త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

రవీంద్రభారతి వేదికగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ తప్పు చేస్తే ప్రశ్నిస్తానంటూ సొంత నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

J

Telangana | Published On Aug 13, 2026, 10.30 pm IST

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

సంక్షిప్త సారాంశం

ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న పుస్తకావిష్కరణ సభలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం, కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేని వారు ఇప్పుడు పెద్ద పదవుల్లో ఉన్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తన ఫండింగ్‌తో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఇప్పుడు అధికారం ఉన్న వైపు వెళ్లిపోయారని, కనీసం పలకడం లేదని మండిపడ్డారు. ఏపూరి సోమన్న రాబోయే రోజుల్లో కచ్చితంగా చట్టసభల్లో అడుగుపెడతారని, తాను మాట ఇస్తే వెనక్కి తగ్గేది లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Komatireddy Rajgopal Reddy | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి (Ravindra Bharathi) వేదికగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajgopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న (Epuri Somanna) 25 ఏళ్ల పాటల ప్రస్థానంపై రాసిన పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ప్రస్తుత రాజకీయాలు, సొంత పార్టీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. తాను అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు.

తప్పు చేస్తే కచ్చితంగా ప్రశ్నిస్తా..

రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ మంచి చేస్తే మెచ్చుకుంటానని, తప్పు చేస్తే మాత్రం కచ్చితంగా ప్రశ్నిస్తానని రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ వచ్చాక కూడా పేదలకు సరైన న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "తెలంగాణ ఉద్యమంతో, కాంగ్రెస్ (Congress) పార్టీతో ఏమాత్రం సంబంధం లేని వాళ్లు ఇవాళ పెద్ద పెద్ద పదవుల్లో కూర్చున్నారు. అలాంటి వారిని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోంది," అని ఆయన వ్యాఖ్యానించారు.

అలాంటి 'వసూల్ రాజాల'ను తరిమికొట్టాలి

రాష్ట్ర రాజకీయాలను మార్చే, శాసించే శక్తి తనకు ఉందని, తన నిజాయితీనే తన బలమని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. "నేను డబ్బులు ఇస్తే (Funding) ఎంపీలు, ఎమ్మెల్యేలు అయిన వాళ్లు చాలామంది ఉన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిపిస్తే.. ఇప్పుడు వాళ్లను పిలిచినా రావడం లేదు. వాళ్లకు ఎక్కడ పవర్ (Power) ఉంటే అక్కడికే వెళ్తారు," అని సొంత పార్టీ నేతలకు పరోక్షంగా చురకలంటించారు. కులం, మతం పేరుతో పైకెదిగి 'వసూల్ రాజాలుగా' మారిన నాయకులను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

పేదలకు ఒక రూల్.. పెద్దోళ్లకు ఒక రూలా?

ప్రజాప్రతినిధుల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకసారి గెలవగానే నాయకులకు డబ్బు, అధికారంపై వ్యామోహం పెరుగుతోందని, ఓట్లేసి గెలిపించిన ప్రజలను గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. "ఉన్నోడు వెయ్యి రెట్లు ఎదుగుతుంటే.. లేనోడు అక్కడే ఉంటున్నాడు. పైన ఉన్నవాళ్లు లక్షల కోట్లు దోచుకుంటున్నారు. కానీ ఓ పేదోడికి ఐదు లక్షల ఇల్లు ఇవ్వడానికి మాత్రం 500 రూల్స్ పెడుతున్నారు. సగం ఇల్లు కట్టుకున్నాక ఇంట్లో ఆటో ఉందనో, ట్రాక్టర్ ఉందనో చెప్పి బిల్లులు ఆపేస్తున్నారు," అని సిస్టమ్‌పై అసహనం వ్యక్తం చేశారు. పదవి అనేది ఒక బాధ్యత అని, దాన్ని కిరీటంగా భావించి అహంకారం పెంచుకోవద్దని హితవు పలికారు.

సోమన్న ఎమ్మెల్యే కావడం పక్కా

దోపిడీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏపూరి సోమన్న లాంటి కళాకారులు గజ్జె కట్టాలని, తాను రుమాలు కట్టి ప్రజల్లోకి వస్తానని ఆయన అన్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళల కోసం తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఇన్నేళ్లు ఎంతో ఓపికతో ఉన్నానని, ఇకపై సైలెంట్‌గా ఉండేది లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కళాకారులు చట్టసభల్లో (Assembly) అడుగుపెట్టాలని రాజగోపాల్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే, రాబోయే రోజుల్లో ఏపూరి సోమన్న కచ్చితంగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి చట్టసభల్లో అడుగుపెడతారని, తాను మాట ఇస్తే వెనక్కి పోనని ఆయన సభాముఖంగా హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement