త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్

నల్సార్ యూనివర్సిటీలో సీజేఐ కార్యక్రమాన్ని వ్యతిరేకించినందుకు 2026 లా గ్రాడ్యుయేట్ల ఎన్‌రోల్‌మెంట్‌ను ఆపేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.

J

Hyderabad | Published On Aug 13, 2026, 8.57 pm IST

BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్

సంక్షిప్త సారాంశం

హైదరాబాద్ నల్సార్ (NALSAR) యూనివర్సిటీ నుంచి 2026లో పాస్ అవుతున్న లా గ్రాడ్యుయేట్లను అడ్వకేట్లుగా ఎన్‌రోల్ చేయొద్దని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు BCI ఆదేశించింది. యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్ రాకను వ్యతిరేకిస్తూ జరిగిన ప్రచారమే ఈ కఠిన నిర్ణయానికి కారణం. మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని నల్సార్ వీసీని ఆదేశించిన BCI చైర్మన్ మన్నన్ కుమార్ మిశ్రా.. ఆగస్టు 19న తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆందోళనలకు ప్లాన్ చేసిన నిర్వాహకులకు, కేవలం మద్దతు తెలిపిన విద్యార్థులకు మధ్య వ్యత్యాసం ఉంటుందని కౌన్సిల్ స్పష్టం చేసింది.

Advertisement
  • నల్సార్ విద్యార్థులకు బీసీఐ షాక్
  • సీజేఐ రాకను వ్యతిరేకించినందుకు వేటు
  • ఆందోళనల్లో ఫ్యాకల్టీ హస్తం ఉందా?

BCI NALSAR Controversy | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక న్యాయ విద్యాసంస్థ నల్సార్ యూనివర్సిటీ (NALSAR University of Law) విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ఊహించని షాక్ ఇచ్చింది. నల్సార్ నుంచి 2026లో లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుంటున్న విద్యార్థులెవరినీ న్యాయవాదులుగా (Advocates) ఎన్‌రోల్ చేయొద్దంటూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లను BCI ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.

సీజేఐ రాకకు వ్యతిరేకంగా ప్రచారమే కారణం

యూనివర్సిటీలో జరగనున్న స్నాతకోత్సవ (Convocation) కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే, ఆయన రాకను వ్యతిరేకిస్తూ కొంతమంది విద్యార్థులు క్యాంపస్‌లో ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్ నిర్వహించారు. దీనిపై పబ్లిక్ డొమైన్‌లో ఉన్న నివేదికలను తీవ్రంగా పరిగణించిన బార్ కౌన్సిల్ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా (Manan Kumar Mishra).. ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. న్యాయవ్యవస్థ అత్యున్నత స్థానాన్ని గౌరవించని వారు బాధ్యతాయుతమైన న్యాయవాదులు కాలేరని BCI ఘాటుగా వ్యాఖ్యానించింది.

మూడు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి

ఈ ఘటనపై వాస్తవాలతో కూడిన అధికారిక నివేదికను మూడు రోజుల్లోగా సమర్పించాలని నల్సార్ వైస్-ఛాన్సలర్‌ను బార్ కౌన్సిల్ ఆదేశించింది. ఆగస్టు 19న దీనిపై తదుపరి విచారణ జరుపుతామని వెల్లడించింది. ఈ ఆందోళనను ప్లాన్ చేసిన వారు, ముసాయిదా రాసిన వారు, సోషల్ మీడియాలో (Social media) ప్రచారం చేసిన వారు, సమావేశాలు నిర్వహించిన వ్యక్తుల వివరాలను కచ్చితమైన ఆధారాలతో గుర్తించాలని వర్సిటీని కోరింది.

ఫ్యాకల్టీ హస్తం ఉందా?

విద్యార్థుల నిరసన వెనుక ఏదైనా విద్యార్థి సంఘం (Students' union) పాత్ర ఉందా? లేదా యూనివర్సిటీ ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్లు, పూర్వ విద్యార్థులు ఎవరైనా విద్యార్థులను రెచ్చగొట్టారా? అనే దానిపై కూడా ఆరా తీయాలని BCI ఆదేశించింది. దీనికి సంబంధించి మీటింగ్ మినట్స్, అజెండాలు, పర్మిషన్ లెటర్లు సమర్పించాలని పేర్కొంది. కొందరు అధ్యాపకులు తమ బోధనను పక్కనబెట్టి క్యాంపస్‌లో మురికి రాజకీయాలు చేస్తున్నారని తమకు సమాచారం ఉందని BCI లేఖలో ఆరోపించింది.

ఆ విద్యార్థులకు మాత్రం ఊరట

నిరసనల్లో పాల్గొన్న వారందరిపైనా ఆటోమేటిక్‌గా అనర్హత వేటు పడదని బార్ కౌన్సిల్ క్లారిటీ ఇచ్చింది. నిరసనకు సంబంధించిన పత్రాలపై కేవలం సంతకం చేసి మద్దతు తెలిపిన వారికి.. ఆందోళనలను దగ్గరుండి ప్లాన్ చేసి, బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చిన నిర్వాహకులకు మధ్య కచ్చితమైన వ్యత్యాసం ఉంటుందని స్పష్టం చేసింది. పూర్తి విచారణ పూర్తయ్యే వరకు, విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తుల పేర్లను స్టేట్ బార్ కౌన్సిల్స్ ఎన్‌రోల్ చేయకూడదని తేల్చిచెప్పింది.

Advertisement
Advertisement