త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung Solve for Tomorrow | శాంసంగ్ సాల్వ్ ఫర్ టుమారో 5వ ఎడిషన్.. విద్యార్థులు రూ.2 కోట్ల వరకు గ్రాంట్లు పొందే చాన్స్‌..

Samsung Solve for Tomorrow | దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ భారత్‌లో తన ప్రతిష్టాత్మక విద్య, ఆవిష్కరణ కార్యక్రమం శాంసంగ్ సాల్వ్ ఫర్ టుమారో ఐదో ఎడిషన్‌ను ప్రారంభించింది. దేశంలో సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2026 ఎడిషన్‌ను మరింత విస్తరించింది.

S

Technology | Published On May 9, 2026, 10.25 am IST

Samsung Solve for Tomorrow | శాంసంగ్ సాల్వ్ ఫర్ టుమారో 5వ ఎడిషన్.. విద్యార్థులు రూ.2 కోట్ల వరకు గ్రాంట్లు పొందే చాన్స్‌..
Advertisement

Samsung Solve for Tomorrow | దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ భారత్‌లో తన ప్రతిష్టాత్మక విద్య, ఆవిష్కరణ కార్యక్రమం శాంసంగ్ సాల్వ్ ఫర్ టుమారో ఐదో ఎడిషన్‌ను ప్రారంభించింది. దేశంలో సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2026 ఎడిషన్‌ను మరింత విస్తరించింది. భారత్ ఆవిష్కరణ ఎకోసిస్టమ్‌కు మద్దతు ఇవ్వడం, డిజిటల్ ఇండియా కార్యక్రమానికి అనుసంధానంగా ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. యువ ఆవిష్కర్తలు వాస్తవ ప్రపంచ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. ఈ ఏడాది కార్యక్రమానికి 14 నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు క‌లిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో పాల్గొనేవారు తమ సాంకేతిక పరిష్కారాలను నాలుగు ప్రధాన విభాగాల్లో సమర్పించాల్సి ఉంటుంది.

జూలై 3 వ‌ర‌కు నాలుగు విభాగాల్లో ద‌ర‌ఖాస్తులు..

ఏఐ లివింగ్ ఫర్ ఇండియా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్‌మెంటల్ సస్టైనబిలిటీ, స్పోర్ట్ అండ్ టెక్ విభాగాల్లో విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ విభాగాలు, సమగ్ర భవిష్యత్‌కు సిద్ధమైన అభివృద్ధిలో, టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్న రంగాలను ప్రతిబింబిస్తున్నాయని కంపెనీ పేర్కొంది. ఆరు నెలల పాటు కొనసాగే ఈ కార్యక్రమం, ప్రారంభ ఆలోచన నుంచి విస్తరించగల పరిష్కారాల అభివృద్ధి వరకు విద్యార్థులకు మార్గదర్శకత్వం అందిస్తుంది. దరఖాస్తుల ప్రక్రియ మే 7న ప్రారంభం కాగా జూలై 3 వరకు కొనసాగుతుంది. దరఖాస్తుల దశలో దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో 100 డిజైన్ థింకింగ్ వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు.

అనుభ‌వ‌జ్ఞుల‌తో ప్ర‌త్యేక మెంట‌రింగ్‌..

టాప్ 100 కు ప్రతి థీమ్ నుంచి 25 జట్ల‌ను ఎంపిక చేస్తారు. వారికి నిపుణుల ఆధ్వర్యంలో ఆన్‌లైన్ శిక్షణ ఇస్తారు. టాప్ 40కి వ‌చ్చే వ‌ర‌కు వీడియో పిచ్ మూల్యాంకనం తర్వాత ప్రతి థీమ్ నుంచి 10 జట్లు ముందుకు వెళ్తాయి. టాప్ 20 ద‌శ‌లో సెమీఫైనల్స్ అనంతరం ప్రతి థీమ్ నుంచి 5 జట్లు గ్రాండ్ ఫినాలేకి ఎంపికవుతాయి. పోటీలో ముందుకు సాగే కొద్దీ పాల్గొనేవారికి అధిక స్థాయి మద్దతు, పరిశ్రమ అనుభవం లభిస్తుంది. సెమీఫైనలిస్టులకు శాంసంగ్ ఎగ్జిక్యూటివ్‌లు, పరిశ్రమ నిపుణులతో ప్రత్యేక మెంటరింగ్ సెషన్లు నిర్వహిస్తారు. కార్పొరేట్ ఇన్నోవేషన్ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు బెంగళూరు, నోయిడా, ఢిల్లీ నగరాల్లో ఉన్న శాంసంగ్ ప్రధాన కార్యాలయం, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రాలను సందర్శించే అవకాశాన్ని కల్పిస్తారు. తదుపరి దశలకు చేరిన జట్లు ఇమ్మర్సివ్ రెసిడెన్షియల్ బూట్‌క్యాంప్, ప్రోటోటైపింగ్ కార్యక్రమాల్లో పాల్గొని ఇన్వెస్టర్ మీట్‌లు, ఫైనల్ ప్రెజెంటేషన్లకు తమ ప్రాజెక్టులను సిద్ధం చేయాల్సి ఉంటుంది.

రూ.2 కోట్ల వ‌ర‌కు పొందే చాన్స్‌..

ముందుకు సాగే జట్లకు శాంసంగ్ పలు దశల్లో ఆర్థిక మద్దతు, బహుమతులను ప్రకటించింది. టాప్ 100 జట్లకు సర్టిఫికెట్ల‌ను ప్ర‌దానం చేస్తారు. టాప్ 40 జట్లకు రూ.8 లక్షల గ్రాంట్, ప్రతి సభ్యుడికి శాంసంగ్ ల్యాప్‌టాప్‌లు ఇస్తారు. టాప్ 20 జట్లకు రూ.20 లక్షల గ్రాంట్, ప్రతి సభ్యుడికి శాంసంగ్ గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్లను ఇస్తారు. టాప్ 4 విజేత జట్లకు రూ.2 కోట్ల ఇంకుబేషన్ సపోర్ట్, ఐఐటీ ఢిల్లీలో ప్రత్యేక మద్దతు ఇస్తారు. అలాగే డిజిటల్ ఇంపాక్ట్ అవార్డ్, కమ్యూనిటీ చాయిస్ అవార్డ్ ల కోసం మొత్తం కలిపి రూ.2.50 లక్షల ప్రత్యేక బహుమతి నిధిని కూడా సంస్థ‌ ప్రకటించింది.

మ‌రింత లోతుగా విస్త‌ర‌ణ‌..

శాంసంగ్ సాల్వ్ ఫర్ టుమారో కార్యక్రమాన్ని తొలిసారిగా 2010లో అమెరికాలో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం 68 దేశాలకు విస్తరించి, ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలకు పైగా యువతను టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణల్లో భాగస్వామ్యం చేసింది. ఈ సంద‌ర్భంగా శాంసంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా అధ్యక్షుడు, సీఈవో జేబీ పార్క్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా దేశ డిజిటల్, ఆవిష్కరణ ప్రయాణంలో విశ్వసనీయ భాగస్వామిగా ఉండటం గర్వంగా ఉంద‌న్నారు. యువత ఆధ్వర్యంలో పెరుగుతున్న ఇన్నోవేషన్ సంస్కృతికి తాము మద్దతు ఇస్తున్నామ‌ని తెలిపారు. శాంసంగ్ సాల్వ్ ఫర్ టుమారో యువ ఆవిష్కర్తలను ప్రోత్సహిస్తూ వాస్తవ సమస్యలకు పరిష్కారాలు చూపే స్టార్టప్‌లను తయారుచేసే బలమైన వేదికగా మారింద‌ని, 2026 ఎడిషన్‌తో భారత్ అంతటా మరింత లోతుగా విస్త‌రిస్తున్నామ‌ని, పాఠశాలల్లో త‌మ‌ చేరువను రెట్టింపు చేస్తున్నామ‌ని తెలిపారు.

Advertisement
Advertisement