త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Airtel | ఎయిర్‌టెల్ నుంచి Fraud Alert ఫీచర్.. ఇక OTP మోసాలకు చెక్..

Airtel | టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం Fraud Alert పేరిట మ‌రో నూత‌న‌ సెక్యూరిటీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. AI ఆధారంగా ప‌నిచేసే ఈ టూల్ వ‌ల్ల వన్‌టైమ్ పాస్‌వర్డ్ (OTP) ద్వారా జరిగే బ్యాంకింగ్ మోసాలను అడ్డుకోవ‌చ్చ‌ని ఎయిర్‌టెల్ తెలిపింది.

S

Technology | Published On Feb 11, 2026, 12.43 pm IST

Airtel | ఎయిర్‌టెల్ నుంచి Fraud Alert ఫీచర్.. ఇక OTP మోసాలకు చెక్..
Advertisement

Airtel | టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం Fraud Alert పేరిట మ‌రో నూత‌న‌ సెక్యూరిటీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. AI ఆధారంగా ప‌నిచేసే ఈ టూల్ వ‌ల్ల వన్‌టైమ్ పాస్‌వర్డ్ (OTP) ద్వారా జరిగే బ్యాంకింగ్ మోసాలను అడ్డుకోవ‌చ్చ‌ని ఎయిర్‌టెల్ తెలిపింది. డిజిటల్ స్పామ్, స్కామ్‌లను నియంత్రించే ప్ర‌య‌త్నంలో భాగంగా ఈ నూత‌న ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టామ‌ని సంస్థ తెలిపింది. సోష‌ల్‌ ఇంజినీరింగ్ పద్ధతిని సైబ‌ర్‌ మోసగాళ్లు విస్తృతంగా ఉపయోగిస్తున్నార‌ని, సర్వీస్ ప్రొవైడర్లు, డెలివరీ సిబ్బంది పేరుతో కాల్ చేసి అత్యవసర ప‌రిస్థితిని సృష్టించి బాధితుల నుంచి OTPలను తీసుకుంటున్నార‌ని తెలిపింది. బాధితులు దీన్ని సాధారణ వెరిఫికేష‌న్ గా భావించి తమ OTPలను చెబుతున్నార‌ని, దీంతో బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నార‌ని ఎయిర్ టెల్ తెలియజేసింది.

ఇలా ప‌నిచేస్తుంది..

అయితే ఈ తరహా పరిస్థితులను ముందుగానే గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేసేందుకే తాము ఫ్రాడ్ అల‌ర్ట్ పేరిట నూత‌న ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చామ‌ని ఆ సంస్థ తెలిపింది. ఇక ఫ్రాడ్ అల‌ర్ట్ ఫీచర్ పూర్తిగా ఏఐ ఆధారంగా ప‌నిచేస్తుంది. మొత్తం 3 ద‌శ‌ల్లో ఈ ఫీచ‌ర్ సేవ‌ల‌ను అందిస్తుంది. ఇందులో భాగంగా ముందుగా అనుమానాస్పద ఇన్‌కమింగ్ కాల్‌లను AI సిస్టమ్ గుర్తిస్తుంది. అదే సమయంలో బ్యాంకింగ్ OTP జనరేట్ అయి వినియోగదారుడికి చేరిందో లేదో చెక్ చేస్తుంది. ఈ రెండు సంఘటనలు ఒకేసారి జరిగితే వినియోగదారుడికి రియల్‌టైమ్ హెచ్చరిక పంపుతుంది. ఇలా ఈ ఫీచ‌ర్ ప‌నిచేస్తుంది. అంటే ఓటీపీ వ‌చ్చిన త‌రువాత కాల్ వ‌చ్చినా లేక కాల్ వ‌చ్చాక ఓటీపీ రిసీవ్ చేసుకున్నా రెండూ ఏక‌కాలంలో జ‌రిగితే అలాంటి ప‌రిస్థితిని ఎయిర్‌టెల్ ఫ్రాడ్ అల‌ర్ట్ ఫీచ‌ర్ గుర్తిస్తుంద‌న్న‌మాట‌. ఇదంతా ఏఐ ఆధారంగా జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలో అనుమానాస్ప‌దంగా అనిపిస్తే వెంట‌నే ఈ అలర్ట్ వినియోగదారుడికి హెచ్చ‌రిక పంపిస్తుంది. అంతేకాదు, ఓటీపీ వెంట‌నే ఇత‌రుల‌కు చెప్ప‌కుండా కాల్‌ను హోల్డ్‌లో పెడుతుంది. వినియోగ‌దారుడికి ఆలోచించుకోవాల‌ని చెబుతుంది. అందుకు అవకాశం కూడా ఇస్తుంది. దీంతో వినియోగ‌దారుడు అప్ర‌మ‌త్త‌మై OTP చెప్ప‌కుండా కాల్‌ను కట్ చేయ‌వ‌చ్చు. దీని వ‌ల్ల స్కామ్ జ‌ర‌గ‌కుండా అడ్డుకోవ‌చ్చు.

2 వారాల్లో దేశ‌వ్యాప్తంగా అందుబాటులోకి..

కాగా గత రెండేళ్లలో ఎయిర్‌టెల్ స్పామ్ కాల్ వార్నింగ్‌లు, మాలిషియస్ లింక్ బ్లాకింగ్ వంటి అనేక చర్యల‌ను అమలు చేసింది. అయితే మోసగాళ్లు ప్ర‌జ‌ల‌ బలహీనతలను లక్ష్యంగా చేసుకోవడంతో కొత్త పరిష్కారం అవసరమైంది. Fraud Alert ఫీచర్ నెట్‌వర్క్ స్థాయి భద్రతను వినియోగదారుల ప్రవర్తనతో అనుసంధానిస్తుంది. దీని వ‌ల్ల మోసాల‌ను రియ‌ల్ టైమ్‌లో గుర్తించి అరిక‌ట్టేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఇక ప్రస్తుతం ఈ ఫీచర్ హర్యానాలో అమలులో ఉంది. వచ్చే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా 100 శాతం త‌మ‌ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది.

ఈ సంద‌ర్భంగా ఎయిర్‌టెల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శశ్వత్ శర్మ మాట్లాడుతూ OTPలు డిజిటల్ లావాదేవీల భద్రతలో కీలకమైనవే అయినప్పటికీ నేరగాళ్ల పద్ధతుల వల్ల అవి బలహీనపడుతున్నాయని చెప్పారు. నెట్‌వర్క్ స్థాయిలో రియల్‌టైమ్‌లో మోసాలను గుర్తించి అడ్డుకునే AI ఆధారిత స్వయంచాలక పరిష్కారాన్ని తీసుకొచ్చామని తెలిపారు. విస్తృత పరీక్షల్లో ఇది అధిక క‌చ్చితత్వాన్ని ప్రదర్శించిందని ఆయన పేర్కొన్నారు. ఎయిర్‌టెల్ కొత్త ఫీచర్ వ‌ల్ల బ్యాంకింగ్ ఓటీపీ మోసాలపై వినియోగదారులకు అదనపు రక్షణ ల‌భిస్తుంద‌ని తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement