త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Whatsapp | వాట్సాప్ మ‌న చాట్‌ల‌ను చ‌దువుతుందా..? ‘మెటా’పై తీవ్ర ఆరోప‌ణ‌లు..

Whatsapp | ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌కు ఎన్నో ర‌కాల ఫీచ‌ర్ల‌ను అందిస్తోంది. వాటిల్లో end-to-end encryption అనే ఫీచ‌ర్ కూడా ఒక‌టి. దీని వ‌ల్ల వాట్సాప్‌లో యూజ‌ర్లు పంపించుకునే మెసేజ్ ల‌ను వాట్సాప్ లేదా ఇతర థర్డ్ పార్టీ వ్య‌క్తులు, సంస్థ‌లు యాక్సెస్ చేసే అవ‌కాశం లేదు.

S

Technology | Published On Jan 27, 2026, 12.22 pm IST

Whatsapp | వాట్సాప్ మ‌న చాట్‌ల‌ను చ‌దువుతుందా..? ‘మెటా’పై తీవ్ర ఆరోప‌ణ‌లు..
Advertisement

Whatsapp | ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌కు ఎన్నో ర‌కాల ఫీచ‌ర్ల‌ను అందిస్తోంది. వాటిల్లో end-to-end encryption అనే ఫీచ‌ర్ కూడా ఒక‌టి. దీని వ‌ల్ల వాట్సాప్‌లో యూజ‌ర్లు పంపించుకునే మెసేజ్ ల‌ను వాట్సాప్ లేదా ఇతర థర్డ్ పార్టీ వ్య‌క్తులు, సంస్థ‌లు యాక్సెస్ చేసే అవ‌కాశం లేదు. కేవ‌లం సెండ‌ర్‌, రిసీవ‌ర్ మాత్ర‌మే ఆ మెసేజ్‌ల‌ను చూడ‌గ‌లుగుతారు. ఇదే విష‌యాన్ని వాట్సాప్ మాతృసంస్థ మెటా ఎప్ప‌టి నుంచో చెబుతూ వ‌స్తోంది. అయితే తాజాగా ఇదే విష‌యంపై బ్లూమ్‌బ‌ర్గ్ క‌థ‌నం క‌ల‌క‌లం రేపుతోంది. వాట్సాప్‌లో పంపించుకునే మెసేజ్ ల‌ను ఇత‌రులు యాక్సెస్ చేయ‌వ‌చ్చ‌ని ఆరోపిస్తూ కొంద‌రు వ్య‌క్తులు మెటాపై ఫిర్యాదు చేస్తూ కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో ఈ విష‌యం ప్ర‌స్తుతం టెక్ ప్ర‌పంచంతోపాటు సామాజిక మాధ్య‌మాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కోర్టును ఆశ్ర‌యించిన అంత‌ర్జాతీయ బృందం..

వాట్సాప్ లోని ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వ్యవస్థ యూజర్ల సందేశాలను పూర్తిగా సురక్షితంగా ఉంచ‌డం లేదని ఆరోపిస్తూ, ఓ అంతర్జాతీయ వినియోగదారుల బృందం అమెరికాలోని కోర్టును ఆశ్రయించింది. వాట్సాప్ మాతృ సంస్థ మెటా (Meta) యూజ‌ర్ల చాట్‌ల‌ను యాక్సెస్ చేయగలదని ఆరోపిస్తూ, శాన్‌ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో వారు దావా వేశారు. జనవరి 23న దాఖలైన ఈ కేసులో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వ్యవస్థను బాధితులు ఒక మోసం (sham)గా అభివర్ణించారు. ఈ వ్యవస్థ పేరుతో యూజర్లను తప్పుదారి పట్టిస్తున్నారని, తమకు నష్టం జరిగిందని పేర్కొంటూ మెటా నుంచి పరిహారం కోరుతున్న‌ట్లు తెలిపారు.

ఖండించిన మెటా..

అయితే ఈ ఆరోపణలను మెటా సంస్థ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ అసత్యం, హాస్యాస్పదం అని కంపెనీ అధికార ప్రతినిధులు స్పష్టం చేశారు. వాట్సాప్ ప్రకారం, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానంలో సందేశాలను పంపేవారు, స్వీకరించేవారు తప్ప మరెవ్వరూ చదవలేరు. ఎన్‌క్రిప్షన్ కీలు యూజర్ల డివైస్‌లలోనే ఉంటాయి, మెటా వాటిని డీక్రిప్ట్ చేయడం అసాధ్యం, అని సంస్థ చెబుతోంది. కాగా బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, ఈ కేసులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, మెక్సికో దేశాలకు చెందిన వినియోగదారులు పిటిషనర్లుగా ఉన్నారు. వాట్సాప్, మెటా ఉద్యోగులు ప్రత్యేక మార్గాల ద్వారా ఈ ఎన్‌క్రిప్షన్‌ను దాటవేసి యూజర్ల సందేశాలను చూడగలరని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ తంతు ఎలా జ‌రుగుతుంది.. అన్న విష‌యాన్ని కూడా వారు త‌మ నివేదిక‌ల్లో వివ‌రించారు.

ఎన్‌క్రిప్ష‌న్‌ను ఎలా బైపాస్ చేస్తారు..?

ఆ బృదం వేసిన దావా డాక్యుమెంట్‌లో మొత్తం 51 పేజీలు ఉండ‌గా వారు అందులో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ను ఎలా బైపాస్ (దాట‌వేయ‌డం) చేయ‌వ‌చ్చో వివ‌రించారు. ఎవ‌రైనా ఉద్యోగి లేదా మెటా ఇంజినీర్‌కు ఒక టాస్క్ పంపితే సరిపోతుంది. ఆ టాస్క్‌లో వాట్సాప్ మెసేజీలకు యాక్సెస్ ఎందుకు కావాలో వివరిస్తారు. ఆ తర్వాత ఇంజినీరింగ్ బృందం పెద్దగా పరిశీలించకుండా యాక్సెస్ ఇస్తుంది. ఆ యూజర్‌కు సంబంధించిన యూనిక్ ఐడీతో లింక్ అయిన ప్రత్యేక విడ్జెట్ ద్వారా ఏ యూజర్ మెసేజ్ అయినా చూడవచ్చు, అని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆ మెసేజీలు దాదాపు రియల్‌టైమ్‌లో, ఎన్‌క్రిప్ట్ కాని మెసేజ్‌లతో పాటు కనిపిస్తాయని, యూజర్లు తొలగించామని భావించిన మెసేజ్‌లను కూడా చూడవచ్చని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాంకేతిక ఆధారాలను దావాలో జత చేయలేదని, కానీ వాటిని విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు ఎదుట స్వ‌యంగా వివ‌రించ‌నున్నార‌ని తెలుస్తోంది.

వాట్సాప్ సురక్షితం కాదు: మ‌స్క్‌

ఇక ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో స్పందించిన స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్, వాట్సాప్ సురక్షితం కాదు. సిగ్నల్ కూడా సందేహాస్పదమే. ఎక్స్‌ చాట్ వాడండి.. అంటూ పోస్టు పెట్టారు. కాగా గతేడాది నవంబర్‌లో మస్క్‌కు చెందిన xAI సంస్థ, X ప్లాట్‌ఫామ్‌లో X Chat అనే కొత్త మెసేజింగ్ సేవను ప్రారంభించింది. ఇది వాట్సాప్ వంటి యాప్‌లకు ప్రత్యామ్నాయంగా, గోప్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని సంస్థ ప్రచారం చేస్తోంది. ఈ కొత్త సేవలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, అధునాతన మెసేజ్ కంట్రోల్స్, పాత డీఎంలు, కొత్త చాట్ వ్యవస్థను కలిపే యూనిఫైడ్ ఇన్‌బాక్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని xAI ప్రకటించింది. ఇక వాట్సాప్‌పై వచ్చిన ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా యూజర్ల గోప్యతపై మరోసారి పెద్ద చర్చకు దారి తీస్తోంది. నిజంగా ఎన్‌క్రిప్షన్ ఎంత వ‌ర‌కు ప‌నిచేస్తుంద‌న్న ప్రశ్నకు కోర్టు తీర్పు ఎలా ఉంటుంద‌న్నది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement

తాజావార్తలు

Advertisement