త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

దేశంలోనే తొలి వందేభార‌త్ స్లీప‌ర్ ట్రెయిన్‌.. మ‌రికొద్ది రోజుల్లో ప్రారంభం.. దీని ప్ర‌త్యేక‌తలు ఇవే..!

S

Technology | Published On Dec 9, 2025, 11.59 am IST

దేశంలోనే తొలి వందేభార‌త్ స్లీప‌ర్ ట్రెయిన్‌.. మ‌రికొద్ది రోజుల్లో ప్రారంభం.. దీని ప్ర‌త్యేక‌తలు ఇవే..!
Advertisement

దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల న‌డుమ ఇప్ప‌టికే వందేభార‌త్ చెయిర్ కార్ ట్రెయిన్స్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. వందేభార‌త్ రైళ్ల వ‌ల్ల ప్ర‌యాణికుల‌కు ఎంతో సౌక‌ర్యం ల‌భిస్తోంది. చాలా హాయిగా, వేగంగా కొన్ని వంద‌ల కిలోమీట‌ర్లు ఎలాంటి అల‌స‌ట లేకుండా ప్ర‌యాణం చేయ‌గ‌లుగుతున్నారు. వీటి వ‌ల్ల ఎంతో స‌మ‌యం ఆదా అవుతుంద‌ని, అలాగే చాలా హాయిగా ప్ర‌యాణం చేస్తున్నామ‌ని ప్ర‌యాణికులు చెబుతున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో ఉన్న అన్ని వందే భార‌త్ ట్రెయిన్లు కూర్చుని ప్ర‌యాణించేవే. కానీ అతి త్వ‌ర‌లో తొలి వందేభార‌త్ స్లీప‌ర్ ట్రెయిన్‌ను ప్ర‌వేశపెట్ట‌నున్నారు. ఇందులో ప్రయాణికులు ఎంచ‌క్కా బెర్తుల్లో పడుకుని ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. ఈ రైలు ఢిల్లీ - పాట్నా మార్గం మ‌ధ్య‌లో సేవ‌ల‌ను అందించ‌నుంది.

దేశంలోనే తొలి వందే భారత్ స్లీప‌ర్ ట్రెయిన్‌ను మ‌రి కొద్ది రోజుల్లో భార‌తీయ రైల్వే ఆవిష్క‌రించ‌నుంది. ఈ రైలు నిర్మాణ ప‌నులు ఇప్ప‌టికే పూర్తి కాగా డిసెంబ‌ర్ 12వ తేదీన టెస్ట్ ర‌న్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఢిల్లీ నుంచి పాట్నాకు, పాట్నా నుంచి ఢిల్లీకి ఈ రైలును రాత్రి పూట న‌డిపించ‌నున్నారు. దేశంలో అత్యంత ర‌ద్దీగా ఉండే రైలు మార్గాల్లో ఇదొక‌ట‌ని, అందుక‌నే ఈ మార్గంలో తొలుత ఈ రైలును అందుబాటులోకి తేనున్నామ‌ని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక ఈ వందే భార‌త్ స్లీప‌ర్ ట్రెయిన్‌లో మొత్తం 16 కోచ్‌లు ఉండ‌నున్నాయి. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. ఏసీ 3 టైర్‌, ఏసీ 2 టైర్‌, ఏసీ 1 టైర్‌ల‌లో ప్ర‌యాణికులు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో 11 ఏసీ 3 టైర్ కోచ్‌లు, 4 ఏసీ 2 టైర్ కోచ్‌లు, 1 ఏసీ 1 టైర్ కోచ్ ఉంటాయి. వీటిల్లో మొత్తం క‌లిపి 827 మంది ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు.

ఏసీ 3 టైర్‌లో 611 మంది, ఏసీ 2 టైర్‌లో 188 మంది, ఏసీ 1 టైర్‌లో 24 మంది వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చు. ఈ రైలు టిక్కెట్ల ధ‌ర‌లు రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ చార్జిల‌కు దాదాపుగా స‌మానంగా ఉంటాయ‌ని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ట్రెయిన్‌కు సంబంధించిన మొద‌టి రెండు రేక్‌ల‌ను బెంగ‌ళూరులోని భార‌త్ ఎర్త్ మూవ‌ర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్‌) లో నిర్మిస్తుండ‌గా, వాటి నిర్మాణం దాదాపుగా పూర్త‌యిన‌ట్లు అధికారులు చెప్పారు. డిసెంబ‌ర్ 12న టెస్ట్ ర‌న్ ఉంటుంద‌ని, ఈ ట్రెయిన్ ను న్యూ ఇయ‌ర్ కు ముందుగానే అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు.

కాగా ఈ వందే భార‌త్ స్లీప‌ర్ ట్రెయిన్‌లో హోట‌ల్ లాంటి స‌దుపాయాల‌ను అందించ‌నున్నారు. ఆటోమేటిక్ డోర్స్‌, బ‌యో టాయిలెట్స్‌, సీసీటీవీ కెమెరాలు, ప్ర‌తి బెర్త్‌కు ప‌ర్స‌న‌ల్ రీడింగ్ లైట్స్‌, ప్రీమియం ఇంటీరియ‌ర్ డిజైన్‌, ట‌చ్ ఫ్రీ టాయిలెట్స్‌, స్నానం కోసం వేడినీరు వంటి అధునాత‌న సౌక‌ర్యాల‌ను ఇందులో అందిస్తారు. అలాగే ఈ ట్రెయిన్ గంట‌కు 160 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంద‌ని, అవ‌స‌రం అయితే గంట‌కు 180 కిలోమీట‌ర్ల వేగంతోనూ ఈ ట్రెయిన్‌ను తీసుకెళ్తామ‌ని అధికారులు తెలిపారు. అలాగే ప్ర‌మాదాల‌ను ముందుగానే ప‌సిగ‌ట్టి త‌ప్పించుకునే అత్యంత అధునాత‌న క‌వ‌చ్ యాంటీ కొల్లిష‌న్ టెక్నాల‌జీ ఇందులో ఉంద‌ని అన్నారు. ఇక ఈ ట్రెయిన్ ప్ర‌తి రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి బ‌య‌ల్దేరుతుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం పాట్నాకు చేరుతుంది. అదే స‌మ‌యంలో పాట్నా నుంచి బ‌య‌ల్దేరే మ‌రో వందే భార‌త్ స్లీప‌ర్ ట్రెయిన్ మరుస‌టి రోజు ఉద‌యం ఢిల్లీకి చేరుకుంటుంది. ఇలా ఈ ట్రెయిన్ వారంలో 6 రోజుల పాటు న‌డుస్తుంది. ప్ర‌యాణానికి సుమారుగా 11 నుంచి 11.30 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఈ ట్రెయిన్‌కు ఇప్ప‌టికే ఐఆర్‌సీటీసీలో టిక్కెట్ల బుకింగ్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. కాగా దేశంలో ప్ర‌స్తుతం 164 వందే భార‌త్ చెయిర్ కార్ ట్రెయిన్స్ న‌డుస్తుండ‌గా, త్వ‌ర‌లో ప్ర‌వేశపెట్ట‌నున్న ఈ వందే భార‌త్ స్లీప‌ర్ ట్రెయిన్ ఈ త‌ర‌హాకు చెందిన మొద‌టి రైలు కానుండ‌డం విశేషం.

Advertisement

తాజావార్తలు

Advertisement