త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telegram Ban India | నీట్ పరీక్ష ముందే షాక్: ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. వాట్సప్‌ను మాత్రం ఎందుకు వదిలేశారో తెలుసా?

జూన్ 21న జరగబోయే NEET రీ-టెస్ట్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌పై ఆంక్షలు విధించింది. రెండు యాప్స్ ఒకేలా ఉన్నా.. వాట్సాప్‌ను కాదని టెలిగ్రామ్‌నే ఎందుకు టార్గెట్ చేశారు?

J

Technology | Published On Jun 16, 2026, 5.41 pm IST

Telegram Ban India | నీట్ పరీక్ష ముందే షాక్: ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. వాట్సప్‌ను మాత్రం ఎందుకు వదిలేశారో తెలుసా?

సంక్షిప్త సారాంశం

NEET రీ-ఎగ్జామ్ ముందే నకిలీ పేపర్లు అమ్ముతున్నారనే కారణంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిఫారసు మేరకు టెలిగ్రామ్‌పై కేంద్రం ఆంక్షలు విధించింది. వాట్సప్‌లో డీఫాల్ట్‌గా ఉండే 'ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్' ఫీచర్ టెలిగ్రామ్‌లో సాధారణ చాట్స్‌కు ఉండకపోవడం పెద్ద మైనస్. టెలిగ్రామ్‌లో ఫోన్ నంబర్ దాచేసి అజ్ఞాతంగా (Anonymous) అపరిమిత సబ్‌స్క్రైబర్లతో చానల్స్ నడపవచ్చు, ఇది కేటుగాళ్లకు అడ్డాగా మారింది. మెటా (Meta) సంస్థ వాట్సప్‌లో పటిష్టమైన AI టూల్స్ ద్వారా నిఘా పెడుతుంది, పైగా టెలిగ్రామ్‌కు భారత్‌లో ఎలాంటి అధికారిక ఆఫీస్ లేదు.

Advertisement

Telegram Ban India | త్రినేత్ర.న్యూస్ : జూన్ 21న జరగబోయే నీట్ (NEET) రీ-టెస్ట్ కంటే ముందే కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) పై తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడే అందరికీ ఒక పెద్ద అనుమానం మొదలైంది. టెలిగ్రామ్ లాగే వందల కోట్ల మంది వాడే వాట్సప్ (WhatsApp) కూడా మెసేజింగ్ యాపే కదా.. మరి కేవలం టెలిగ్రామ్‌ను మాత్రమే ఎందుకు బ్యాన్ చేశారు? వాట్సప్‌ను ఎందుకు వదిలేశారు? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

టెలిగ్రామ్‌పై ఎందుకీ వేటు?

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇచ్చిన బలమైన సిఫారసుల మేరకే ప్రభుత్వం టెలిగ్రామ్‌పై ఈ చర్యలు తీసుకుంది. "PAPER LEAKED NEET”, “Re-NEET 2026”, “Private Mafia” లాంటి పేర్లతో టెలిగ్రామ్‌లో కొన్ని గ్రూపులు, చానల్స్ క్రియేట్ చేసి.. లీకైన ఒరిజినల్ క్వశ్చన్ పేపర్లు ఇస్తామంటూ అక్రమార్కులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఎన్‌టీఏ గుర్తించింది. ఎన్ని చానల్స్ డిలీట్ చేసినా మళ్లీ కొత్తవి పుట్టుకొస్తుండటంతో, పరీక్ష పారదర్శకత కోసం యాప్‌పైనే కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు.

కేటుగాళ్లు వాట్సప్‌కు ఎందుకు మారలేరు?

టెలిగ్రామ్ బ్యాన్ అయితే ఆ స్కామర్లంతా వాట్సప్‌లోకి వచ్చేసి గ్రూపులు పెట్టేయచ్చు కదా? అని మీకు అనిపించవచ్చు. కానీ, టెలిగ్రామ్ డిజైన్ చేసిన విధానానికి, వాట్సప్ పనితీరుకు మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్‌నే ఎంచుకోవడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి.

అజ్ఞాతం (Anonymity), అపరిమిత గ్రూపులు

వాట్సాప్‌లో గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఫోన్ నంబర్ అందరికీ కనిపిస్తుంది. కానీ టెలిగ్రామ్‌లో మీ నంబర్ ఎవరికీ తెలియకుండా కేవలం ఒక 'యూజర్‌నేమ్' (Username) తో ప్రొఫైల్ రన్ చేయవచ్చు. పైగా, టెలిగ్రామ్ చానల్స్‌లో అపరిమితంగా (Unlimited) లక్షల మంది సబ్‌స్క్రైబర్లను యాడ్ చేసుకోవచ్చు. తమ ఐడెంటిటీ బయటపడకుండా కోట్లాది మందికి నకిలీ పేపర్లు చేరవేయడానికి నేరగాళ్లకు ఇది ఒక సేఫ్ జోన్‌లా మారింది.

ఎడిట్ ఆప్షన్ (Edit Feature) మాయాజాలం

టెలిగ్రామ్‌లో పాత మెసేజ్‌లను ఎప్పుడు పడితే అప్పుడు ఎడిట్ చేయవచ్చు, పాత టైమ్‌స్టాంప్ అలాగే ఉంటుంది. ఎన్‌టీఏ నివేదిక ప్రకారం.. అక్రమార్కులు పాత మెసేజ్‌లను ఎడిట్ చేసి, అక్కడ క్వశ్చన్ పేపర్ పీడీఎఫ్ (PDF) ఫైల్స్ పెట్టి.. "చూశారా, మేము పరీక్ష కంటే ముందే పేపర్ లీక్ చేశాం" అంటూ నకిలీ ఆధారాలు సృష్టించి విద్యార్థులను మోసం చేస్తున్నారు. అందుకే భారత్‌లో జూన్ 30 వరకు టెలిగ్రామ్‌లో ఈ ఎడిట్ ఫీచర్‌ను కూడా నిలిపివేశారు.

లార్జ్ ఫైల్ షేరింగ్ (2GB వాల్యూమ్)

సిగ్నల్ లేదా వాట్సప్ యాప్స్‌తో పోలిస్తే టెలిగ్రామ్‌లో ఏకంగా 2జీబీ సైజు ఉన్న ఫైళ్లను ఎలాంటి కంప్రెషన్ లేకుండా ఒరిజినల్ క్వాలిటీతో షేర్ చేయవచ్చు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇక్కడే లీక్ అవ్వడానికి కూడా ఇదే కారణం. ఇప్పుడు పరీక్ష పేపర్లను భారీ స్థాయిలో సర్క్యులేట్ చేయడానికి కూడా ఈ ఫీచర్‌నే వాడుకుంటున్నారు.

వాట్సప్‌ను ఎందుకు ముట్టుకోలేదంటే..?

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్.. ప్రభుత్వాల నిఘాకు లొంగని ఒక స్వతంత్ర ప్లాట్‌ఫామ్‌గా దీనిని డిజైన్ చేశారు. పైగా టెలిగ్రామ్‌కు భారత్‌లో ఎలాంటి అధికారిక కార్యాలయం (Office) లేదు. దీంతో ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడం క్లిష్టంగా మారుతుంది.

కానీ వాట్సప్ యజమాన్య సంస్థ అయిన మెటా (Meta), భారత ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేస్తుంది. వాట్సప్‌లో డీఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది. అంటే యూజర్ల ప్రైవేట్ చాట్స్‌ను మెటా చూడలేదు. కానీ, పబ్లిక్ గ్రూపుల్లో జరిగే మోసాలను, యూజర్ల ప్రవర్తనను పసిగట్టేందుకు మెటా సంస్థ శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI Tools) సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఎవరైనా తప్పుడు పనులు చేస్తే వెంటనే అకౌంట్స్ బ్యాన్ అవుతాయి. ఈ పటిష్టమైన పోలీసింగ్ వ్యవస్థ వల్లే వాట్సప్ సురక్షితంగా నిలిచింది.

ప్రస్తుతం టెలిగ్రామ్ కూడా తన పద్ధతి మార్చుకుని రోజుకు 80,000 నుంచి 1,40,000 తప్పుడు ఛానల్స్‌ను బ్లాక్ చేస్తున్నప్పటికీ.. నీట్ పరీక్ష దృష్ట్యా భారత్‌లో ఈ యాప్‌పై ప్రస్తుతానికి కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

Advertisement
Advertisement