకమాండ్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఎక్కడ చిన్న నిర్లక్ష్యం జరిగినా సహించేది లేదని తేల్చి చెప్పింది. క్షేత్రస్థాయిలో సరిగ్గా పనిచేయని కో-ఆర్డినేటర్లను, BLAలను వెంటనే పక్కనబెట్టి, వారి స్థానంలో చైతన్యవంతంగా యాక్టివ్‌గా (Active) పనిచేసే కొత్తవారిని నియమించుకోవాలని సూచించింది. పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించే ఈ కీలక ఘట్టంలో అలసత్వం ప్రదర్శిస్తే.. పదవిలో ఉన్నది ఎంత పెద్ద లీడర్ (Leader) అయినా సరే కఠిన చర్యలు తప్పవని మీనాక్షి నటరాజన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. బద్ధకాన్ని వీడి ఈ ఉపద్రవాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆమె పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement