త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adilabad Airport | ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ కల సాకారం దిశగా కీలక ముందడుగు

Adilabad Airport | ఆదిలాబాద్ జిల్లాలో దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న విమానాశ్రయ కల సాకారం దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత జాయింట్ యూజర్ (డిఫెన్స్–సివిల్) ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో చేపడతామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు.

P

Telangana | Published On Jun 16, 2026, 5.09 pm IST

Adilabad Airport | ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ కల సాకారం దిశగా కీలక ముందడుగు
Advertisement
  • భూసేకరణ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తాం: కలెక్టర్ రాజర్షి షా
  • డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాల ప్రతిపాదన
  • ఎంపీ, ఎమ్మెల్యే, ఎయిర్‌ఫోర్స్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష

Adilabad Airport | ఆదిలాబాద్ జిల్లాలో దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న విమానాశ్రయ కల సాకారం దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత జాయింట్ యూజర్ (డిఫెన్స్–సివిల్) ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో చేపడతామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, బెంగళూరుకు చెందిన ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు, రాష్ట్ర సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డితో కలిసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా ప్రతిపాదిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి, మైక్రో లెవెల్ సర్వే చేపట్టారు. రన్‌వే విస్తరణ, భూసేకరణ, సాంకేతిక అంశాలపై సమగ్రంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

భూసేక‌ర‌ణ వేగ‌వంతం..

ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చర్యలను వేగవంతం చేశామని తెలిపారు. ఇప్పటికే 700 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని, అదనంగా డిఫెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగా ఎయిర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ కోసం 1,500 ఎకరాలు, రన్‌వే విస్తరణ కోసం మరో 80 ఎకరాలకు ప్రాథమిక ఆమోదం లభించిందని వెల్లడించారు. జియో కోఆర్డినేట్ల ఆధారంగా భూసేకరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. సీఎంఓ, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసి రక్షణ శాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీకి భూములను అప్పగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సివిల్ ఏవియేషన్‌తో పాటు డిఫెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా జిల్లాకు రావడం ఆదిలాబాద్ అభివృద్ధిలో చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ స్థాయిలో ఇప్పటికే చర్చలు

ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ, ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదిత ప్రాంతాల పరిశీలన విజయవంతంగా పూర్తయిందన్నారు. గత మార్చిలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డిలతో ఈ ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలిపారు. అలాగే మే 15న కేంద్ర ఉన్నతస్థాయి బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించిందని గుర్తుచేశారు. రక్షణ శాఖ కోరిన 1,500 ఎకరాల భూసేకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. జిల్లా అధికారులతో కలిసి మ్యాప్‌ల ఆధారంగా మైక్రో లెవెల్ సమీక్ష నిర్వహించామని, ప్రాజెక్టు అమలును వేగవంతం చేయడంలో ఈ సమావేశం కీలక ముందడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

దశాబ్దాల కల నెరవేరబోతోంది

ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణ అంశంపై నిర్వహించిన తాజా సమావేశంతో పలు అంశాలపై స్పష్టత వచ్చిందన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి మొత్తం 1,840 ఎకరాల భూమి అవసరమవుతుందని, ఇందులో 1,500 ఎకరాలను రక్షణ శాఖకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ పంపిందని తెలిపారు. ఇప్పటికే 360 ఎకరాలు రక్షణ శాఖ పరిధిలో ఉన్నాయని, రన్‌వే విస్తరణ కోసం మరో 80 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. గతంలో జారీ చేసిన 700 ఎకరాల జీవో ప్రకారం పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన 800 ఎకరాలకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోందని వివరించారు.

త్వ‌ర‌లో ఢిల్లీలో ఉమ్మ‌డి స‌మావేశం

ప్రాజెక్టుకు సంబంధించిన తదుపరి విధానపరమైన నిర్ణయాల కోసం త్వరలో ఎంపీ నేతృత్వంలో ఢిల్లీలో ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రాజ్‌నాథ్ సింగ్‌లతో చర్చలు జరగనున్నాయని వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుతో ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల కల నెరవేరడంతో పాటు జిల్లా అభివృద్ధికి కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్ చిత్రు, ఎస్ రాజేశ్వర్, ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు జేపీ సబర్వాల్, ఎస్‌జీ హెడ్గే, ఎస్‌కే రెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్, ల్యాండ్ సర్వే ఏడీ ప్రభాకర్, తహశీల్దార్లు శ్రీనివాస్, గోవింద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement