Anthropic | అత్యంత పవర్ఫుల్ ఏఐ మోడల్ను లాంచ్ చేయనున్న ఆంథ్రోపిక్.. టెక్ దిగ్గజాల్లో వణుకు..?
Anthropic | టెక్ దిగ్గజ సంస్థ, ప్రముఖ ఏఐ ప్లాట్ ఫామ్ కంపెనీ ఆంథ్రోపిక్ ఇటీవలి కాలంలో ఎంతో పాపులర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఆంథ్రోపిక్కు చెందిన ఏఐ సేవలను ఉపయోగించుకుంటున్న కంపెనీలు, సంస్థల సంఖ్య భారీగా పెరిగింది. సాధారణ యూజర్లు కూడా ఆంథ్రోపిక్ ఏఐ సేవలను గణనీయంగా ఉపయోగిస్తున్నారు.
Technology | Published On Mar 30, 2026, 5.40 pm IST
Anthropic | టెక్ దిగ్గజ సంస్థ, ప్రముఖ ఏఐ ప్లాట్ ఫామ్ కంపెనీ ఆంథ్రోపిక్ ఇటీవలి కాలంలో ఎంతో పాపులర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఆంథ్రోపిక్కు చెందిన ఏఐ సేవలను ఉపయోగించుకుంటున్న కంపెనీలు, సంస్థల సంఖ్య భారీగా పెరిగింది. సాధారణ యూజర్లు కూడా ఆంథ్రోపిక్ ఏఐ సేవలను గణనీయంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఆంథ్రోపిక్ ప్లాట్ఫామ్పై పలు భిన్న రకాల ఏఐ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే క్లాడ్ ఓపస్ 4.6 మోడల్ను కూడా లాంచ్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఆంథ్రోపిక్ విడుదల చేసిన అన్ని ఏఐ మోడల్స్ కన్నా ఓ పవర్ ఫుల్ ఏఐ మోడల్ను త్వరలోనే లాంచ్ చేయనుందని జోరుగా ప్రచారం అందుకుంది. కంపెనీకి చెందిన ఓ బ్లాగ్ పోస్టు లీకవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ మోడల్ వల్ల సైబర్ దాడులు మరింత సులభతరం అవుతాయని, దీన్ని జాగ్రత్తగా వినియోగించాలని టెక్ దిగ్గజ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
క్లాడ్ మైథోస్.. చాలా శక్తివంతం..
ఆంథ్రోపిక్ బ్లాగ్ పోస్టు లీకవడంతో సదరు పవర్ ఫుల్ ఏఐ మోడల్ గురించి ప్రపంచానికి తెలిసింది. ఆ సంస్థ క్లాడ్ మైథోస్ (Claude Mythos) లేదా కేపీబారా అనే కోడ్ పేర్లతో సదరు ఏఐ మోడల్ను అభివృద్ధి చేస్తున్నట్లు బ్లాగ్ పోస్టులో పేర్కొంది. అయితే క్లాడ్ మైథోస్ ఏఐ మోడల్ గురించి వివరాలు లీక్ అవగానే అమెరికాలో సైబర్ సెక్యూరిటీ స్టాక్స్ భారీగా పతనం అయ్యాయి. ఈ మోడల్ వల్ల తమ వ్యాపారానికి నష్టం కలగవచ్చనే ఆందోళనతో పెట్టుబడిదారులు ఆ స్టాక్స్ను భారీ ఎత్తున విక్రయించారు. మరోవైపు ఆంథ్రోపిక్ కూడా ఇప్పటి వరకు తాము లాంచ్ చేసిన అన్ని ఏఐ మోడల్స్ కన్నా క్లాడ్ మైథోస్ ఏఐ మోడల్ అత్యంత శక్తివంతమైనదని ఆ బ్లాగ్ పోస్టులో పేర్కొంది. దీంతో ఈ విషయం టెక్ వర్గాల్లో సంచలనంగా మారింది. క్లాడ్ మైథోస్ ఏఐ మోడల్ సైబర్ దాడులు, సెక్యూరిటీ సిస్టమ్ల మధ్య సమతుల్యతకు భంగం కలిగించే అవకాశాలు ఉన్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణం వల్లనే సైబర్ సెక్యూరిటీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. అమెరికాలోని క్రౌడ్ స్ట్రైక్ అనే సంస్థ షేర్లు 7 శాతం పతనం అవగా, పాలో ఆల్టో నెట్ వర్క్స్ షేర్లు 6 శాతం మేర క్షీణించాయి. జడ్ స్కేలర్ స్టాక్స్ 4.5 శాతం పడిపోయాయి. అలాగే సెంటినల్ వన్, ఓక్టా, ఫోర్టినెట్ సంస్థల స్టాక్స్ కూడా 3 శాతం చొప్పున నష్టపోయాయి.

అత్యంత ప్రమాదకరమైన ఏఐ మోడలా..?
ఆంథ్రోపిక్ బ్లాగ్ పోస్టులో లీకైన వివరాల ప్రకారం క్లాడ్ మైథోస్ను ఇప్పటి వరకు వచ్చిన అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్గా పేర్కొన్నారు. క్లాడ్ ఓపస్ సిరీస్లో ఇది భారీ అప్ గ్రేడ్గా లాంచ్ కానుంది. సాఫ్ట్ వేర్ కోడింగ్, అకడమిక్ రీజనింగ్, సైబర్ సెక్యూరిటీ పనుల్లో క్లాడ్ ఓపస్ 4.6 కన్నా క్లాడ్ మైథోస్ ఎంతో శక్తివంతమైన, మెరుగైన పనితీరు కనబరిచిందని సంస్థ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది. క్లాడ్ మైథోస్ను ఆంథ్రోపిక్ సంస్థ అత్యంత శక్తివంతమైందిగా, ప్రమాదకరమైందిగా వర్ణించింది. ఈ మోడల్ను ఇంకా విడుదల చేయకపోవడానికి కారణం కూడా ఇదేనని నిపుణులు భావిస్తున్నారు. ఆంథ్రోపిక్ సంస్థ లోపలే ఇంటర్నల్గా ఈ మోడల్ వల్ల వచ్చే ప్రమాదాలపై ఆందోళనలు వ్యక్తమైనట్లు సమాచారం. బ్లాగ్ పోస్టులో తెలిపిన ప్రకారం మైథోస్ సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాల్లో ఇతర ఏఐ మోడల్స్ కన్నా చాలా ముందుందని తేలింది. రక్షణ వ్యవస్థలను మించి దాడి చేసే మోడల్స్ వేవ్ను క్లాడ్ మైథోస్ ప్రారంభించే ప్రమాదం ఉందని గుర్తించారు. అందువల్లనే ఈ మోడల్ను ఇంకా రిలీజ్ చేయలేదని తెలుస్తోంది.
మనుషులు కనిపెట్టలేని లోపాలను కూడా..
క్లాడ్ ఓపస్ 4.6తో పోలిస్తే క్లాడ్ మైథోస్ మోడల్ సాఫ్ట్ వేర్ కోడింగ్, అకడమిక్ రీజనింగ్, సైబర్ సెక్యూరిటీ టెస్టుల్లో గణనీయంగా అధిక స్కోర్లను సాధిస్తుందని ఆంథ్రోపిక్కు చెందిన కొందరు నిపుణులు ఆ బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు. కాగా ఆంథ్రోపిక్ అభివృద్ది చేసిన క్లాడ్ ఓపస్ 4.6 మోడల్ ఇప్పటికే అందుబాటులో ఉండగా, ప్రస్తుతానికి దీన్ని శక్తివంతమైన మోడల్గా భావిస్తున్నారు. కానీ మైథోస్ ఇంకా శక్తివంతమైందిగా తేలింది. ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ సదస్సులో క్లాడ్ మైథోస్ మోడల్ 90 నిమిషాల్లోనే ఓ SQL కోడ్లో ఉన్న లోపాన్ని గుర్తించి సరిచేసింది. అలాగే అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ను సాధించింది. తరువాత Linux Kernel లో నెలకొన్న ఓ క్లిష్టమైన సాంకేతిక లోపాన్ని కూడా మైథోస్ గుర్తించింది. ఈ లోపాన్ని మనుషులు కనిపెట్టడం చాలా కష్టమని పరిశోధకుడు నికోలస్ కార్లిని వెల్లడించారు.
దుష్ట ప్రయోజనాలకు వినియోగిస్తే ఎలా..?
క్లాడ్ ఓపస్ 4.6 కన్నా క్లాడ్ మైథోస్ మరింత అధునాతన మోడల్ కాగా దీన్ని దుష్ట ప్రయోజనాల కోసం ఉపయోగించే అవకాశం ఉందని టెక్ దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో నెలల తరబడి ప్రణాళిక, నైపుణ్యం అవసరమైన భారీ స్థాయి సైబర్ దాడులను సైతం ఈ మోడల్ సులభంగా నిర్వహిస్తుందని, అంతేకాకుండా సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఈ ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవడంలో వెనుకబడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆంథ్రోపిక్ ప్రస్తుతం చాలా జాగ్రత్తగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐ ఆధారిత దాడులకు ముందుగానే సిద్ధం అయ్యేలా సంస్థలకు ముందస్తు యాక్సెస్ ఇస్తున్నామని, వారి కోడ్ బేస్లను మరింత స్ట్రాంగ్గా మార్చేలా అవకాశాన్ని కల్పిస్తున్నామని ఆంథ్రోపిక్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






