త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Microsoft | విండోస్ 10 యూజర్లకు మైక్రోసాఫ్ట్ గుడ్ న్యూస్.. మరో ఏడాది సెక్యూరిటీ అప్‌డేట్స్..

Microsoft | టెక్ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ గతేడాది త‌న విండోస్ 10 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ కు అధికారిక సపోర్ట్‌ను ముగించిన విష‌యం తెలిసిందే. ఆ సమయంలో విండోస్ 11కు అవసరమైన కనీస హార్డ్‌వేర్ అర్హతలు లేని కంప్యూటర్లను ఉపయోగిస్తున్న వారికి రెండు మార్గాలను సూచించింది.

S

Technology | Published On Jun 27, 2026, 11.34 am IST

Microsoft | విండోస్ 10 యూజర్లకు మైక్రోసాఫ్ట్ గుడ్ న్యూస్.. మరో ఏడాది సెక్యూరిటీ అప్‌డేట్స్..
Advertisement

Microsoft | టెక్ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ గతేడాది త‌న విండోస్ 10 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ కు అధికారిక సపోర్ట్‌ను ముగించిన విష‌యం తెలిసిందే. ఆ సమయంలో విండోస్ 11కు అవసరమైన కనీస హార్డ్‌వేర్ అర్హతలు లేని కంప్యూటర్లను ఉపయోగిస్తున్న వారికి రెండు మార్గాలను సూచించింది. ఒకటి విండోస్ 10 కన్స్యూమర్ ఎక్స్‌టెండెడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ (ఈఎస్యూ) ప్రోగ్రామ్‌లో చేరడం, లేదా కొత్త డివైస్‌కు అప్‌గ్రేడ్ కావడం. ఈ ఈఎస్యూ ప్రోగ్రామ్ ఈ ఏడాది అక్టోబర్‌తో శాశ్వతంగా ముగియాల్సి ఉండగా, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ దాన్ని మరో ఏడాదిపాటు పొడిగించింది. పాత ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇంకా ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఇది ఊరటనిచ్చే విష‌యంగా మారింది. మైక్రోసాఫ్ట్ తెలిపిన ప్రకారం అర్హత ఉన్న విండోస్ 10 వినియోగదారులు ఇప్పుడు 2027 అక్టోబర్ 12 వరకు విండోస్ 10 కన్స్యూమర్ ఈఎస్యూ ప్రోగ్రామ్ ద్వారా సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందే అవకాశం ఉంటుంది. వినియోగదారుల నుంచి వచ్చిన వ్యతిరేక స్పందన నేపథ్యంలో 2025లో ఈ ప్రోగ్రామ్‌ను మొదటిసారి ప్రకటించినట్లు కంపెనీ గుర్తు చేసింది.

వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ వ‌ర‌కు పొడిగింపు..

మైక్రోసాఫ్ట్ తన సపోర్ట్ డాక్యుమెంట్‌లో ఈ సందర్భంగా ప‌లు వివ‌రాల‌ను వెల్ల‌డించింది. విండోస్ 10 సపోర్ట్ ముగిసింద‌ని, అయితే ఈఎస్యూ ప్రోగ్రామ్ 2027 అక్టోబర్ 12 వరకు కొనసాగుతుంద‌ని తెలిపింది. ఆ తేదీ వరకు ఎప్పుడైనా ఈఎస్యూలో చేరవచ్చ‌ని, ఇప్పటికే ఈఎస్యూలో చేరిన వినియోగదారుల సెక్యూరిటీ కవరేజ్ ఆటోమేటిక్‌గా 2027 అక్టోబర్ 12 వరకు కొనసాగుతుంద‌ని తెలిపింది. వారి నుంచి ఎలాంటి అదనపు చర్య అవసరం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ తాజా పొడిగింపుతో పాత కంప్యూటర్లను ఉపయోగిస్తున్న వారికి విండోస్ 11కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు లేదా కొత్త డివైస్ కొనుగోలు చేసేందుకు మరింత సమయం లభిస్తుంది. ముఖ్యంగా విండోస్ 11 హార్డ్‌వేర్ అర్హతలు లేని కంప్యూటర్లు కూడా ఈఎస్యూ ప్రోగ్రామ్‌లో చేరి మరో ఏడాది పాటు సెక్యూరిటీ రక్షణ పొందవచ్చు.

ఏయే వెర్ష‌న్‌లు ఉండాలి..

అయితే ఈఎస్యూలో చేరే వరకు కంప్యూటర్లు వైరస్‌లు, మాల్వేర్ వంటి సైబర్ ముప్పులకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. అందువల్ల వీలైనంత త్వరగా ఈ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఈఎస్యూ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్న వినియోగదారులు ఎలాంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. వారి ఈఎస్యూ లైసెన్స్ ను ఆటోమేటిగ్గా 2027 అక్టోబర్ 12 వరకు పొడిగిస్తారు. ఒక ఈఎస్యూ లైసెన్స్ ద్వారా గరిష్ఠంగా 10 డివైస్‌లకు సెక్యూరిటీ కవరేజ్ పొందవచ్చు. ఈఎస్యూలో చేరాలంటే వినియోగదారులు తమ మైక్రోసాఫ్ట్ అకౌంట్ లో సైన్ ఇన్ కావాలి. విండోస్ 10 వెర్షన్ 22హెచ్2 హోమ్, ప్రొఫెషనల్, ప్రో ఎడ్యుకేషన్, వర్క్‌స్టేషన్స్ ఎడిషన్ నడుస్తున్న డివైస్‌లు ఈ కన్స్యూమర్ ఈఎస్యూ ప్రోగ్రామ్‌లో అర్హ‌త పొందుతాయి. అలాగే డివైస్‌లో తాజా విండోస్ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసి ఉండటం తప్పనిసరి.

Advertisement
Advertisement