త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

సిరీస్‌పై క‌న్నేసిన సౌతాఫ్రికా.. విశాఖ వ‌న్డేలో గెలుపెవ‌రిది..? కోహ్లిని ఊరిస్తున్న మ‌రో రికార్డు..!

S

Cricket | Published On Dec 5, 2025, 9.53 am IST

సిరీస్‌పై క‌న్నేసిన సౌతాఫ్రికా.. విశాఖ వ‌న్డేలో గెలుపెవ‌రిది..? కోహ్లిని ఊరిస్తున్న మ‌రో రికార్డు..!
Advertisement

భార‌త్‌తో ఇటీవ‌ల జ‌రిగిన 2 టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన సౌతాఫ్రికా మ‌రో సిరీస్‌పై క‌న్నేసింది. రాయ్‌పూర్‌లో భారీ స్కోరును కూడా సుల‌భంగా చేజ్ చేసిన సఫారీలు ఇప్పుడు విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న వ‌న్డేలోనూ మ‌రోమారు విజృంభించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. వ‌రుస ఓట‌ములతో నిరాశ‌లో కూరుకుపోయిన టీమిండియా మాత్రం ఈ వ‌న్డేను సీరియ‌స్‌గానే తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. భారీ స్కోరు చేసినా కూడా హోం గ్రౌండ్‌లో గెల‌వ‌లేక‌పోవ‌డంపై టీమిండియా ఇంటా బ‌య‌టా తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. ఈ క్ర‌మంలోనే విశాఖ వ‌న్డేలో సౌతాఫ్రికాపై ఎలాగైనా స‌రే గెలిచి సిరీస్‌ను ద‌క్కించుకోవాల‌ని, పోయిన ప‌రువును కాస్త‌యినా ద‌క్కించుకోవాల‌ని టీమిండియా భావిస్తోంది.

డిసెంబ‌ర్ 6వ తేదీన విశాఖ‌లో జ‌ర‌గ‌నున్న ఆఖ‌రి వ‌న్డే కోసం ఇప్ప‌టికే ఇరు జ‌ట్లు అక్క‌డికి చేరుకున్నాయి. ఈ క్ర‌మంలో ఈ మ్యాచ్‌లోనూ టాస్ కీల‌కం కానుంది. గ‌త రెండు వ‌న్డేల్లోనూ మంచు తీవ్ర ప్ర‌భావం చూపించింది. రెండో సారి బ్యాటింగ్ చేసిన జ‌ట్టుకు ఇదే అనుకూలించింది. ఈ క్ర‌మంలోనే టాస్ గెలిచిన జ‌ట్టు ఫీల్డింగ్ తీసుకుని రెండోసారి బ్యాటింగ్ చేసే అవ‌కాశాలు వంద‌ శాతం వ‌ర‌కు ఉన్నాయి. అయితే టెస్టు సిరీస్‌లో బౌల‌ర్లు బాగానే రాణించినా బ్యాట్స్‌మెన్ విఫ‌లం చెంద‌డం వ‌ల్ల టీమిండియా మ్యాచ్‌ల‌లో ఓడిపోవాల్సి వ‌చ్చింది. కానీ వ‌న్డేల‌లో ప‌రిస్థితి మారింది. రెండు సార్లు బ్యాట్స్‌మెన్ 300 పైచిలుకు స్కోరు సాధించారు. మొద‌టి వ‌న్డేలో చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌పోయిన‌ట్లు గెలిచారు. సౌతాఫ్రికా వ‌రుస వికెట్ల‌ను కోల్పోకుండా ఉంటే వారు క‌చ్చితంగా ఆ స్కోర్‌ను చేజ్ చేసి ఉండేవారు. కానీ రెండో వ‌న్డేలో వారు అది చేసి చూపించారు. దీంతో ప్ర‌స్తుతం సిరీస్ స‌మమైంది. ఇక నిర్ణ‌యాత్మ‌క‌మైన మూడో వ‌న్డేలో గెలుపు కోసం రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే టీమిండియా బ్యాటింగ్‌లో ఫ‌ర్వాలేద‌నిపించినా బౌలింగ్‌లో మాత్రం కాస్త ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలుస్తోంది.

బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్ సింగ్‌, కుల‌దీప్ యాద‌వ్ మిన‌హా మిగిలిన వారు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. దీంతో సీనియ‌ర్ బౌల‌ర్ల లేమి జ‌ట్టులో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. సిరాజ్‌, బుమ్రాల‌కు సెలెక్ట‌ర్లు విశ్రాంతిని ఇవ్వ‌డంతో సీనియ‌ర్ బౌల‌ర్ స్థానాన్ని భ‌ర్తీ చేసే ప్లేయ‌ర్‌ను సెలెక్ట్ చేయ‌డంలో సెలెక్ట‌ర్లు అంత‌గా ఆస‌క్తిని చూపించ‌లేదు. దీంతో ఆ విభాగంలో లోపం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే మాజీ క్రికెట‌ర్లు, విశ్లేష‌కులు సైతం ఈ విష‌యంలో అస‌హ‌నం వ్యక్తం చేశారు. ఫిట్‌గా ఉండి దేశ‌వాళీ టోర్నీల్లో రాణిస్తున్న ష‌మీని ప‌క్క‌నబెట్ట‌డం సెలెక్ట‌ర్లు, కోచ్ చేసిన త‌ప్పిదంగా భావిస్తున్నారు. అయితే కోచ్, సెలెక్ట‌ర్లు మాత్రం తమ ఎంపికపై ధీమాగా ఉన్నారు. మూడో వ‌న్డేలో రాణిస్తామ‌ని చెబుతున్నారు. ఇక రెండు వ‌న్డేల్లోనూ వ‌రుస‌గా రెండు సెంచ‌రీలు చేసి మంచి ఆక‌లి మీద ఉన్న విరాట్ కోహ్లి విశాఖ వ‌న్డేలో మూడో సెంచ‌రీ చేసి మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

గ‌తంలో విరాట్ కోహ్లి 2018లో వెస్టిండీస్‌పై మూడు వ‌రుస వ‌న్డే మ్యాచ్‌ల‌లో హ్యాట్రిక్ సెంచ‌రీలు చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు మ‌రో సెంచ‌రీ చేస్తే వ‌న్డేల‌లో రెండు సార్లు హ్యాట్రిక్ సెంచ‌రీలు సాధించిన ప్లేయ‌ర్ల జాబితాలో నిలుస్తాడు. ఈ జాబితాలో ఇప్ప‌టికే పాక్ క్రికెట‌ర్ బాబ‌ర్ ఆజం కొన‌సాగుతుండ‌గా కోహ్లి ఇంకో సెంచ‌రీ చేస్తే ఈ రికార్డు సాధించిన రెండో ప్లేయ‌ర్‌గా రికార్డు సృష్టిస్తాడు. దీంతో విశాఖ మైదానం కోహ్లిని మ‌రో సెంచ‌రీ కోసం ఉవ్విళ్లూరేలా చేస్తోంది. అయితే గ‌తంలో కోహ్లి ఇదే స్టేడియంలో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. విండీస్‌పై ఓ వ‌న్డేలో ఇదే స్టేడియంలో ఏకంగా 157 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కోహ్లికి విశాఖ మైదానం క‌ల‌సి వ‌స్తుంద‌ని, అత‌ను సెంచ‌రీ చేసి రికార్డు నెల‌కొల్ప‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి విశాఖ వ‌న్డేలో గెలుపు ఎవ‌రిని వ‌రిస్తుందో చూడాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement